Anil raavipudi: బాలకృష్ణతో సినిమా తీయాలని అప్పుడే అనుకున్నా: అనిల్‌ రావిపూడి

ఒకరు ఫ్యామిలీ ప్యాక్‌తో నవ్వించే కమెడియన్‌ మాత్రమే కాదు, సిక్స్‌ ప్యాక్‌తో అలరించే హీరో కూడా. ఇక మరొకరు డైలాగ్స్‌తో విజిల్స్‌ కొట్టించే రైటర్‌ మాత్రమే కాదు, ఫన్నీ ఎంటర్‌టైనర్‌తో బిందాస్‌ ఎంటర్‌టైనింగ్‌ ఇస్తున్న డైరెక్టర్‌ కూడా.

Updated : 25 May 2022 10:10 IST

ఒకరు ఫ్యామిలీ ప్యాక్‌తో నవ్వించే కమెడియన్‌ మాత్రమే కాదు.. సిక్స్‌ ప్యాక్‌తో అలరించే హీరో కూడా. ఇక మరొకరు డైలాగ్స్‌తో విజిల్స్‌ కొట్టించే రైటర్‌ మాత్రమే కాదు.. ఫన్నీ ఎంటర్‌టైనర్‌తో బిందాస్‌ ఎంటర్‌టైనింగ్‌ ఇస్తున్న డైరెక్టర్‌ కూడా. ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌తో వచ్చిన క్రేజీ స్టార్స్‌ సునీల్‌, అనిల్‌ రావిపూడి ఇద్దరు ఆలీతో చెప్పిన ముచ్చట్లేంటో చూద్దాం.

అనిల్‌తో మొదటిసారి పనిచేసినట్లు ఉన్నారు. ఎలా అనిపించింది?

సునీల్‌: అనిల్‌ దర్శకత్వంలో నటించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు ‘గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ’, ‘బాస్‌’ సినిమాల షూటింగ్‌లో కలిశానంతే. అనిల్‌ దర్శకత్వంలో నటించడం అద్భుతమైన అనుభూతి. చాలా సులువుగా ఉంటుంది. శ్రమంతా ఆయనే పడతారు. మనకు కష్టం లేకుండా చేస్తారు. మళ్లీ ఎప్పుడెప్పుడు అనిల్‌తో పని చేస్తానా? అని ఉంది.

‘ఎఫ్‌3’ షూటింగ్‌లో 40రోజులు పాల్గొన్నారా?

సునీల్‌: దాదాపు 70 రోజులు పాల్గొన్నా. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, రాజేంద్రప్రసాద్‌, మీరు(ఆలీ), వెన్నెల కిశోర్‌, పృథ్వీ, రఘుబాబు ఇలా చాలా మంది ఆర్టిస్టులతో కలిసి ఉండటం చాలా సంతోషానిచ్చింది. నేను ఇంత మందితో కలిసి నటించడం ఇదే మొదటిసారి.

ఒంగోలులో డాడీ కాకుండా, హైదరాబాద్‌లో డాడీ ఎలా ఉన్నారు?

అనిల్‌ రావిపూడి: హైదరాబాద్‌లో డాడీ బ్రహ్మాండంగా ఉన్నాడు(నవ్వుతూ). నేను రాజేంద్రప్రసాద్‌ని ‘డాడీ’ అని పిలుస్తాను. నేను తీసిన ప్రతి సినిమాలో ఆయన ఉంటారు. ‘ఎఫ్‌3’లో కూడా నిజాయతీ గల పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఇక ఒంగోలులో ఉంటున్న మా నాన్న కూడా బాగున్నారు.

‘ఎఫ్‌4’ తీస్తారా?భవిష్యత్తులో కామెడీ సినిమాలే తీస్తారా. యాక్షన్‌వి కూడా తీస్తారా?

అనిల్‌: ‘ఎఫ్‌3’ని ప్రేక్షకులు ఆదరిస్తే కచ్చితంగా ‘ఎఫ్‌4’ తీస్తాను. నేను చేసిన సినిమాల్లో యాక్షన్‌వి చాలానే ఉన్నాయి. ‘పటాస్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా ది గ్రేట్‌’ సినిమాల్లో ఎంటర్‌టైనింగ్‌ ఎంత ఉంటుందో అంతకు డబుల్‌ యాక్షన్‌ ఉంటుంది.   

అనిల్‌లో మీకు నచ్చిన మూడు గుణాలు చెప్పండి?

సునీల్‌: ఎప్పుడూ హుషారుగా, నవ్వుతూ ఉంటారు. మరొకటి తను కష్టపడే విధానం. అన్నింటికంటే ముఖ్యమైంది తనకు అసలు కోపం రాదు. ఎవ్వరికీ ఏ విషయంలో నో చెప్పడు. 

ఎవరికైనా స్నేహితులు మన వయసుకు దగ్గరగా ఉండే వాళ్లు ఉంటారు. మీకు ముసలివాళ్లు ఎక్కువ మంది ఉన్నారుట నిజమేనా?

సునీల్‌: నిజమే. నాకు 6 ఏళ్లు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. ఇక ఇంట్లో మగవాళ్లెవ్వరూ లేరు.  నేను ఒక్కడి. దీంతో అన్ని చూసుకునేవాడిని. నా కంటే పెద్దవాళ్లు మాట్లాడేటప్పుడు నాకు చాలా ఆసక్తి ఉండేది. అందుకే నా స్నేహితుల్లో నా కంటే పెద్దవాళ్లుంటారు. 

భీమవరం నుంచి హైదరాబాద్‌ ఇష్టంతో వచ్చావా?

సునీల్‌: ఆర్థికంగా మా పరిస్థితి బాగానే ఉండేది. హైదరాబాద్‌ రావడం, సినిమాల్లో నటించడం నా కల. ఇంట్లో వాళ్లు చదువుకోమన్నారు. పీజీ ఒక సంవత్సరం చదివా. నాకున్న బైక్‌ అమ్మేసి ఆ డబ్బుతో హైదరాబాద్‌ వచ్చేశా. 

మొదట హీరో అవ్వాలనుకుని మళ్లీ విలన్‌ అవ్వాలని అనుకున్నావు ఎందుకు?

సునీల్‌: మొదట హీరో అవ్వాలని అనుకున్నా. ఇంటర్‌లో ఉన్నప్పుడు హీరోగా నెగ్గలేమేమో అనిపించింది. ఆ సమయంలో మోహన్‌బాబు విలన్‌గా చేసిన ‘దేవత’ లాంటి సినిమాలు చూసి ఆయన లాగా అవుదామనుకున్నా. 

‘ఎఫ్‌3’ సినిమా షూటింగ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అన్ని రోజులు ఎందుకుచేశారు?

అనిల్‌: ఫలక్‌నుమా ప్యాలెస్‌ చాలా ఖరీదైంది. కరోనా కారణంగా చాలా రోజులు షూటింగ్‌ వాయిదా పడింది. అందుకే ఎక్కువ రోజులు చేయాల్సి వచ్చింది. ‘ఎఫ్‌3’ షూటింగ్‌ అంతా ఇండియాలోనే చేశా. 

మీ సినిమాల గురించి ఇంట్లో చర్చ జరుగుతుందా?

అనిల్‌: అంతగా ఉండదు. నా భార్యది చాలా జాలి హృదయం. అందుకే ఏ సినిమాని తక్కువగా చూడదు. వాళ్ల కష్టాన్ని గుర్తిస్తుంది. 

‘ఎఫ్‌4’ కూడా వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌లతోనే తీస్తారా?

అనిల్‌: ప్రస్తుతానికి ఆలోచనంతా ‘ఎఫ్‌3’పైనే ఉంది. ‘ఎఫ్‌4’ కచ్చితంగా తీస్తాము. దానికి సంబంధించిన కథ ఇంకా సిద్ధం చేసుకోలేదు. కథ రెడీ అయ్యాక ఎవరు అయితే బాగుంటుంది అని చెప్పవచ్చు. 

‘ఎఫ్‌3’ ఎలా ఉంటుంది? ఈ సినిమాలో ఎవరు బాగా చేశారంటే ఏం చెప్పారు?

అనిల్‌: ఎవరి ఆరాటమైనా, పోరాటమైనా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఆ డబ్బు చుట్టూ జరిగే ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషనే ‘ఎఫ్‌3’. అన్ని పాత్రలు తొందరగా డబ్బును సంపాదించి అందరి కంటే ధనవంతులు అవ్వాలని డ్రీమ్స్‌లో ఉంటాయి. ఒకరిని ఒకరు ముంచేసి అయినా సరే పైకి ఎదగాలి అనుకుంటుంటారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు వందశాతం నటించారు. ఇది టీమ్‌ వర్క్‌. అందుకే అందరికీ వంద మార్కులు వేస్తాను.

దిల్‌రాజు బడ్జెట్‌ విషయంలో వ్యయం ఎక్కువవుతుందని ఎప్పుడైనా చెప్పారా?

అనిల్‌: నేను దిల్‌రాజు బ్యానర్‌లో చేస్తున్న ఐదో సినిమా ఇది. ఆయనకు నా గురించి తెలుసు. నేను ఏదీ వృథా చేయనని తెలుసు. సినిమాకు ఏమి కావాలో అదే చేస్తాను. 

యాక్టర్‌ అవ్వాలనే కోరిక ఉందా? భవిష్యత్తులో హీరోగా చేయాల్సి వస్తే చేస్తారా? 

అనిల్‌: హీరోగా చేయాలని లేదు. అది చాలా పెద్ద బాధ్యత. నేను అలాంటివి తీసుకోను. ఒకవేళ అవకాశం వస్తే ఆర్టిస్టుగా చేస్తా. 

నీ స్నేహితుడికి టార్చ్‌లైట్‌ ఇచ్చి ఆన్‌ అండ్‌ ఆఫ్‌ చేస్తుండమని స్టేజీ ఎక్కావట దాని కథ ఏంటి?

సునీల్‌: ఐదో తరగతిలో జంగారెడ్డి గూడెం దగ్గర ఒక ఊరులో చదివాను. అప్పుడు చిరంజీవి ‘మహానగరంలో మాయగాడు’ సినిమాలోని పాటకు డాన్స్‌ చేశాను. ఒరిజినల్‌ పాటలో ఫ్లాష్‌ లైట్‌ ఉంది. నేను టార్చ్‌లైట్‌ని వాడుకున్నాను. 

‘పుష్ప’ తర్వాత విలన్‌గా ఇతర భాషల నుంచి ఏమైనా అవకాశాలు వస్తున్నాయా?

సునీల్‌: తమిళం, హిందీ నుంచి అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో రెండు ప్రాజెక్టులు ఓకే చేశాను. రెండూ విలన్‌ తరహా పాత్రలే. హిందీలోనూ రెండు సినిమాలు ఒప్పుకున్నాను. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు చెబుతాను.   

మీ తర్వాత సినిమాలో బాలయ్యని ఎలా చూపించబోతున్నారు?

అనిల్‌: స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. నేను చాలా ఆతృతగా ఉన్నాను. బాలకృష్ణ గత సినిమాల్లో కంటే విభిన్నంగా చూపించాలని ప్రయత్నిస్తున్నా. ఆయన ఎనర్జీ ఆయన మార్కు కనిపిస్తూనే ఉంటుంది. ‘లయన్‌’ సినిమా అప్పుడు బాలకృష్ణతో సినిమా తీయాలని అనుకున్నాను. అది ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాలో కామెడీ టచ్‌ ఉంటుంది. కానీ ప్రేక్షకులు యాక్షన్‌లో ఓ కొత్త యాంగిల్‌ చూస్తారు.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేశ్‌ని కష్టపెట్టారని విన్నాం నిజమేనా?

అనిల్‌: అసలు లేదు. 5 నెలలు షూటింగ్‌ చేశాం. ఆయన షూటింగ్‌ జరుగుతున్నప్పుడు బాగా ఎంజాయ్‌ చేశారు. స్పాట్‌కు వస్తే ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు.  

విజయశాంతికి అభిమానా మీరు? ఆవిడని సినిమాల కోసం ఎలా ఒప్పించారు?

అనిల్‌: ఆవిడని ఇష్టపడని వాళ్లుండరు. ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలోనే తీసుకువద్దామని ప్రయత్నించాం. కానీ కుదరలేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా  కథ విన్నాక ఓకే చేశారు. కానీ ఆవిడకి ఫైట్స్‌ చేయలేకపోయానని వెలితి ఉంది. భవిష్యత్తులో ఏదైనా మంచి కథ ఉంటే తప్పకుండా మీతో ఫైట్స్‌ చేయిస్తాను అని చెప్పా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని