Kangana Ranaut: ఆయన ప్రశంసించారు.. నా జీవితానికి అది చాలు: కంగన

స్వీయ దర్శకత్వంలో కంగన రనౌత్‌ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమాని ప్రముఖ రచయిత, దర్శకుడు ప్రశంసించారంటూ ఆమె పోస్ట్‌ పెట్టారు. ఆయనెవరంటే?

Published : 18 May 2023 23:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన నటనపై ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra Prasad) ప్రశంసలు కురిపించారంటూ నటి కంగన రనౌత్‌ (Kangana Ranuat) ఆనందం వ్యక్తం చేశారు. తన జీవితానికి అది చాలని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఆమె పోస్ట్‌ పెట్టారు. ‘ఎమర్జెన్సీ’ (Emergency) సినిమా ఎడిటింగ్‌ పూర్తయిందని, ఆ చిత్రాన్ని చూసిన తొలి వ్యక్తి విజయేంద్ర ప్రసాద్‌ అని ఆమె తెలిపారు. ‘‘సినిమా చూస్తూ విజయేంద్ర ప్రసాద్‌ సర్‌ పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. సినిమా పూర్తయ్యాక ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’ అన్నారు. నా గురువు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో ఎమర్జెన్సీ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌కు చేరుకుంది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. విజయేంద్ర ప్రసాద్‌ గతంలో కథ అందించిన ‘మణికర్ణిక’ సినిమాలో కంగన ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. భారత రాజకీయ చరిత్రలో ఓ ప్రధాన ఘట్టమైన ఎమర్జెన్సీ రోజుల నాటి ఆసక్తికర కథాంశంతో రూపొందింది. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను కంగనా పోషించగా.. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌ నటించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రను శ్రేయస్‌ తల్పడే పోషించారు. మరోవైపు, కంగన నటించిన ‘చంద్రముఖి 2’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్‌హిట్‌ సినిమా ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా రూపొందిన ‘చంద్రముఖి 2’లో రాఘవ లారెన్స్‌ హీరోగా నటించారు. పి. వాసు దర్శకత్వం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు