Adipurush pre release event: 100 మంది గాయకులు.. 50 అడుగుల హోలోగ్రామ్‌.. ప్రత్యేకతలివే!

Adipurush: ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘ఆది పురుష్‌’ ప్రీరిలీజ్‌ వేడుకను తిరుపతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Updated : 05 Jun 2023 20:52 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్‌ డ్రామా ‘ఆది పురుష్‌’ (Adipurush). రామాయణానికి ఆధునిక హంగులు జోడించి ఈ సినిమాను తీర్చిదిద్దారు. రాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతి సనన్‌ (Kriti Sanon) కీలక పాత్రలు పోషిస్తుండగా, లంకేశ్‌గా సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan) కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తిరుపతి(Tirupati)లో భారీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ జరగని రీతిలో చిత్ర నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేసింది. అంతేకాదు, ఇంత భారీ స్థాయిలో చేస్తున్న ఈ ప్రిరీలీజ్‌ వేడుకకు కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

  • ‘ఆది పురుష్‌’ ప్రీరిలీజ్‌ వేడుకకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌స్వామి (Chinna Jeeyar swamy) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
  • సినీ చరిత్రలోనే తొలిసారి 50 అడుగుల ప్రభాస్‌ హాలోగ్రామ్‌ ప్రదర్శించనున్నారు.
  • రామరాజ్యం అయోధ్యను తలపించేలా తిరుపతిలో భారీ సెట్‌ వేశారు. శ్రీరాముడు, వేంకటేశ్వరస్వామి రెండూ శ్రీమహావిష్ణువు అవతారాలే. దాన్ని దృష్టిలో ఉంచుకునే అటు అయోధ్య, ఇటు తిరుపతిల మధ్య ఆధ్యాత్మిక బంధాన్ని తలపించేలా ఈ సెట్‌ను తీర్చిదిద్దారు.
  • 100 డ్యాన్సర్లు, 100మంది గాయనీ గాయకులు ‘ఆదిపురుష్‌’ (Adipurush) సినిమాతో పాటు, రామాయణానికి సంబంధించిన గీతాలను ఆలపించనున్నారు.
  • దర్శకుడు ప్రశాంతవర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం.  దాదాపు లక్షమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
  • తిరుపతి శ్రీ వేంకటశ్వర యూనివర్సిటీ మైదానంలో నిర్వహిస్తున్న ఈవెంట్‌ సీటింగ్‌ను పలు విధాలుగా విభజించారు. స్టేజ్‌కు ముందు వరసను ‘అయోధ్య’గా పేర్కొనగా, ఆ తర్వాత భాగాన్ని ‘మిథిల’గా, ఆ తర్వాత పంచవటి, దాని వెనుక గ్యాలరీకి ‘కిష్కింద’ అని పేర్లు పెట్టారు. రామాయణంలోని ప్రస్తావించిన పేర్లను గ్యాలరీకి పెట్టడం మరో విశేషం.
  • ఈ సినిమాకు బాలీవుడ్‌ సంగీత ద్వయం అతుల్‌-అజయ్‌లు స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. వీరిలో అతుల్‌ ముంబయి నుంచి తిరుపతికి బైక్‌పైన వచ్చారు. శనివారం ముంబయిలో బయలుదేరిన ఆయన సోమవారం తిరుపతి చేరుకున్నారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని.. స్వామి వారి పాదాల వద్ద ‘‘జైశ్రీరామ్‌’’ పాటను సమర్పించారు.
  • టికెట్ల విక్రయ విషయంలో.. ‘ఆది పురుష్‌’ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లలో ఒక సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు