Keerthy Suresh: మహేశ్‌బాబుకు కీర్తిసురేశ్‌ క్షమాపణ.. కారణమిదే

తాను చేసిన పొరపాటు కారణంగా ఓసారి మహేశ్‌బాబుకు సారీ చెప్పానని నటి కీర్తిసురేశ్‌ తెలిపింది. ఆ తప్పిదానికి మహేశ్‌ సీరియస్‌ అవలేదని, చాలా కూల్‌గా వ్యవహరించారని పేర్కొంది. ‘సర్కారువారి పాట’ చిత్రంలో ఈ ఇద్దరు నాయకానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే

Published : 04 May 2022 02:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను చేసిన పొరపాటు కారణంగా మహేశ్‌బాబుకు సారీ చెప్పానని నటి కీర్తిసురేశ్‌ తెలిపింది. ఆ తప్పిదానికి మహేశ్‌ సీరియస్‌ అవలేదని, ఆ సందర్భంలో చాలా కూల్‌గా వ్యవహరించారని పేర్కొంది. ‘సర్కారువారి పాట’ చిత్రంలో ఈ ఇద్దరు నాయకానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా కీర్తిసురేశ్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడింది.

సారీ.. మూడోసారి

‘‘ఈ సినిమాలోని చివరి పాట చిత్రీకరణ సమయమది. నా వైపు నుంచి కో-ఆర్డినేషన్‌ మిస్సై, అనుకోకుండా మహేశ్‌ చెంపపై కొట్టా. వెంటనే ఆయన్ను క్షమాపణ అడిగా. ఇందులో ఏముందని మహేశ్‌ ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నా నా మనసు కుదురుగా లేదు. మూడుసార్లు సారీ చెప్పేంత వరకూ ప్రశాంతంగా ఉండలేకపోయా’’ అని కీర్తిసురేశ్‌ వివరించింది. ‘‘దర్శకుడు పరశురామ్‌ ఈ సినిమా స్క్రిప్టు వినిపించగానే కొత్త అనుభూతికి లోనయ్యా. అంతగా నన్ను ఆకర్షించిందా కథ. పరశురామ్‌.. ఫిమేల్‌ పాత్రలను ఎంత చక్కగా తీర్చిదిద్దుతారో తెలుసు కాబట్టి ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించా. ఈ ప్రాజెక్టులో నేను పోషించిన కళావతి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది’’ అని చెప్పింది. మేత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. ఇందులోని పాటలు, సోమవారం విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని