అభిమానుల చర్యతో షాకైన అల్లు అర్జున్‌

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో ప్రేక్షకాదరణ మెండుగా పొందిన హీరో అల్లు అర్జున్‌. వరుస సినిమాల్లో నటిస్తూ..

Published : 10 Mar 2021 16:46 IST

వైరల్‌గా మారిన వీడియోలు

హైదరాబాద్‌: ప్రస్తుతం ‘పుష్ప’ షూట్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌ తాజాగా ‘చావు కబురు చల్లగా’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించారు.

కాగా, ఎంతో జోష్‌ఫుల్‌గా సాగిన ఈవెంట్‌లో అభిమానులు చేసిన ఓ పనితో బన్నీ షాక్‌కు గురయ్యారు. ఈవెంట్‌లో భాగంగా ఓ అభిమాని సెల్ఫీ కోసం ఆయన వద్దకు రాబోతుండగా సెక్యూరిటీ సిబ్బంది ఆపివేశారు. దాంతో బన్నీ ఆ వ్యక్తిని దగ్గరకు రమ్మని పిలవడంతో అక్కడే ఉన్న ఇంకొంతమంది అభిమానులు ఒక్కసారిగా స్టేజ్‌ ఎక్కి తమ అభిమాన హీరోను చుట్టుముట్టారు. భద్రతా సిబ్బంది అభిమానుల్ని వారించే ప్రయత్నం చేయగా.. వద్దని బన్నీ సూచించాడు.

అంతేకాకుండా ప్రోగ్రామ్‌ చివర్లో అభిమానుల గురించి మాట్లాడుతూ.. ‘ఫ్యాన్స్‌ అంటే తక్కువే అవుతుంది. మీరే నా ధైర్యం. నా బలం. నా ప్రాణం. స్వతహాగా గర్వపడే విధంగా నా జీవితంలో ఏదైనా సంపాదించుకున్నాను అంటే అది కోట్లు కాదు. కారు కాదు. కేవలం మీ అభిమానం. మీరు గర్వపడే స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. నన్ను నమ్మండి. ఇదే నేను మీకిస్తున్న ప్రామిస్’’ అని అల్లు అర్జున్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని