Meera Jasmine: ఆ రెండే నా మైండ్‌లో ఉండేవి.. రీ ఎంట్రీపై మీరా జాస్మిన్‌ కామెంట్స్‌

పదేళ్ల విరామం అనంతరం నటి మీరా జాస్మిన్‌ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. రీ ఎంట్రీలో తాను నటించిన ‘విమానం’ సినిమా గురించి సోషల్‌ మీడియా వేదికగా మాట్లాడారు.

Published : 31 May 2023 15:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అమ్మాయి బాగుంది’ (Ammayi Bagundi) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తొలి ప్రయత్నంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మీరా జాస్మిన్‌ (Meera Jasmine). ఆ తర్వాత ‘గుడుంబా శంకర్‌’, ‘భద్ర’, ‘రారాజు’, ‘మహారథి’, ‘బంగారు బాబు’ తదితర చిత్రాలతో మెప్పించిన ఆమె.. చివరిగా 2013లో వచ్చిన ‘మోక్ష’ సినిమాలో కనిపించారు. మాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో బిజీగా ఉన్న ఆమె పదేళ్ల విరామం అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రీ ఎంట్రీలో ఆమె నటించిన తొలి సినిమా ‘విమానం’ (Vimanam). ఈ చిత్రం జూన్‌ 9 విడుదలకాబోతున్న సందర్భంగా మీరా జాస్మిన్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యేక వీడియో పంచుకున్నారు. ‘‘చాలా రోజుల తర్వాత మీ మందుకు వస్తున్నా. ‘విమానం’ కథ నాకు బాగా నచ్చింది. దాన్ని విన్న తర్వాత దేని గురించీ నేను ఆలోచించలేదు. ఈ సినిమా స్టోరీ, అందులోని క్యారెక్టర్లు మాత్రమే నా మైండ్‌లో ఉండేవి. నేను విమానాన్ని ఎంపిక చేసుకున్నానా లేదా నన్నే ‘విమానం’ ఎంపిక చేసుకుందో నాకు అర్థంకావట్లేదు. ఈ సినిమా ద్వారా నేను పొందిన అనుభూతిని మీరూ పొందుతారని ఆశిస్తున్నా’’ అని మీరా జాస్మిన్‌ ప్రేక్షకులనుద్దేశించి ఆ వీడియోలో మాట్లాడారు.

సముద్రఖని (Samuthirakani) ప్రధాన పాత్రలో దర్శకుడు శివ ప్రసాద్‌ యానాల తెరకెక్కించిన చిత్రమే ‘విమానం’. మీరా జాస్మిన్‌తోపాటు అనసూయ, రాహుల్‌ రామకృష్ణ, మాస్టర్‌ ధ్రువన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తండ్రీ కొడుకుల అనుబంధాల నేపథ్యంలో అల్లుకున్న కథతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో సముద్రఖని అంగ వైకల్యంతో బాధపడే వీరయ్య అనే మధ్యవయసున్న తండ్రి పాత్ర పోషించారు. విమానం ఎక్కాలన్న తన కొడుకు కలను నిజం చేసేందుకు ఆయన ఏం చేశాడన్నది ఆసక్తికరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని