Rajamouli: హాలీవుడ్‌ దిగ్గజాన్ని కలిసిన రాజమౌళి..

ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌(Steven Spielberg)ను దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కలిశారు. అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జక్కన్న తన అభిమాన దర్శకుడితో కాసేపు మాట్లాడారు.

Updated : 14 Jan 2023 19:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ దిగ్గజం, హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు స్టీవెన్  స్పీల్‌బర్గ్‌(Steven Spielberg)ను దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కలిశారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల (Golden Globe) ప్రదానోత్సవంలో భాగంగా కుటుంబసమేతంగా అమెరికాకు వెళ్లిన జక్కన్న, సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani) తాజాగా యూనివర్సల్‌ పార్టీలో పాల్గొన్నారు. హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో జక్కన్న, కీరవాణి సందడి చేశారు. ఇందులో భాగంగా వీరిద్దరూ మొదటిసారి స్పీల్‌బర్గ్‌ను కలిసి.. కాసేపు మాట్లాడారు. ఆయనతో దిగిన పలు ఫొటోలను రాజమౌళి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసి.. ‘‘నేను దేవుడిని ఇప్పుడే కలిశాను’’ అంటూ తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. ‘‘గాడ్‌ ఆఫ్‌ మూవీస్‌గా అభివర్ణించే  స్పీల్‌బర్గ్‌ను కలిసి.. ఆయన సినిమాలంటే నాకెంత ఇష్టమో చెప్పాను. ‘నాటు నాటు’ ఎంతో నచ్చిందని ఆయన చెప్పిన మాటల్ని నేనింకా నమ్మలేకపోతున్నా’’ అని కీరవాణి రాసుకొచ్చారు. ‘జురాసిక్‌ పార్క్‌’, ‘హుక్‌’, ‘ది టర్మినల్‌’, ‘ది పోస్ట్‌’ వంటి గొప్ప చిత్రాలకు స్పీల్‌బర్గ్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

‘ఆస్కార్‌’ (Oscars) ఓటింగ్‌లో భాగంగా లాస్‌ ఏంజెల్స్‌లోని సన్‌సెట్ టవర్స్‌లో తాజాగా యూనివర్సల్‌ పార్టీ నిర్వహించారు. హాలీవుడ్‌కు చెందిన స్టార్‌ సెలబ్రిటీలందరూ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. మరోవైపు భారత్‌ నుంచి 10 చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన చిత్రాలన్నింటికీ ఓటింగ్‌ నిర్వహించి.. నామినేషన్స్‌లో నిలిచిన చిత్రాలను ఈనెల 24న ప్రకటించనున్నారు. అలాగే మార్చి 12న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని