alitho saradaga: తెలుగు దర్శకులతో బాలీవుడ్‌ చిత్రాలు చేయాలనేది నా కోరిక: ఎస్‌.ఎస్‌. తమన్‌

బలపం పట్టే వయసులో సంగీత వాయిద్యాలు పట్టాడు. సంగీత దర్శకుడిగా అంచనాలను మించిన సంచనాలను సృష్టిస్తున్నాడు. హృదయాలను కదిలించే క్లాస్‌ పాటలే కాదు.. థియేటర్లు దద్దరిల్లే మాస్‌ పాటలతో కూడా ప్రేక్షకుల్ని హోరెత్తిస్తూ ‘అఖండ’ విజయాలతో దూసుకెళ్తున్న క్రేజీ కంపోజర్‌.. ఎస్‌.ఎస్‌. థమన్‌. ఆయన.. ఈ టీవీలో

Updated : 29 Dec 2021 16:11 IST

బలపం పట్టే వయసులో సంగీత వాయిద్యాలు పట్టాడు. సంగీత దర్శకుడిగా అంచనాలను మించిన సంచలనాలను సృష్టిస్తున్నాడు. హృదయాలను కదిలించే క్లాస్‌ పాటలే కాదు.. థియేటర్లు దద్దరిల్లే మాస్‌ పాటలతో కూడా ప్రేక్షకుల్ని హోరెత్తిస్తూ ‘అఖండ’ విజయాలతో దూసుకెళ్తున్నాడు.. క్రేజీ కంపోజర్‌ ఎస్‌.ఎస్‌. తమన్‌. ఆయన.. ఆలీ వ్యాఖ్యాతగా ఈ టీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అవి మీకోసం..

ఎస్‌ఎస్‌ తమన్‌లో ఎస్‌ఎస్‌ అంటే ఏంటి?

తమన్‌: మా నాన్న పేరు శివ కుమార్‌. నా పేరు సాయి తమన్‌. రెండు కలిపితే పెద్దగా అవుతుందని ఎస్‌.ఎస్‌.తమన్‌ అని మార్చుకున్నా. ఇంటి పేరు ఘంటసాల.

ఆ ఘంటసాల గారు మీకు ఏమవుతారు?

తమన్‌: మా తాతగారు ఘంటసాల బలరామయ్య.. నటుడు, నిర్మాత. అక్కినేని నాగేశ్వరరావుతో చాలా సినిమాలు చేశారు. అయితే, మా నాన్నకి ప్రొడక్షన్‌ మీద కన్నా సంగీతంపై ఆసక్తి ఎక్కువవుండేది. దీంతో ఇంట్లో వాళ్లతో గొడవపడి బయటకొచ్చారు. నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లి సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద డ్రమ్మర్‌గా చేరిపోయారు. దాదాపు వెయ్యి సినిమాలకు డ్రమ్స్‌ వాయించారు. మా తల్లి సింగర్‌ కావడంతో ఓ చోట వారిద్దరు కలిశారు. ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. అలా చిన్నప్పటి నుంచి చుట్టూ సంగీతమే ఉండేది. ఇప్పుడు మా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నా. 

నాన్న ఎలా చనిపోయారు?

తమన్‌: మా నాన్న మరణించి 27 ఏళ్లు అవుతోంది. మా అత్త దిల్లీలో ఉంటారు. ఏటా దసరా సెలవులకు అక్కడికి వెళ్తుంటాం. అలా వెళ్లి తిరిగి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నాం. నాగ్‌పూర్‌ దగ్గర మా నాన్నకి గుండెపోటు వచ్చింది. అది మాకు తెలియలేదు. ఏసీ సరిపోవట్లేదని నాన్న అంటే.. టీటీ సీట్లో కూర్చోబెట్టాం. దీంతో వేగంగా వీస్తున్న గాలిని పీలుస్తూ చెన్నైకి వచ్చే వరకు బాగానే ఉన్నారు. చెన్నైలో దిగగానే జీహెచ్‌లో చేరిస్తే బతికేవారు. కానీ, మా నాన్న ఫ్యామిలీ డాక్టర్‌నే సంప్రదిద్దామన్నారు. ఆయన ఏవో మందులు ఇచ్చి.. గుండె బలహీనంగా ఉంది విశ్రాంతి తీసుకోండి సరిపోతుంది అన్నారు. కానీ, మళ్లీ గుండెపోటు రావడంతో ఆయన్ను కోల్పోయాం. అప్పుడు నా వయసు పదకొండేళ్లు. 

మా చెల్లి ఐటీలో ఉద్యోగం చేస్తుండేది. ఇటీవల సంగీతంపై ఆసక్తి పెరిగి సింగర్‌గా మారిపోయింది. నా భార్య శ్రీవర్ధిని కూడా సింగరే. నా సంగీత దర్శకత్వంలో నాలుగైదు పాటలు పాడింది. 

ఎంత వరకు చదువుకున్నారు?

తమన్‌: ఆరో తరగతి. స్కూల్‌కి వెళ్లినా.. అక్కడ నేను డ్రమ్స్‌ వాయిస్తున్నానని బయట కూర్చోబెట్టేవారు. నాకూ చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొనేవాడిని. దీంతో పరీక్షలు బాగా రాయకపోయినా టీచర్లు నన్ను పాస్‌ చేసేవారు.

మొదట్నుంచీ నాకు సంగీతంపైనే ధ్యాస ఉండేది. చిన్నప్పుడు ఆడుకోవడానికి ఆటబొమ్మలు కొనుక్కునే ఆర్థిక స్థోమత కూడా లేదు. నాన్న డ్రమ్సే ఆటబొమ్మలుగా మారాయి. రాత్రిళ్లు వాటిని వాయిస్తూ కాలక్షేపం చేసేవాడిని. ఆ కాలంలో పాటలను ఒక్కసారి విని డ్రమ్స్‌ వాయించేవాడిని. ఎవరూ నేర్పించలేదు. 

నాకొక మంచి లక్షణముంది. దేన్నీ బుర్రలోకి ఎక్కించుకోను. ఖాళీగా ఉంచుతా. సినిమాల విషయంలో జయాపజయాలు మనవి కావు. కాబట్టి పట్టించుకోను. ‘ఫ్లాప్‌ సినిమా చేస్తున్నాను.. ఆరు ఫ్లాప్‌ పాటలు చేద్దాం’ అని ఎవరూ నా వద్దకు రారు. తప్పు జరిగితే నేర్చుకుంటాం. విజయం సాధిస్తే అది ఎలా సాధ్యమైందో నేర్చుకుంటాం. నేను సబ్జెక్టులు చదువుకోలేదు. కానీ, మనుషులను చదువుకున్నాను. సంగీత వాయిద్యాలు ఎలా ఆపరేట్‌ చేయాలో తెలిపే బుక్స్‌ ఉండేవి. వాటిని చదువుతూ ఇంగ్లీష్‌ బాగా మాట్లాడం నేర్చుకున్నాను. సినిమా పోస్టర్లను చూసే తమిళ్‌, తెలుగు నేర్చుకున్నాను. తెలుగు రాయడం కూడా దర్శకుడు త్రివిక్రమ్‌ను కలిశాకే నేర్చుకున్నాను. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో 64 మంది సంగీత దర్శకుల వద్ద 900 సినిమాలకు ప్రోగ్రామర్‌గా పనిచేశా. 

మీ తండ్రి చనిపోయాక ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

తమన్‌: మా తండ్రి చనిపోతే నాకు ఏడుపు రాలేదు. మా తల్లి, చెల్లిని చూస్తూ.. వారిని ఈ లోకం ఏ విధంగా చూస్తుందోనని ఆలోచించా. అందుకే స్కూల్‌కి వెళ్లను.. షోలకు వెళ్తానని ఇంట్లో చెప్పేశా. మా నాన్న బీమా డబ్బులు 60వేల రూపాయలు వస్తే.. ఆ డబ్బుతో మా అమ్మ నాకు డ్రమ్స్‌ కొనిచ్చింది. దాంతోనే ఇల్లు గడిచేది. బాలు గారు, శివమణి గారి షోలు ఎక్కడున్నా వెళ్లిపోయేవాడిని. బాలు గారితో కలిసి ప్రపంచవ్యాప్తంగా 300 దాక స్టేజ్‌ షోలు చేసి ఉంటాను. మా తండ్రికి ఉన్న మంచి పేరు వల్ల నాకు అందరూ అవకాశాలు ఇచ్చేవారు. 

నా రికార్డింగ్‌ కెరీర్‌ ‘భైరవ ద్వీపం’ చిత్రంతోనే మొదలైంది. ఆ సినిమాలో రోజా గారు మంచంతో సహా గాల్లోకి లేచే సీన్‌కి నేనే డ్రమ్స్‌ కొట్టాను. అప్పట్లో నాకు రోజుకు ముప్పై రూపాయాలు ఇచ్చేవారు.

‘అఖండ’లో అఖండమైన సంగీతం ఇచ్చారు. అమెరికా థియేటర్లలో సౌండ్‌ తగ్గించారట. అంత భారీ సౌండ్‌తో సంగీతం అందించారు కదా? దానికి శిక్షణ ఏమైనా తీసుకున్నరా?

తమన్‌: అది అంతా హీరోల మీద ఉండే అభిమానమే. అందరూ సౌండ్‌ గురించే అడుగుతున్నారు. గుడిలో హారతి ఇచ్చే సమయంలో డ్రమ్స్‌, గంటలు మోగిస్తారు కదా.. ఆ సౌండ్‌ తగ్గించమని అడుగుతామా? ఆ సినిమాలో బోయపాటి గారు ఆయన్ను(బాలకృష్ణను ఉద్దేశించి) అలా చూపించారు. ఆ విధంగా మ్యూజిక్‌ కొట్టాల్సిందే. 

బోయపాటికి స్పష్టమైన విజన్‌ ఉంటుంది. ‘అఖండ’ ఇంటర్వెల్‌ సీన్‌కు ఆర్‌ఆర్‌ చేయడానికి 32 రోజులు పట్టింది. ఆ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. సినిమా చూస్తే మీకు చెవులు నొప్పి పెట్టవు. మీలోకి దేవుడు ఆవహిస్తాడు.

ఆ సినిమా చూశాక బాలయ్య ఏం చెప్పారు?

తమన్‌: ఆయన మొదటిసారి సౌండ్‌తో సినిమా చూసి.. ‘నువ్వు కూడా ఒక హీరోవే’ అన్నారు. నేను తొలిసారి జీతం తీసుకుంది ఆయన సినిమాలోనే. బాలకృష్ణగారితో సినిమా అనే సరికి ఆయనపై అభిమానాన్ని ఈ విధంగా చూపించాను అంతే.

నెక్ట్స్‌ ఏంటి?

తమన్‌: ‘భీమ్లా నాయక్‌’ విడుదలవుతుంది. త్రివిక్రమ్‌ గారితో పనిచేయడం సులభంగా ఉంటుంది. ఆరు నెలలు కంపోజింగ్‌ జరగదు. కానీ, ఆరు రోజుల్లో ఆరు పాటల కంపోజింగ్‌ పూర్తవుతుంది. ఎలా జరుగుతుందో తెలియదు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి పాటల కంపోజింగ్‌ అంతా కారు డ్రైవింగ్‌లోనే జరిగిపోయింది. పవన్‌ కల్యాణ్‌ గారితో ‘వకీల్‌ సాబ్‌’ తర్వాత మళ్లీ ‘భీమ్లా నాయక్‌’ చేశా. ఇంకా మహేశ్‌ బాబు గారితో ‘సర్కార్‌ వారి పాట’ చేస్తున్నా.

మ్యూజిషియన్‌గా ఉంటూ మీరు ఆకస్మాత్తుగా తెరపై కనిపించారేంటి?

తమన్‌: అది అనుకోకుండా జరిగింది. ‘బాయ్స్‌’ సినిమాలో ఒక పాత్రకి ప్రొఫెషనల్‌ డ్రమ్మర్‌ అవసరమయ్యారు. ఆ సమయంలో ఏఆర్‌ రెహమాన్‌ గారి వద్ద పనిచేస్తున్నా. శివమణి గారు ఆ పాత్ర కోసం నన్ను తీసుకోమని చెప్పారట. ఆ చిత్రం కోసం దిగ్గజ టెక్నిషియన్స్‌ పనిచేస్తున్నారు. సినిమా గురించి తెలుసుకోవడం కోసం అందులో నటించాను. ఆ తర్వాత నటించడం మన వల్ల కాదని.. జీవితం ఇచ్చిన సంగీతంవైపే మొగ్గుచూపాను. 

శంకర్‌ గారి సినిమాలో నటించిన కుర్రాడే.. శంకర్‌ గారి సినిమాకి సంగీత దర్శకుడుగా మారాడు కదా?

తమన్‌: నాకు మొదట త్రివిక్రమ్‌ గారి సినిమాకు పనిచేయాలని డ్రీమ్‌ ఉండేది. ‘అతడు’ సినిమాకి పనిచేస్తున్నప్పుడు త్రివిక్రమ్‌ గారితో చనువు పెరిగింది. నేను ఏం చేసినా మెచ్చుకునేవారు. కిక్‌ సినిమాకి మ్యూజిక్‌ ఇవ్వడం దగ్గర నుంచి త్రివిక్రమ్‌ గారికి మ్యూజిక్‌ చేయాలని ఎదురుచూస్తుండేవాడిని. ఆయనతో సినిమా చేయడానికి నాకు ‘వంద సినిమాలు’ పట్టింది.

‘వకీల్‌ సాబ్‌’ చిత్రం పూర్తయ్యాక దిల్‌ రాజు గారు వచ్చి ‘శంకర్‌ అందరి పేర్లు తీసి సంగీత దర్శకుడిగా నీ పేరు మాత్రమే పెట్టారు’ అని చెప్పారు. నేను షాక్‌ అయ్యా. శంకర్‌ గారు ఎప్పుడూ 20ఏళ్లు ముందుంటారు. మనమే ఓ టైం మిషన్‌ సృష్టించుకొని వెళ్లి ఆయన ఆలోచనలను అర్థం చేసుకోవాలి. దిల్‌రాజు వెళ్లి ఆయన్ను కలవమంటే కలిశా. ఆయన చాలా ఆనందపడ్డారు. తనకు బోర్‌ కొడితే ‘అల వైకుంఠపురంలో’ చిత్రం చూస్తానని చెప్పారు. అందులో నా పనితనం శంకర్‌ గారికి బాగా నచ్చింది. నా నోటి నుంచి ‘నో’ అనే పదం రాదు. ఆయన్ను కలిసొచ్చిన వెంటనే వారంలో కంపోజింగ్‌ చేద్దామా అన్నారు. నేను సరే అన్నా. చెన్నైకి వెళ్తే.. ఫ్రెండ్లీగా మెలిగారు. ఒక్క సిట్టింగ్‌లోనే రెండు, మూడు పాటలు ఖరారు చేశాం. ఆయనతో సినిమా చేయడానికి నాకు 20ఏళ్లు పట్టింది. ఇక రామ్‌చరణ్‌తో ఇది నాకు మూడో సినిమా. 

‘అరవింద సమేత’.. అవకాశం ఎలా వచ్చింది?

తమన్‌: ఆ సినిమాకి మొదట అనిరుధ్‌ని ఎంచుకున్నారు. కానీ, ఏం జరిగిందో తెలియదు ఆ అవకాశం నాకొచ్చింది. ‘భాగమతి’ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ త్రివిక్రమ్‌ గారికి బాగా నచ్చింది. నాకు ఫోన్‌ చేసి చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు. ఆ తర్వాతే ‘అరవింద సమేత..’ అవకాశం వచ్చింది. సంగీత దర్శకుడిగా నాకది వందో సినిమా. ఇప్పటి వరకు మొత్తం ఐదు(తెలుగు, హిందీ, తమిళ్‌, మళయాళం, కన్నడ) భాషల్లో సంగీతం అందించా.

సంగీతంలో మీకు స్ఫూర్తి ఎవరు?

తమన్‌: ఇళయరాజా గారు హార్ట్‌.. రెహమాన్‌ గారు బ్రెయిన్‌. వారిద్దరి మధ్యలో నేను ఉండాలని కోరుకుంటా. ట్యూన్‌గా ఇళయరాజా గారు, టెక్నికల్‌గా రెహమాన్‌గారు ముందుంటారు. వారిద్దరిని కలిపి మ్యూజిక్‌ చేయడానికి ప్రయత్నిస్తా. నేను పుట్టింది ఇళయరాజాగారి కాలంలో కాబట్టి నా మెదడులో ఆయన వైరసే ఎక్కువ ఉంది. 

‘నేను ట్యూన్‌ కాపీ కొడితే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా’ అని మీరు అన్న మాటలను బాగా ట్రోల్‌ చేశారు. వాటికి సమాధానం?

తమన్‌: ట్రోల్‌ చేసేవాళ్లకి ఒక్కటే చెబుతున్నా. ముందు మీ తల్లులను బాగా చూసుకోండి. వారి యోగక్షేమాలు పట్టించుకోండి. మా అమ్మ నా కోసం చాలా త్యాగాలు చేసింది. చెల్లిని పుట్టపర్తిలో ఉంచి చదివిస్తూ నాతోపాటే ఉండేది. అందుకే ఆమెను బాగా చూసుకుంటున్నాను. నా చెల్లికి పెళ్లయి పదేళ్లు అయింది. అందరం బాగున్నాం. మెదడు ఆరోగ్యంగా ఉండే.. జీవితం చక్కగా ఉంటుంది. 

తమన్‌ ఎక్కువగా కాపీ కొడతాడు అని కొందరు చేసే విమర్శలు విన్నప్పుడు మీ ఫీలింగ్‌??

తమన్‌: నా దర్శకులు, నిర్మాతలు, హీరోలు నన్ను నమ్మినప్పుడు విమర్శలు చేసేవాళ్లు నా ఆలోచనలోనే ఉండరు. నేను ఎంత కష్టపడుతున్నానో దర్శకులు, హీరోలు, రచయితలు, గాయకులు చూస్తూనే ఉన్నారు. 

నేను ఒక్కటే ఆలోచిస్తాను. సినిమా అనేది అన్ని క్రాఫ్టులకు సంబంధించినది. నా వెనుక వంద మంది  కష్టపడితేనే అవుట్‌పుట్‌ వస్తోంది. ‘అఖండ’ చిత్రం కోసం దేశవ్యాప్తంగా 600 మంది మ్యూజిషియన్లు పనిచేశారు. వారికి జీతాలు అందాయి. మ్యూజిక్‌ బిల్లు రూ. 1.80కోట్లు వచ్చింది. విమర్శలను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే ప్రపంచం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.

హిందీలో ఏం సినిమాలు చేశారు? అక్కడే ఎందుకు స్థిరపడలేకపోయారు?

తమన్‌: గోల్‌మాల్‌, సింబా, సూర్యవంశీ సినిమాలు చేశా. బాలీవుడ్‌లో వారు సంగీతాన్ని చూసే విధానం నాకు నచ్చలేదు. ‘ఒక పాట చేయి.. ఒక రీల్‌ ఆర్‌ఆర్‌ చేయి’ అంటుంటారు. అది నా వల్ల కాదు. ఒక సినిమాకి ఆరుగురు సంగీత దర్శకులు ఎలా పనిచేస్తారో అర్థం కాదు. రామ్‌గోపాల్‌ వర్మ, రెహమాన్‌ గారు ఎలా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారో.. మన దర్శకులతో వెళ్లి హిందీ సినిమాలు చేయాలని నా అభిప్రాయం.

నా జీవితంలో ముఖ్యమైన దశ గురించి చెబుతా.. మణిశర్మ గారి దగ్గర ఎనిమిదేళ్లు. ‘ఒక్కడు’ నుంచి ‘బిల్లా’ దాక పనిచేశా. అక్కడ మ్యూజిక్‌ను ఏ విధంగా చేయాలో నేర్చుకున్నా. నా కెరీర్‌లో అతి ముఖ్యమైన వ్యక్తి మణిశర్మ గారు. సురేందర్‌రెడ్డి గారు అక్కడే నాకు పరిచమయ్యారు. ఆ తర్వాత చక్రి గారితో ‘బాచీ’ నుంచి ‘దేవదాస్‌’ వరకు పనిచేశాను. అప్పుడు పూరీ గారితో పరిచయం. రవితేజ గారి అన్ని సినిమాలకు నేను పనిచేశా. అలా ఒకసారి సురేందర్‌రెడ్డి, రవితేజ గారు కలిసి కొత్త సంగీత దర్శకుడిని తీసుకోవాలని భావించారు. అలా నాకిచ్చిన ‘కిక్‌’ ఇంకా కొనసాగుతోంది. 

పూరీ జగన్నాథ్‌ ‘బుజ్జీగాడు’ సినిమాకి చేయమంటే చేయలేదట?

తమన్‌: మణిశర్మ గారంటే నాకు తండ్రితో సమానం. ఆయన.. పూరీ గారి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ సినిమా బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత పూరీ సినిమాకి మణిశర్మ అసిస్టెంట్‌ అయినా నేను సంగీత దర్శకుడిగా మారడం నాకు ఇబ్బందిగా అనిపించింది. గురువుకు ద్రోహం చేయకూడదని వెళ్లలేదు. మణిగారికి నా గురించి చాలా మంది చెడుగా చెప్పారు. అయినా ఆయన నాపై నమ్మకం ఉంచి, నన్ను ప్రోత్సహించారు. 

బాలయ్య ఫ్యాన్స్‌ గురించి?

తమన్‌: చాలా గొప్పవాళ్లు. భారత్‌లో ఉత్తమ సినీ పరిశ్రమలో ఉన్నాం. ఫ్యాన్‌ బేస్‌ ఉంది కాబట్టే.. జాగ్రత్తగా పనిచేస్తున్నాం.

పెద్దలు కుదిర్చిన వివాహమా? ప్రేమ వివాహమా?

తమన్‌: పెద్దలు కుదిర్చిందే. ప్రేమించే సమయమే ఉండేది కాదు. నేను ప్రేమలో పడితే.. మా అమ్మ, చెల్లి ఇబ్బందులో పడతారా అని ఆలోచించి బాధ్యతగా ఉండేవాణ్ని. నాకు ఐదుగురు పెద్దమ్మలు ఉంటే వారందరికీ ముగ్గురు చొప్పున అమ్మాయిలు ఉన్నారు. నేను ఒక్కడినే మగపిల్లవాడిని. అందరూ నా మీద పడ్డారు. వాళ్ల పెళ్లిళ్లు జరిగే వరకు బాగానే ఉన్నారు. నాకు 25ఏళ్లకే పెళ్లయింది. ఇప్పుడు నాకొక కుమారుడు ఉన్నాడు. పదో తరగతి చదువుతున్నాడు. 

127 సినిమాలు చేశారు.. నీ కెరీర్‌ గ్రాఫ్‌ను మలుపు తిప్పిన సినిమా ఏది?

తమన్‌: దూకుడు. ఇదే కాదు.. చాలా ఉన్నాయి. తొలి సినిమా ‘కిక్‌’ అవకాశం రావడమే గొప్ప విషయం. ‘ఇంత పెద్ద సినిమాకి కొత్త సంగీత దర్శకుడిని తీసుకున్నారేంటి’ అని చాలా మంది అన్నారు. అయినా.. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన రవితేజకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆయనతో 13 సినిమాలు చేశాను. మనది ‘హీరో బేస్‌డ్‌’ సినిమా వాళ్లే పరిశ్రమను నడుపుతున్నారు. ఒక సినిమా పూర్తవగానే తర్వాత ఏంటి అనే ప్రశ్న మాకు ఎదురవుతుంటుంది.

శివమణి గారిని కలుస్తుంటారా?

తమన్‌: నా ప్రతి రికార్డింగ్‌ ఆయనతోనే చేయిస్తాను. నా తండ్రి ఆయనలో ఉన్నారని భావిస్తాను. 

ఎస్పీబీ గారిని ఒక మాటలో వర్ణించమంటే..?

తమన్‌: ఎస్పీబీ - మా ఇంటిని కాపాడిన మనిషి

శ్రీవర్ధిని గురించి ఒక్క మాటలో?

తమన్‌: శ్రీవర్ధిని - త్యాగం. నాకోసం చాలా త్యాగం చేసింది. నేను ఆమెకు ఎక్కువ సమయం కేటాయించడం కుదరట్లేదు. మా కుమారుడికి సంగీతం అంటే ఇష్టం. కానీ, నా ముందు పాటలు పాడాలంటే వాడికి సిగ్గు. మా ఇంట్లో అత్యంత ప్రతిభ ఉన్నది నా భార్యకే. ఇంట్లోనే ట్రోలింగ్‌ బాగా జరుగుతుంది. కాబట్టి బయట ట్రోలింగ్‌ను పట్టించుకోను. 

కోటి గారు?

మన్‌: కోటి - నాకు అంబులెన్స్‌. నాకు సమస్య ఉన్నప్పుడల్లా నాకు పని ఇచ్చేవారు.

డీఎస్పీ(దేవీ శ్రీప్రసాద్‌)?

మన్‌: డీఎస్పీ - స్ఫూర్తి. ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఆయన వద్ద నేను ‘రెడీ’, ‘బొమ్మరిల్లు’, ‘మల్లన్న’ ఇలా ఐదు సినిమాలకు ప్రోగ్రామర్‌గా పనిచేశా. 

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని