‘అల్లుడు అదుర్స్‌’ అనడం పక్కా

అల్లుడు సీను’తో అదిరిపోయేలా సినీ అరంగేట్రం చేసి.. ‘స్పీడున్నోడు’తో స్పీడు పెంచి.. ‘జయజానకీ నాయకా’, ‘సాక్ష్యం’, ‘కవచం’, ‘సీత’, ‘రాక్షసుడు’.. వంటి చిత్రాలతో అదరగొట్టి.. మరోసారి ‘అల్లుడు అదుర్స్‌’తో అలరించేందుకు సిద్ధమయ్యాడు యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌.

Published : 11 Jan 2021 01:23 IST

ఘనంగా ప్రిరిలీజ్‌ వేడుక

హైదరాబాద్‌: ‘అల్లుడు శీను’తో తెరంగేట్రం చేసి.. ‘స్పీడున్నోడు’తో స్పీడు పెంచి.. ‘జయ జానకీ నాయకా’, ‘సాక్ష్యం’, ‘కవచం’, ‘సీత’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో అదరగొట్టి.. మరోసారి ‘అల్లుడు అదుర్స్‌’తో అలరించేందుకు సిద్ధమయ్యాడు యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతోందీ చిత్రం. నభానటేశ్‌, అను ఇమాన్యుయెల్‌ కథానాయికలు. ప్రకాశ్‌రాజ్‌, సోనూసూద్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాత. ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రి రిలీజ్‌ వేడుక నిర్వహించింది.

ఈ సందర్భంగా దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ మాట్లాడారు.. ‘ఈ సినిమాకు ప్రధాన కారణం బెల్లంకొండ సురేశ్‌గారు. నాకు మొదటి సినిమా ఇచ్చిన నిర్మాత ఆయన. అందుకే ఎంతో బాధ్యతగా ఎక్కడా రాజీ లేకుండా హీరో సాయి శ్రీనివాస్‌కు సరిపోయే కథ సిద్ధం చేశాను. ఆయన ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డారు. తెరపై ఆయన కష్టం మీకు కచ్చితంగా కనిపిస్తుంది. హీరోయిన్‌ నభా కూడా బాగా పనిచేసింది. కరోనా వల్ల ఇబ్బందులు ఎదురైనా నిర్మాత సుబ్రహ్మణ్యం ఎక్కడా తగ్గలేదు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ చాలా కీలకంగా పనిచేశారు. అందరి కష్ట ఫలితమే ఈ సినిమా. దేవీశ్రీప్రసాద్‌ గురించి చెప్పాలంటే.. ఒక ఫోన్‌ చేసి అడగ్గానే సినిమాకు సరే అన్నారాయన. చాలా మంచి సంగీతం ఇచ్చారు. చాన్నాళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులు మంచి పాటలను ఆస్వాదిస్తున్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఈ ప్రిరిలీజ్‌ వేడుక నిర్వహిస్తున్నాం. ఈ సంక్రాంతికి అందరితో ఈ ‘అల్లుడు’ శెభాష్‌ అనిపించుకుంటాడు’’ అని డైరెక్టర్‌ అన్నారు.

కథానాయకుడు బెల్లంకొండ  శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘నిర్మాత గంజి రమేశ్‌, సుబ్రహ్మణ్యం గారు సినిమాకు వెన్నెముకలా నిల్చున్నారు. డైరెక్టర్‌ వాసు.. నన్ను ఒక తమ్ముడిలా చూసుకున్నారు. ఆయన ఈ సినిమా కథ మీద నాలుగు నెలలు కష్టపడ్డారు. కరోనా సమయంలోనూ ఆయన విశ్రాంతి తీసుకోలేదు. సినిమాలో నటులందరికీ ప్రత్యేక కృతజ్ఞలు. అందరూ ఎంతో కష్టపడ్డారు. నేను పనిచేసిన హీరోయిన్లందరిలో నభానటేశ్‌ చాలా ప్రత్యేకం. అను ఇమాన్యుయెల్‌ పాత్ర మీకు సర్‌ప్రైజ్‌లాంటిది. దేవీశ్రీప్రసాద్‌ గారి సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జనవరి 14న మా సినిమా మీ అందర్నీ అలరిస్తుంది’’ అని శ్రీనివాస్‌ అన్నారు.

ఇదీ చదవండి..

‘చంటి’ ఆ హీరోతో తీద్దామనుకున్నారు.. కానీ..!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని