స్టార్‌ హీరోకి షాక్‌.. ప్రేక్షకుల్లేక షోలు రద్దు!

బాలీవుడ్‌ స్టార్‌హీరో అక్షయ్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు లేకపోవడంతో ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ ప్రదర్శనలు...

Published : 12 Jun 2022 02:01 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌హీరో అక్షయ్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు లేకపోవడంతో ఆయన నటించిన కొత్త చిత్రం ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ ప్రదర్శనలు నిలిచిపోయినట్లు పలు బాలీవుడ్‌ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వం వహించారు. చక్రవర్తి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇప్పటి తరం ప్రేక్షకులను ఆకర్షించే విధంగా భారీ వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌తో సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌ పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన నాటి నుంచి ఈ చిత్రానికి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో ఇప్పటివరకూ ఈ సినిమా కేవలం రూ.55 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా చూడటానికి ఒక్కరు కూడా రాకపోవడంతో చాలా థియేటర్లలో ప్రదర్శనలు రద్దు చేశారట. కొన్నిచోట్ల థియేటర్లలో ఎక్కువ భాగం సీట్లు ఖాళీగా ఉండటంతో ప్రదర్శనలు నిలిపివేశారని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని