Aadi SaiKumar: ఇకపై మనసుకు నచ్చిన కథలతోనే..

‘‘యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చే చిత్రం మా ‘అతిథి దేవో భవ’’ అన్నారు యువ కథానాయకుడు ఆది సాయికుమార్‌. ఆయన నటించిన ఈ సినిమాని పొలిమేర నాగేశ్వర్‌ తెరకెక్కించారు. రాజాబాబు మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల నిర్మించారు. నువేక్ష కథానాయిక. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది

Published : 06 Jan 2022 16:57 IST

‘‘యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చే చిత్రం మా ‘అతిథి దేవో భవ’’ అన్నారు యువ కథానాయకుడు ఆది సాయికుమార్‌. ఆయన నటించిన ఈ సినిమాని పొలిమేర నాగేశ్వర్‌ తెరకెక్కించారు. రాజాబాబు మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల నిర్మించారు. నువేక్ష కథానాయిక. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు ఆది.

తొలిసారి సంక్రాంతి బరిలో నిలిచారు? ఎలా ఉంది?
‘‘చాలా ఆనందంగా ఉంది. నిజానికి మేము డిసెంబర్‌లో వద్దామనుకుని కాపీ రెడీ చేసి పెట్టుకున్నాం. కానీ, సరైన తేదీ దొరకలేదు. తర్వాత జనవరి నెలాఖరున తీసుకొద్దామనుకున్నాం. ఈలోపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా వేసినట్లు ప్రకటించారు. దీంతో మా నిర్మాతలు అప్పటికప్పుడు మాట్లాడుకుని జనవరి 7న విడుదల చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం నాకూ షాకింగ్‌గానే అనిపించింది. ఏదేమైనా త్వరితగతిన నిర్ణయం తీసుకుని మంచి తేదీకి సినిమాని తీసుకొస్తున్నందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు’’.

ఈ చిత్ర కథేంటి? మీ పాత్ర ఎలా ఉంటుంది?
‘‘ఓ విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఒక రోజులో జరిగే కథగా సాగుతుంది. ఇందులో హీరోకి ఓ ఫోబియా ఉంటుంది. ఒంటరిగా ఉండటమంటే భయం. అందుకే ఏ అతిథి వచ్చినా.. వాళ్లని అతిథి దేవో భవ అన్నట్లు చూసుకుంటుంటాడు. అయితే హీరో తన ఫోబియా వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది తెరపై చూడాలి. అందరూ అనుకున్నట్లు ఇది హారర్‌ చిత్రం కాదు. మంచి కుటుంబ కథాంశం ఉంది. ముఖ్యంగా తల్లి సెంటిమెంట్‌ మనసుల్ని కదిలిస్తుంది. అలాగే సప్తగిరి కామెడీ ట్రాక్‌ కడుపుబ్బా నవ్విస్తుంది’’.

ఈ పాత్ర పరంగా మీకు సవాల్‌గా అనిపించిన అంశాలేంటి?
‘‘సవాల్‌ అని కాదు కానీ.. నటుడిగా నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేను గతంలో లవ్‌, ఎనర్జిటిక్‌, ఎమోషనల్‌.. ఇలా రకరకాల పాత్రలు చేశా. ఒకే ఎమోషన్‌తో ఇంత సెటిల్డ్‌గా సాగే పాత్రెప్పుడూ చేయలేదు. అందుకే నాకీ క్యారెక్టరైజేషన్‌ కొత్తగా అనిపించింది. దర్శకుడు ఈ పాత్రను తెరపై చూపించిన విధానం కూడా చాలా కొత్తగా ఉంటుంది. శేఖర్‌ చంద్ర సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’.

ప్రస్తుతం చేస్తున్న కొత్త చిత్రాల విశేషాలేంటి?
‘‘కల్యాణ్‌ జి గోగణ దర్శకత్వంలో చేస్తున్న ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. ‘బ్లాక్‌’ అనే థ్రిల్లర్‌ చిత్రం పూర్తి చేశా. ‘అమర్‌ ఇన్‌ ద సిటీ: ఛాప్టర్‌ 1’ అనే సినిమా చేస్తున్నా. గ్రాఫిక్స్‌కు చాలా ప్రాధాన్యమున్న చిత్రమిది. ఓ సిరీస్‌లా ఉంటుంది. ‘సి.ఎస్‌.ఐ. సనాతన్‌’ అనే చిత్రం చేస్తున్నా. మరో పది రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుంది. వచ్చే నెలలో ‘ఫన్నీ కృష్ణ’ అనే ఓ కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభమవుతుంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ‘జంగిల్‌’ అనే ద్విభాషా చిత్రం చేస్తున్నా. ఈ సినిమాలన్నీ వేటికవే విభిన్నంగా.. కొత్తగా ఉంటాయి. మంచి కథ దొరికితే వెబ్‌సిరీస్‌లు చేయడానికైనా సిద్ధమే’’.

ఇటీవల కాలంలో మీ చిత్రాలన్నీ బాగా నిరాశపరిచాయి కదా. కారణమేంటన్నది విశ్లేషించుకున్నారా?
‘‘ఈ ఫలితాలన్నింటి వెనకా రకరకాల కారణాలున్నాయి. కొన్నిసార్లు కథ బాగున్నా.. దాన్ని తెరకెక్కించడంలో పొరపాటు జరుగుతుంటుంది. ఇంకొన్ని సార్లు విడుదల తేదీలూ తేడా కొడుతుంటాయి. ఈ మధ్య కాలంలో నా నుంచి వచ్చిన కొన్ని చిత్రాలకు రిలీజ్‌ డేట్లు కలిసిరాలేదు. నా గత చిత్రాల్లో ‘చుట్టాలబ్బాయి’, ‘రఫ్‌’ లాంటివి మిశ్రమ స్పందన దక్కించుకున్నా..కమర్షియల్‌గా బలంగా నిలబడ్డాయి. ఈ సినిమాల విషయంలో రిలీజ్‌ డేట్లు నాకు బాగా కలిసొచ్చాయి. ప్రస్తుతం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా. ఇకపై మనసుకు నచ్చిన కథలతోనే ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నా’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని