Tollywood: వినోదానికి విరామం లేదు మిత్రమా!
విరామం లేదు.. వాయిదాల మాటే లేదు.. ఇక వారం వారం వినోదాల విందు భోజనమే.. ఈ మండు వేసవిలో చల్ల చల్లని వినోదాలతో సేదతీరడమే.. ఇటు ప్రేక్షకులు.. అటు చిత్ర వర్గాలు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసే వేసవి సినీ మారథాన్ ఈసారి కాస్త ముందుగానే
విరామం లేదు.. వాయిదాల మాటే లేదు.. ఇక వారం వారం వినోదాల విందు భోజనమే.. ఈ మండు వేసవిలో చల్ల చల్లని వినోదాలతో సేదతీరడమే.. ఇటు ప్రేక్షకులు.. అటు చిత్ర వర్గాలు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసే వేసవి సినీ మారథాన్ ఈసారి కాస్త ముందుగానే షురూ అయింది. కరోనా పరిస్థితుల వల్ల గడిచిన రెండేళ్లు సినీ క్యాలెండర్లో వేసవి వినోదాల సందడి కనిపించలేదు. ఈసారి వేసవికి కరోనా ముప్పు పూర్తిగా తప్పింది. దీంతో రెండేళ్ల నుంచి ఊరిస్తూ వస్తున్న బడా చిత్రాలన్నీ బాక్సాఫీస్ ముందు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఫలితంగా ఈసారి కాస్త ముందుగానే సమ్మర్ వినోదాల సందడి మొదలైంది.
ఈ వారం బాక్సాఫీస్ ముందుకు వరుస కడుతున్న సినిమాల్లో పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’తో పాటు అలియా భట్ ‘గంగూభాయి కాఠియావాడీ’, అజిత్ ‘వలిమై’ వంటి పాన్ ఇండియా చిత్రాలున్నాయి. వీటిలో పవన్, అలియాల సినిమాలు శుక్రవారం విడుదల కానుండగా.. అజిత్ చిత్రం గురువారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ మూడు చిత్రాలపైనా ఇటు సినీప్రియుల్లోనూ అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలి, మలి కరోనా ఉద్ధృతుల తర్వాత తెలుగు చిత్రసీమలో సినిమాల సందడి బాగానే కనిపించింది. ఇటు కోలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీల్లో అంతగా జోష్ కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న ఈ అగ్రతారల సినిమాలపై అందరి దృష్టి నెలకొని ఉంది. ముఖ్యంగా ‘గంగూభాయి కాఠియావాడీ’, ‘వలిమై’ వంటి చిత్రాలు మిగతా అన్ని భాషల్లోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. దీంతో ఇప్పుడు వీటికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన దక్కుతుందోనని చిత్ర వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. వీటికి మంచి స్పందన దక్కి, ప్రేక్షకులు మునుపటిలా వరుస కడితే.. రాబోయే అగ్రతారల చిత్రాలకు గొప్ప భరోసా దొరికినట్లవుతుంది.
మార్చి ఊరిస్తోంది..
ఈ వేసవి సీజన్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నెల మార్చి. సినీప్రియుల్ని ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మార్చి 4న శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్’ చిత్రాలు బాక్సాఫీస్ ముందు అదృష్టం పరీక్షించుకోనున్నాయి. ఆ మరుసటి వారం ఒక్కరోజు వ్యవధిలోనే సూర్య ‘ఈటీ’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. వీటిలో ముందుగా తెరపై మెరిసేది సూర్య సినిమానే. ఇది మార్చి 10న విడుదల కానుంది. ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి విజయాల తర్వాత సూర్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. 1970ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే విభిన్నమైన ప్రేమకథతో రూపొందించారు. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమాపై జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న థియేటర్లలో సందడి చేయనుంది. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటించారు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ల జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కల్పిత కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ఇందులో అల్లూరి పాత్రను చరణ్ పోషించగా.. భీమ్ పాత్రలో తారక్ నటించారు. దాదాపు రూ.400కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంపై జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఏప్రిల్.. తగ్గేదే లే
ఏప్రిల్ తొలి వారం వచ్చేదెవరన్నది ఇంత వరకు తేలకున్నా.. వరుణ్ తేజ్ ‘గని’ ఏప్రిల్ 8న విడుదల కానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. బాక్సింగ్ ఆట నేపథ్యంగా సాగే కథతో అల్లుకున్న చిత్రమిది. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించారు. ఏప్రిల్ 14న యష్ ‘కేజీఎఫ్ 2’తో బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాపై జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించారు. ఇదే తేదీకి విజయ్ ‘బీస్ట్’ విడుదల కానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. నెల్సన్ దిలీప్ తెరకెక్కించిన చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబవుతున్న ఈ సినిమాపై దక్షిణాదిలో మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇదే వారంలో ఏప్రిల్ 15న ‘రామారావు ఆన్ డ్యూటీ’తో వినోదాలు పంచనున్నారు కథానాయకుడు రవితేజ. శరత్ మండవ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో రవితేజ నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తుది దశ చిత్రీకరణలో ఉంది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన తొలి సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరు నుంచి వస్తున్న సినిమా కావడం.. ఆయన తొలిసారి తన తనయుడు చరణ్తో కలిసి నటించడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
మేలో.. ఇటు మహేష్ అటు వెంకీ
మార్చి, ఏప్రిల్ తరహాలోనే మేలోనూ వెండితెరపై అగ్రతారల సందడి కనిపించనుంది. మహేష్బాబు నటించిన ‘సర్కారు వారి పాట’, వెంకటేష్ - వరుణ్ తేజ్ల ‘ఎఫ్3’ ఈనెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మే తొలి వారం వచ్చేదెవరన్నది ఇంత వరకు తేలకున్నా.. ఏప్రిల్ 12న ‘సర్కారు వారి పాట’ రాక ఖాయమైంది. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి విజయం తర్వాత మహేష్ నుంచి వస్తున్న చిత్రమిది. పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. ఇందులో మహేష్ బ్యాంక్ అధికారిగా కనిపించనున్నారు. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మే 20న ‘పక్కా కమర్షియల్’తో వినోదాలు పంచనున్నారు కథానాయకుడు గోపీచంద్. ‘ప్రతిరోజూ పండగే’ వంటి విజయం తర్వాత మారుతి నుంచి వస్తున్న చిత్రమిది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర పనుల్లో ఉంది. మే 27న వెంకటేష్ - వరుణ్ తేజ్ల ‘ఎఫ్3’, అడివి శేష్ ‘మేజర్’ చిత్రాలు బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్నాయి. ఈ రెండు చిత్రాలు మే 27న విడుదల కానున్నట్లు ఆయా చిత్ర బృందాలు ఇటీవలే ప్రకటించాయి. ‘ఎఫ్2’కు సీక్వెల్గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమే ‘ఎఫ్3’. ఈ రెండో భాగంతో మూడు రెట్ల వినోదాలు పంచిస్తామని ఆ చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక అడివి శేష్ ‘మేజర్’పైనా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి. 26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమిది. దీన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).