రజనీకాంత్‌ పార్టీ గుర్తు అదేనా..?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ప్రకటించబోయే రాజకీయ పార్టీ గురించే ఇప్పుడు చర్చంతా. డిసెంబర్‌ 31న తన రాజకీయ పార్టీ గురించి మరిన్ని విషయాలు ప్రకటిస్తానని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ పార్టీకి సంబంధించిన ఎలాంటి చిన్నవార్త కూడా బయటికి..

Published : 12 Dec 2020 20:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ప్రకటించబోయే రాజకీయ పార్టీ గురించే ఇప్పుడు చర్చంతా. డిసెంబర్‌ 31న తన రాజకీయ పార్టీ గురించి మరిన్ని విషయాలు ప్రకటిస్తానని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ పార్టీకి సంబంధించిన ఎలాంటి చిన్నవార్త కూడా బయటికి రాకూడదని తన బృందానికి గట్టిగానే సూచించారట. ఇదంతా ఇలా ఉండగా.. ఆయన పార్టీ గుర్తు ఇదేనంటూ వినిపిస్తున్న వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

ఆయన చివరిసారిగా మీడియా ముందు కనిపించినప్పుడు ‘రాక్‌ ఆన్‌’ ఎమోజీ (బాబా సినిమా లోగో) అభిమానులకు చూపిస్తూ అభివాదం చేశారు. చూపుడు వేలు, చిటికెన వేలు మాత్రమే తెరచి.. మిగిలిన వేళ్లను మూడిచి ఉండే రాక్‌ ఆన్‌ ఎమోజీనే ఆయన పార్టీ గుర్తు అయి ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఆయన సైకిల్‌ గుర్తునూ ఎంచుకునే అవకాశం ఉందన్న వార్తలూ చక్కర్లు కొడుతున్నాయి. ‘అన్నామలై’ సినిమాలో రజనీకాంత్‌ సైకిల్‌పై తిరుగుతూ పాలు విక్రయించే యువకుడిగా కనిపించారు. ఈ సినిమాతో రజనీకి మాస్‌ ఫాలోయింగ్‌ బాగా పెరిగిపోయింది. అందుకే ఆ సినిమా స్ఫూర్తిగా సైకిల్‌ గుర్తును ఎంచుకునే అవకాశం ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. మరి.. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మాత్రం.. పార్టీ అధికారిక ప్రకటన వెలువడే వరకూ వేచి చూడాల్సిందే.

తలైవా నటిస్తున్న ‘అన్నాథె’ సినిమా చిత్రీకరణ కరోనా మహమ్మారి వల్ల ఆగిపోయింది. వచ్చే జనవరిలో తిరిగి చిత్రీకరణలో పాల్గొంటానని రజనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ సినిమాలో ఆయన ఓ పవర్‌ఫుల్‌ గ్రామ సర్పంచ్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. అందుకోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేకంగా ఓ గ్రామ నమూనాలో సెట్‌ ఏర్పాటు చేశారు. ‘విశ్వాసం’ డైరెక్టర్‌ శివ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. ప్రకాశ్‌రాజ్‌, ఖుష్భూ, మీనా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. చిత్రానికి వసంత్‌ దినకరన్‌ సంగీతం అందించనున్నారు.

ఇవీ చదవండి..

జనవరిలో రజనీ రాజకీయ అరంగేట్రం

‘తలైవా ఆట మొదలైంది’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని