Anasuya: నిజాలు తెలుసుకోకుండా నా పేరు వాడితే కోర్టుకెళతా!

తనను సంప్రదించకుండా తనపై తప్పుడు వార్తలు రాసే వాళ్లపై కోర్టుకెళతానని సినీ నటి, యాంకర్‌ అనసూయ మండిపడ్డారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి

Published : 13 Oct 2021 02:10 IST

హైదరాబాద్‌: తనను సంప్రదించకుండా తనపై తప్పుడు వార్తలు రాసే వాళ్లపై కోర్టుకెళతానని సినీ నటి, యాంకర్‌ అనసూయ మండిపడ్డారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలుత ఆమె విజయం సాధించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు మరుసటి రోజుకు వాయిదా వేయడంతో ఆమె ఫలితంపై సందిగ్ధత నెలకొంది. మరుసటి రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో అనసూయ ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీనిపై అనసూయ కూడా వ్యంగ్యంగా ట్వీట్‌ పెట్టారు. మంగళవారం ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌నుంచి విజయం సాధించిన  సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రెస్‌మీట్‌ కు వచ్చిన అనసూయ విలేకరులతో మాట్లాడారు. యూట్యూబ్‌ ఛానళ్లు ఇష్టమొచ్చినట్లు రాస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి జీవితాన్ని వారు జీవించనివ్వాలని హితవు పలికారు.

‘‘నేను మెజార్టీలో ఉన్నానని కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. నేను మీడియాలో ఉంటే న్యూస్‌ రిపోర్ట్‌ చేయడాన్ని ఎంచుకుంటాను. క్రియేట్‌ చేయను. గాలి వార్తలు చెప్పను. కచ్చితంగా ఎన్నికల అధికారులు ప్రకటిస్తేనే చెబుతాను. ఓట్ల లెక్కింపు దగ్గర ఎవరో ఇచ్చిన సమాచారాన్ని నేను నమ్మను. ‘మా’ ఎన్నికల్లో గెలిచి ఉంటే, మరింత సర్వీస్‌ చేసేదాన్ని. ఇప్పుడు కూడా సమయం ఉంటే తప్పకుండా చేస్తా. గెలుపోటములు పట్టించుకోను. వరుస షూటింగ్‌ల కారణంగా గత 40 రోజులుగా సరిగా ఇంటికి వెళ్లలేకపోయాను. పని నుంచి నేరుగా వచ్చి ఓటేశాను. ఆ తర్వాత అక్కడే ఉన్నాను. ప్రెసిడెంట్‌ ఓట్ల లెక్కింపు మొదలు పెట్టకుండానే ఫలితాలను మీడియా ప్రకటించింది. నేను చాలా ధైర్యవంతురాలిని. ఓడిపోయానని ఎదుటవాళ్లు చెబితే ఒప్పుకొనే దాన్ని కాదు. నా గురించి తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకు వెళ్తా’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని