Rajasekhar: అప్పుడు రెండు, మూడు రోజుల్లో చనిపోతాననుకున్నా: రాజశేఖర్‌

‘శేఖర్‌’తో ఓ కొత్త రాజశేఖర్‌(Rajasekhar)ను చూస్తారని నటి జీవిత(Jeevitha) అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి జీవితా రాజశేఖర్‌ దంపతులు విచ్చేసి అనేక విషయాలను పంచుకున్నారు.

Updated : 07 Jan 2022 17:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘శేఖర్‌’తో ఓ కొత్త రాజశేఖర్‌(Rajasekhar)ను చూస్తారని నటి జీవిత(Jeevitha) అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి జీవితా రాజశేఖర్‌ దంపతులు విచ్చేసి అనేక విషయాలను పంచుకున్నారు. సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఇద్దరూ వేర్వేరుగా ప్రివ్యూ షోలకు వెళ్లి వస్తుంటే తొలిసారి చూసుకున్నామని జీవిత తెలిపారు. ఇక త్వరలో విడుదల కానున్న ‘శేఖర్‌’ కథతో తాను చాలా కనెక్ట్‌ అయ్యాయని, సినిమా షూటింగ్‌ చేద్దామనుకునే సమయానికి రాజశేఖర్‌ కొవిడ్‌ బారినపడ్డారని వివరించారు. అప్పుడు ఎంత సీరియస్‌ అయిందో అందరికీ తెలిసిందేనని, నెల రోజుల పాటు ఐసీయూలో ఉన్నారని చెప్పుకొచ్చారు.

‘నాకు సీరియస్‌ అయినప్పుడు చనిపోతానని అనుకున్నా. రెండు, మూడురోజుల్లో నా శవాన్ని తీసుకెళ్లి చితికి నిప్పు పెడతారని అనుకుంటూ ఉండేవాడిని. అప్పటికి నా మైండ్‌ అలా ఉంది’ అని రాజశేఖర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ‘నట వారసులు ఉంటే బాగుండేదని మీకెప్పుడైనా అనిపించిందా’ అని ఆలీ అడగ్గా ‘నాకు చాలాసార్లు అనిపించింది. కానీ, కుదరలేదు’ అని రాజశేఖర్‌ చెప్పేసరికి నవ్వులు వెల్లి విరిశాయి. రాజశేఖర్‌ తనని కుట్టి అని ముద్దుగా పిలుస్తారని ఈ సందర్భంగా జీవిత చెప్పుకొచ్చారు. ‘మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా విభేదాలు వచ్చాయా’ అని ఆలీ అడిగిన ప్రశ్నకు, ‘ఎలాంటి భార్య లభిస్తుందన్నది దేవుడిచ్చిన వరం’ అంటూ రాజశేఖర్‌ సమాధానం ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని