Sudeep: ఆ ఘటన కలచివేసింది.. పునీత్‌ ఉంటే సపోర్ట్‌ చేసేవారా?: సుదీప్‌

సోషల్‌ మీడియా వేదికగా సుదీప్‌.. పునీత్‌ అభిమానులను ప్రశ్నించారు. దర్శన్‌పై జరిగిన దాడిని ఆయన ఖండించారు.

Published : 21 Dec 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ హీరో దర్శన్‌ (Darshan)పై జరిగిన దాడిని మరో హీరో సుదీప్‌ (Sudeep) ఖండించారు. సంబంధిత వీడియో చూశానని, అది తనను కలచివేసిందన్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ ఉండి ఉంటే ఇలాంటివి సపోర్ట్‌ చేసేవారా? అని ఆయన అభిమానులను ప్రశ్నించారు. సోషల్‌ మీడియా వేదికగా సుదీప్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘మన నేల, భాష, సంస్కృతి.. ప్రేమ గౌరవాలకు ప్రతీకలు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ప్రతి పరిష్కారానికి పలు మార్గాలున్నాయి. ఆ కార్యక్రమంలో నటితోపాటు ప్రధాన పాత్రలు పోషించిన చాలామంది ఉన్నారు. ఆ ప్రముఖులను అవమానించారు. కన్నడిగులేనా ఇలాంటి చర్యకు పాల్పడిందని అని అనిపిస్తోంది. దర్శన్‌, పునీత్‌ అభిమానుల మధ్య ప్రశాంత వాతావరణం లేదనే దాన్ని నేను అంగీకరిస్తా. కానీ, ఒకవేళ పునీత్‌ ఉండి ఉంటే దీన్ని సపోర్ట్‌ చేసేవారా? సమాధానం అభిమానులందరికీ తెలుసు. కన్నడ చిత్ర పరిశ్రమకు దర్శన్‌ ఎంతో సేవ చేశాడు. నటులు, అభిమానుల మధ్య విభేదాలు ఉంటాయనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. దర్శన్‌, పునీత్‌ ఇద్దరూ నాకు క్లోజ్‌ కాబట్టి నా ఫీలింగ్స్‌ పంచుకుంటున్నా. నేను ఎక్కువగా మాట్లాడి ఉండే క్షమించండి. ఏదీ, ఎవరూ శాశ్వతం కాదు. ప్రేమిద్దాం, గౌరవిద్దాం. ఇతరుల నుంచి వాటిని తిరిగి పొందుదాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలిచేందుకు అదొక్కటే దారి’’ అని సుదీప్‌ పేర్కొన్నారు. నటి ప్రణీత ఆ ఘటనను ఖండిస్తూ సంబంధిత వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని ట్వీట్‌ చేశారు.

దర్శన్‌

ఏం జరిగిందంటే?

దర్శన్‌ హీరోగా నటించిన ‘క్రాంతి’ చిత్రం జనవరిలో విడుదల కానుంది. ఆదివారం సాయంత్రం ఈ సినిమాలోని రెండో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హోస్‌పేట్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో దర్శన్‌తోపాటు పలువురు నటులు పాల్గొన్నారు. నటీనటులందరూ స్టేజ్‌పై ప్రసంగిస్తుండగా.. అక్కడే ఉన్న దర్శన్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ అభిమానులు గొడవకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి దర్శన్‌ వైపు చెప్పు విసిరాడు. ఈ ఘటనతో చిత్ర బృందం మొత్తం కంగుతింది. అయితే, ఆ వ్యక్తిని ఏమీ చేయవద్దని దర్శన్‌ సూచించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ ఇంటర్వ్యూలో పునీత్‌ గురించి దర్శన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అదే ఈ ఘటనకు దారితీసిందంటూ నెట్టింట చర్చ సాగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు