కోలుకున్న అమితాబ్‌పై అమూల్‌ ప్రత్యేక కార్టూన్‌

పాలు, పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ దేశీయంగా ఎంతో పాపులర్‌. అప్పుడప్పుడు సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రతిబింబించేలా తమ అమూల్‌ బ్రాండ్‌ గర్ల్‌ బొమ్మతో కూడిన కార్టూన్లు వేస్తుంటుంటుంది. తాజాగా బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కోసం

Published : 06 Aug 2020 00:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాలు, పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ దేశీయంగా ఎంతో పాపులర్‌. అప్పుడప్పుడు సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రతిబింబించేలా తమ అమూల్‌ బ్రాండ్‌ గర్ల్‌ బొమ్మతో కూడిన కార్టూన్లను రూపొందిస్తుంటుంది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కోసం ప్రత్యేక కార్టూన్ రూపొందించింది. ప్రస్తుతం ఈ కార్టూన్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

గత నెలలో అమితాబ్‌, ఆయన కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో వారంతా ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజులకు అమితాబ్‌ కోడలు ఐశ్వర్యారాయ్‌, మనవరాలు ఆరాధ్య కరోనా నుంచి కోలుకున్నారు. మూడ్రోజుల క్రితం అమితాబ్‌ బచ్చన్‌ కూడా కోలుకొని డిశ్చార్జి అయి ఇంటికి వచ్చారు. ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చిన ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో అమూల్‌ సంస్థ కూడా అమితాబ్‌ బచ్చన్‌కు అభినందనలు తెలుపుతూ ప్రత్యేక కార్టూన్‌ను రూపొందించింది. కూర్చిలో అమితాబ్‌ కూర్చొని ఒక చేతిలో మొబైల్‌ ఫోన్‌, మరో చేతి వేలితో వెన్న పట్టుకొని ఉన్నట్లు.. అమూల్‌ గర్ల్‌ ఆయన భూజాలపై వాలి మొబైల్‌ను చూస్తున్నట్లుగా కార్టూన్‌ ఉంది. దీనిపై ‘ఏబీ బీట్స్‌ సీ’(అమితాబ్‌ బచ్చన్‌ కరోనాను ఓడించారు అనే ఉద్దేశంతో)అని రాశారు. ఈ అమూల్‌ కార్టూన్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

తనను ఉద్దేశిస్తూ అమూల్‌ రూపొందించిన కార్టూన్‌పై అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు. ‘‘మీ ప్రత్యేకమైన పోస్టర్‌ ప్రచారంలో నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలుగా అమూల్‌ నన్ను సత్కరిస్తోంది. ఓ సాధారణ వ్యక్తిని అమూల్యంగా మార్చింది’’అని అమితాబ్‌ ఆ కార్టూన్‌ను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని