ఏ సీరియల్‌లో నటిస్తున్నావ్‌ అన్నారట!

తనదైన కామెడీ టైమింగ్‌, పంచ్‌లతో మినిమం గ్యారెంటీ నటుడిగా పేరు తెచ్చుకున్నారు ‘అల్లరి’ నరేష్‌. తొలి చిత్రాన్నే తన ఇంటి పేరుగా మార్చుకుని వరుస

Published : 23 Oct 2020 17:23 IST

హైదరాబాద్‌: తనదైన కామెడీ టైమింగ్‌, పంచ్‌లతో మినిమం గ్యారెంటీ నటుడిగా పేరు తెచ్చుకున్నారు ‘అల్లరి’ నరేష్‌. తొలి చిత్రాన్నే తన ఇంటి పేరుగా మార్చుకుని వరుస హిట్లు అందుకున్నారు. ఇటీవల వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. అయితే, తన తొలి సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు.

‘‘ఎన్ని సినిమాలు చేసినా తొలి సినిమా పంచిన అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేం. జీవితంలో అదొక గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ‘అల్లరి’ కోసం తొలిసారి కెమెరా ముందుకు వెళ్లినరోజు, తొలి సన్నివేశాన్ని చిత్రీ  కరించిన సందర్భం నాకు ఇప్పటికీ బాగా గుర్తు. హీరోయిన్‌ శ్వేత, నేను బైక్‌లో వెళుతూ మాట్లాడుకునే సన్నివేశం అది. రామానాయుడు స్టూడియోలో కూర్చుని రిహార్సల్స్‌ చేసుకుని వెళ్లాం. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దగ్గర మొదలు పెట్టాం. ఆ సినిమాకి పరిమిత సంఖ్యలోనే సాంకేతిక బృందం పనిచేసింది. ముందు మారుతి వ్యాన్‌లో కెమెరా, మేం వెనక బైక్‌లో ఉన్నాం. అది షూటింగ్‌ అని అందరికీ అర్థమైపోతుంది. ట్రాఫిక్‌లో అటూ ఇటూ ఉన్నవాళ్లు ‘ఏ సీరియల్‌ భయ్యా’ అనేవారు’’

‘‘ఇప్పుడంటే అందరూ గుర్తు పడతారు కానీ, అప్పటికి నేనెవరనేది ఎవ్వరికీ తెలియదు కదా. అప్పుడే నన్నంతా గుర్తు పట్టాలి అనే తపన కలిగింది. ‘అల్లరి’ హైదరాబాద్‌లోని సంధ్య 70 ఎమ్‌.ఎమ్‌.లో విడుదలైంది. స్నేహితులతో కలిసి సినిమా చూడటానికి వెళ్లా. ‘ఇది ఆడితేనే నాకు ఈ జీవితం, లేదంటే మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలి’ అనుకుంటూ థియేటర్లోకి అడుగు పెట్టా. లోపలికి వెళ్లే ధైర్యం లేదు. స్నేహితుల్ని కూర్చోబెట్టి మళ్లీ బయటికి వచ్చా. కూల్‌డ్రింక్‌ తాగి మళ్లీ లోపలికి వెళ్లా. విరామ    సమయంలో బయటికొచ్చి అందరితోపాటు పాప్‌కార్న్‌, సమోసా కొనుక్కున్నా. అప్పుడైనా ఎవరైనా గుర్తు పడతారేమో అని ఓ చిన్న ఆశ. ఎవరూ గుర్తు పట్టలేదు. సినిమా పూర్తయ్యాక మళ్లీ బయటికొచ్చా. ఒకళ్లిద్దరు బాగా గమనించి ‘ఇతనే ఇందులో హీరో’ అంటూ నా దగ్గరికి వచ్చారు. తొలిసారి ఇద్దరు ముగ్గురు వచ్చి ఆటోగ్రాఫ్‌లు అడగడం, ‘బాగుంది భయ్యా సినిమా’ అని చెప్పడం భలే కిక్‌నిచ్చింది’’ అంటూ చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని