Amala Paul: తెలుగు చిత్రపరిశ్రమను వారే శాసిస్తున్నారు.. అమలాపాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

తమిళంతో పాటు, తెలుగులోనూ చిత్రాలు చేసిన అలరించిన నటి అమలపాల్‌. కేవలం సినిమాలే కాదు, వెబ్‌సిరీస్‌ల్లోనూ ఆమె

Updated : 15 Sep 2022 14:47 IST

చెన్నై: తమిళంతో పాటు, తెలుగులోనూ చిత్రాలు చేసి అలరించిన నటి అమలాపాల్‌ (Amala Paul). కేవలం సినిమాలే కాదు, వెబ్‌సిరీస్‌ల్లోనూ ఆమె నటిస్తున్నారు. తాజాగా, తెలుగు చిత్ర పరిశ్రమపై ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్‌ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమను సినీ కుటుంబాలు, అభిమానులే శాసిస్తున్నారని అభిప్రాయపడింది. దీనికి తోడు రొమాంటిక్‌ సన్నివేశాలు, పాటలు తప్ప ఇక్కడ హీరోయిన్స్‌కు పెద్దగా స్థానం లేదని చెప్పుకొచ్చింది.

తాను ఎక్కువ తెలుగు సినిమాలు చేయకపోవడంపై ఆమెను ప్రశ్నించగా, అమలాపాల్‌ స్పందిస్తూ.. ‘‘నేను తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని గమనించా. అక్కడ ఫ్యామిలీ కాన్సెప్ట్‌ నడుస్తోంది. ఆ ఇండస్ట్రీలో సినీ కుటుంబాలు, వారి వారసులు, అభిమానులదే పైచేయి. ఇక సినిమాలు తెరకెక్కించే తీరు కూడా విభిన్నంగా ఉంటుంది.  ఒక హీరో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఇద్దరితోనూ లవ్‌ సీన్స్‌, పాటలు ఉంటాయి. ప్రతిదీ గ్లామరస్‌గా చూపిస్తారు. అక్కడ తెరకెక్కేవన్నీ కమర్షియల్‌ చిత్రాలే. అందుకే ఆ ఇండస్ట్రీకి నేను కనెక్ట్‌ కాలేకపోయా. చాలా తక్కువ సినిమాలు చేయడానికి బహుశా అదీ ఓ కారణమేమో’’ అని అమలాపాల్‌ చెప్పుకొచ్చింది.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ లోనూ అమలాపాల్‌కు అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిసారి ఆడిషన్‌  అయిన తర్వాత ఆమెను పక్కన పెట్టారు. అయితే, మళ్లీ ఆడిషన్‌/టెస్ట్‌ లుక్‌కు పిలవగా, ‘నా మానసిక స్థితి సరిగా లేదు. ఏమీ అనుకోవద్దు’ అని నిర్మొహమాటంగా ఆఫర్‌ను వద్దని చెప్పింది అమలాపాల్‌. ఇటీవల ఆమె నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘కడవర్‌’ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని