Allari Naresh: ఆ సినిమాతో నా రేంజ్‌ పెరిగిపోతుందనుకున్నా కానీ: నరేశ్‌

అల్లరి నరేశ్‌ నటించిన తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 24 Nov 2022 02:03 IST

హైదరాబాద్‌: తాము నటించిన కొన్ని సినిమాలపై నటులకు ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఫలానా చిత్రం ఘన విజయం అందుకుంటుందని, దాంతో వాళ్ల కెరీర్‌ మారిపోతుందనుకుంటారు. కానీ, ఒక్కోసారి పరిస్థితులు తారుమారవుతాయి. ఇలా తనకు ఎదురైన అనుభవాన్ని అల్లరి నరేశ్‌ (Allari Naresh) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన కొత్త చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam) ప్రచారంలో భాగంగా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

‘‘నేను’ అనే సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఆ చిత్రం విడుదలయ్యాక నా రేంజ్‌ పెరిగిపోతుందనుకున్నా. అంతగా ఈ సినిమాని నమ్మా. అది ఆశించనంత ఫలితాన్ని ఇవ్వకపోయినా మంచి జ్ఞాపకాలను మాత్రం మిగిల్చింది. ఆ సినిమా వల్లే నాకు ‘గమ్యం’లో మంచి పాత్ర లభించింది. దీనివల్ల ‘శంభో శివ శంభో’, ఈ మూవీ వల్ల ‘మహర్షి’లో నటించే అవకాశం దక్కింది. ఇందులోని సీరియస్‌ క్యారెక్టర్‌ను పోషించడం వల్ల ‘నాంది’ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది’’ అని నరేశ్‌ తెలిపారు. అభివృద్ధికి దూరంగా ఉండే గిరిజన ప్రాంతాల సమస్యలను ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ద్వారా తెరపైకి తీసుకురానున్నారు దర్శకుడు ఎ. ఆర్‌. మోహన్‌. ఈ సినిమాలో నరేశ్‌కు జోడీగా ఆనంది నటించింది. ఈ చిత్రం నవంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని