Adipurush: ఇక ఏడాదికి రెండు సినిమాలు.. పెళ్లిపైనా స్పందించిన ప్రభాస్‌!

ప్రభాస్‌ (Prabhas), కృతిసనన్‌, సైఫ్‌ అలీఖాన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించిన మైథలాజికల్‌ చిత్రం.. ‘ఆదిపురుష్‌’. ఈ నెల 16న విడుదలకానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు.

Published : 07 Jun 2023 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా ఓం రౌత్‌ (Om raut) దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్‌ డ్రామా చిత్రం.. ‘ఆది పురుష్‌’ (Adipurush). కృతిసనన్‌ (Kriti Sanon), సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan), సన్నీ సింగ్‌ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీరిలీజ్‌ (Adipurush Pre Release Event) ఈవెంట్‌ నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి ప్రభాస్‌ మాట్లాడుతూ.. ఇకపై ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తానని, కుదిరితే మూడు సినిమాలు వచ్చేలా చూస్తానని అన్నారు. అలాగే తన పెళ్లిపైనా ప్రభాస్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతుండగా, ‘పెళ్లెప్పుడు’ అని అభిమానులు అడగ్గా, ‘ఇక్కడే తిరుపతిలోనే ఎప్పుడైనా చేసుకుంటా’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘‘ఏడు నెలల క్రితం 3డీలో ట్రైలర్‌ విడుదల చేసినప్పుడు మీరిచ్చిన ధైర్యంతోనే టీమ్‌ మరింత కష్టపడి పనిచేసింది. మీ ప్రోత్సాహంతోనే ఒక యుద్ధంలా చిత్ర బృందం కష్టపడింది. రోజుకు రెండు మూడు గంటలే నిద్రపోయిన సందర్భాలూ ఉన్నాయి. ‘ఆదిపురుష్‌’లాంటి సినిమా చేయడం నా అదృష్టం. ఒక సందర్భంలో చిరంజీవిగారిని కలిసినప్పుడు ‘ఏంటి రామాయణం చేస్తున్నావా’ అని అడిగారు. ‘అవునండీ’ అని చెప్పా. ‘అందరికీ ఇలాంటి అదృష్టం దొరకదు. నీకు దక్కింది’ అని అభినందించారు. రామాయణం చేయాలంటే కష్టపడాల్సి వస్తుందని అంటారు. అలాంటి కష్టాలు మాకూ ఎదురయ్యాయి. నా 20ఏళ్ల కెరీర్‌లో ఓం రౌత్‌లాంటి వ్యక్తిని చూడలేదు. ఒక పోరాటంగా ఈ సినిమాను పూర్తి చేశారు’’

‘‘సినిమా ఫంక్షన్‌లకు హాజరుకాని చినజీయర్‌ స్వామివారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. నిర్మాత భూషణ్‌కుమార్‌ తన తండ్రి కోరిక మేరకు రామాయణం తీశారు. ఈ సినిమాను ఒక ఎమోషనల్‌గా తీసుకున్నారు. ఇందులో నాతో పాటు లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నాగే చాలా బాగా నటించారు. ఇక కృతి సనన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేకుండా చేసింది. సీత పాత్రకు సంబంధించిన పోస్టర్‌లో ఆమె ఎక్స్‌ప్రెషన్‌ చూసి ఆశ్చర్యపోయా. ఈ సినిమా టెక్నికల్‌ టీమ్‌ అద్భుతమైన అవుట్‌పుట్‌ ఇచ్చింది. ఎప్పటికీ ప్రేక్షకులు, అభిమానులే నా బలం. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే సినిమా పూర్తి చేసి ఇప్పుడు మీ ముందుకు వచ్చాం. మామూలుగా వేదికలపై నేను మాట్లాడే దానికంటే ఈసారి ఎక్కువ మాట్లాడా. ఇకపై అభిమానుల కోసం ఏడాదికి రెండు సినిమాలు చేస్తా. కుదిరితే మూడు కూడా రావచ్చు. వేదికలపై తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తా. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అని ప్రభాస్‌ అన్నారు.

ఇది ప్రతి భారతీయుడి సినిమా: ఓం రౌత్‌

‘ఆదిపురుష్‌’.. ప్రతి భారతీయుడి సినిమా అని దర్శకుడు ఓం రౌత్‌ తెలిపారు. ‘‘మీరంతా ఈ ఈవెంట్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది. మీ కోసమే ఈ రోజు ఫైనల్‌ ట్రైలర్‌ విడుదల చేశాం. చూసి ఆస్వాదించండి. నిర్మాత భూషణ్‌కుమార్‌ నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. నేను దర్శకుడిని మాత్రమే కాదు, భూషణ్‌కు మంచి స్నేహితుడిని. ఆయన తండ్రి కోరికను తెరపై తీసుకురావడంలో నాకు కూడా ఒక బాధ్యత ఉంది. ప్రభాస్‌ లేకుండా ఈ సినిమా లేదు. ‘ఆదిపురుష్‌’ ప్రభాస్‌తోనే సాధ్యమైంది. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. జూన్‌ 16న థియేటర్‌లో కలుసుకుందాం. రామనామం ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడని నమ్ముతారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ‘ఆది పురుష్‌’ ప్రదర్శిస్తున్న థియేటర్‌లలో ఆ హనుమంతుడి కోసం ఒక సీట్‌ ఖాళీగా ఉంచాలని అందరినీ కోరుతున్నా’’ అని ఓం రౌత్‌ కోరారు.

ఇది నాకు స్పెషల్ మూవీ: కృతిసనన్‌

‘‘నేను నా కెరీర్‌ను తెలుగు ఇండస్ట్రీతోనే మొదలు పెట్టా. దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ మీ ముందుకు వచ్చా. ‘ఆదిపురుష్‌’ నాకు స్పెషల్‌ మూవీ. మీ ప్రేమాభిమానాల వల్లే ఇంత త్వరగా ఈ సినిమాలో నటించే అదృష్టం దక్కింది. ఇతర సినిమాల్లా నేను ఇందులో నటించలేదు. ఎందుకంటే సీత పాత్ర చాలా పవర్‌ఫుల్‌. రాముడిపై జానకికి ఉన్న ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. అలాగే సినిమా షూటింగ్‌ సమయంలోనూ ప్రతి ఒక్కరూ ఎంతో స్వచ్ఛంగా పనిచేశారు. సాధారణంగా ప్రభాస్‌ ఎక్కువ మాట్లాడరని అనుకుంటారు. కానీ, ఆయన చాలా బాగా మాట్లాడతారు. మంచి వ్యక్తి. నా కుటుంబమే నాకు బలం’’ అని కృతి సనన్‌ చెప్పారు.

నిర్మాత భూషణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘రామాయణాన్ని సినిమాగా తీయాలన్నది మా నాన్నగారి కోరిక. ఓం రౌత్‌ కారణంగానే ఆ కోరికను నెరవేర్చగలిగాం. ఇది మాకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇదొక ఎమోషన్‌. మీరంతా సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి’’ అని ప్రేక్షకుల్ని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని