ఆ 38 మెట్లు నేనూ ఎక్కా: కోదండరామిరెడ్డి

చిత్ర పరిశ్రమలోని చాలామందికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఫలనాది చేస్తేనే విజయం అందుకుంటామనేది ఎంతోమంది నమ్మకం. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి ఇలాంటి అనుభవాన్నే చవిచూశారు.

Updated : 06 Dec 2022 13:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిత్ర పరిశ్రమలోని చాలామందికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఫలనాది చేస్తేనే విజయం అందుకుంటామనేది ఎంతోమంది నమ్మకం. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి ఇలాంటి అనుభవాన్నే చవిచూశారు. టాలీవుడ్‌లో తిరుగులేని డైరెక్టర్‌గా మారారు. గురువారం (జులై 1) కోదండరామిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆ సెంటిమెంట్‌, ఆయన సినిమాల్ని గుర్తుచేసుకుందాం..

సినిమాల్లోకి వెళ్లాలనుకునే వారందరికీ మద్రాస్‌ అప్పట్లో కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. అలా హీరో కావాలనే కసితో నెల్లూరు నుంచి మద్రాస్‌ వెళ్లే రైలు ఎక్కేశారు కోదండరామిరెడ్డి. కానీ, ఆయనలోని దర్శకత్వ ప్రతిభని గుర్తించిన ఇండస్ట్రీ ఆయన్ను దర్శకుడిగా మార్చింది. ఈయన డైరెక్ట్‌ చేసిన కొన్ని చిత్రాల్ని క్రాంతికుమార్‌ నిర్మించారు. క్రాంతికుమార్‌ ఆఫీసు మద్రాస్‌ టీనగర్‌లో ఉండేది. సినిమాల కథాచర్చలు అక్కడే జరిగేవి. ఓ పెద్ద భవనంలో మొదటి అంతస్తులో ఉన్న దాన్ని చేరుకోవాలంటే 38 ఎట్లు ఎక్కాలి. అలా ఎక్కిన డైరెక్టర్ల స్టార్‌ తిరుగుతుందని ఓ నమ్మకం ప్రచారంలో ఉండేది. ‘ముందు దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావు ఆ తర్వాత నేను ఆ మెట్లు ఎక్కాం. దర్శకులుగా ఎదిగాం. చివరికి క్రాంతికుమార్‌ దర్శకుడిగా మారి ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘9 నెలలు’.. వంటి ఆణిముత్యాలు తీశారు. ఆయన విషయంలోనూ మెట్ల నమ్మకం నిజమైంది’ అని ఓ సందర్భంలో తెలిపారు కోదండరామిరెడ్డి.

చిరంజీవితో 25.. బాలయ్యతో 18

1980లో ‘సంధ్య’ సినిమా కోసం తొలిసారి మెగాఫోన్‌ పట్టారు కోదండరామిరెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన 94 (సుమారు) చిత్రాల్లో 80పైగా ఘన విజయం అందుకున్నాయి. చిరంజీవితో అత్యధిక చిత్రాలు చేశారాయన. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 25 సినిమాలు రూపొందాయి. ‘ఖైదీ’, ‘న్యాయం కావాలి’, ‘అభిలాష’, ‘ఛాలెంజ్‌’, ‘విజేత’, ‘రాక్షసుడు’, ‘వేట’, ‘పసివాడి ప్రాణం’, ‘మరణ మృదంగం’, ‘త్రినేత్రుడు’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘కొండవీటి దొంగ’, ‘ముఠా మేస్త్రి’ తదితర చిత్రాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. రామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 18 సినిమాలు తెరకెక్కాయి. ‘అనసూయమ్మ గారి అల్లుడు’, ‘భానుమతిగారి మొగుడు’, ‘భార్గవ రాముడు’, ‘నిప్పురవ్వ’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బొబ్బిలిసింహం’ వంటి సినిమాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. నాగార్జున, వెంకటేశ్‌లతోపాటు అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ వంటి ఆనాటి హీరోలతోనూ సినిమాలు తీసిన అనుభవం కోదండరామిరెడ్డిది.

తనయుడు హీరోగా..

హీరో కావాలనుకున్న ఆయన కలని తన కుమారుడు వైభవ్‌ రూపంలో నిజం చేసుకున్నారు. వైభవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ ‘గొడవ’ చిత్రం తెరకెక్కించారు. దీనికి నిర్మాతగానూ వ్యవహించారు కోదండరామిరెడ్డి. ఆ తర్వాత ‘కాస్కో’, ‘యాక్షన్‌ 3డీ’, ‘అనామిక’ తదితర చిత్రాలతో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు వైభవ్‌. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని