Vanitha Vijayakumar: కుటుంబ సభ్యులే బెదిరించారు.. తమిళనాడులో కాలు కూడా పెట్టలేవు అన్నారు!

ఒకానొక సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడారు నటి వనితా విజయ్‌ కుమార్‌ (Vanitha Vijay Kumar). కుటుంబసభ్యులే తనని ఇబ్బందులుపెట్టారని ఆమె చెప్పారు.

Updated : 26 May 2023 14:36 IST

చెన్నై: ఒకానొక సమయంలో కుటుంబసభ్యులే తనని బెదిరించారని, మానసిక వేధింపులకు గురి చేశారని నటి వనితా విజయ్‌ కుమార్‌ తెలిపారు. కుటుంబసభ్యులు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక సుమారు రెండేళ్లపాటు కర్ణాటకలోని మైసూర్‌లో తలదాచుకున్నానని ఆమె చెప్పారు. ‘మళ్ళీ పెళ్లి’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘‘గతంలో నేను ఆస్తి తగాదాలు ఎదుర్కొన్నాను. అప్పుడు సొంత వాళ్లే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. పోలీసులు నన్ను కొట్టారు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. నా కుటుంబం నుంచే బెదిరింపులు వచ్చాయి.  పిల్లలను తీసుకుని తమిళనాడు నుంచి కర్ణాటకకు వెళ్లిపోయాను. మైసూర్‌లో సుమారు రెండేళ్లు ఉన్నాను. ఆ సమయంలో మా నాన్నకు ఫోన్‌ చేశాను. ‘‘ఎందుకు ఇలా చేస్తున్నారు? అమ్మ ఉంటే ఇలా జరగనిచ్చేదా?’’ అని ప్రశ్నించాను. దానికి ఆయన.. ‘‘తమిళనాడు నువ్వు కాలు కూడా పెట్టలేవు. ఒక్కసారి వచ్చి చూడు’’ అని ఛాలెంజ్‌ చేశారు. కానీ, ఇప్పుడు తమిళనాడులో అందరూ నన్ను తమ ఇంటి బిడ్డగా భావిస్తున్నారు’’అని వనితా విజయ్‌కుమార్‌ వివరించారు.

సీనియర్‌ నటీనటులు మంజుల, విజయ్‌కుమార్‌ల కుమార్తెగా వనిత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1999లో విడుదలైన ‘దేవి’లో ఆమె కీలకపాత్ర పోషించారు. ఆ సినిమా తర్వాత వివాహం చేసుకున్న ఆమె తెలుగు తెరకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే సుమారు 24 ఏళ్ల తర్వాత ఆమె తిరిగి తెలుగు సినిమాలో నటించారు. ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించిన ‘మళ్ళీ పెళ్లి’లో కీలకపాత్ర పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని