Ayushmann Khurrana: ఆ పాత్ర వల్ల 80శాతం చూపు కోల్పోయా!

అంధాధున్‌ మూడేళ్ల పూర్తిచేసుకున్న సందర్భంగా నటుడు ఆయుష్మాన్‌ ఖురానా చెప్పిన విషయాలు ఇవిగో

Published : 06 Oct 2021 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఆ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా మూడేళ్లు. సినిమా ప్రపంచంలో.. థ్రిల్లర్‌ జానర్‌లో అంతకు ముందు.. ఆ తరువాత అనే రీతిలో చెప్పుకునేలా చేసింది ఈ కథ. అదే ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా.. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంధాధున్‌’’. మూసపద్ధతిలో తీసే చిత్రాలకు చెక్‌పెడుతూ.. ఓ సినిమా అంటే నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, విలన్‌, హీరో, హీరోయిన్‌.. ఇదే కాదు.. ఇంకేదో ఉంది అని అనుకునేవారందరికీ దీంతో జవాబు దొరికేలా చేసింది.  కథలో వైవిధ్యం, ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లే, పాత్రలో ఒదిగిపోయిన నటులు.. ఇవే ఆ చిత్రానికి జీవం పోశాయి. ఇప్పటికీ గుర్తించుకునేలా చేశాయి.ఈ చిత్రంతో ఆయుష్మాన్‌ కెరీర్‌ గ్రాఫ్‌ అమాంతం దూసుకుపోయింది. ఇందులో ఆకాశ్‌ అనే పియానో ప్లేయర్‌గా చూపుకోల్పోయిన వ్యక్తిగా నటించారాయన.  మరి ఓ అంధుడిగా కనిపించేందుకు.. అందులో ఒదిగి పోయి నటించేందుకు.. చేసిన కసరత్తుల గురించి ఏమని చెప్పారంటే..


ఐ మాస్క్‌ ధరించి పనులు చేసేవాడిని: ఆయుష్మాన్‌ ఖురానా

సవాళ్లతో ఉన్న పాత్రల్లో మెప్పించాలంటే.. ఆ పాత్రలో ఒదగకతప్పదు. అందుకే ఒక్కోసారి ఎంత రిస్క్‌ అయినా సరే సాహసం చేయకతప్పదు. అలాంటి కథలో నటించాలనేదే నా తపన నాలో ఉండేది.  అలా ఎదురుచూస్తున్నప్పుడు అనుకోకుండా ఓ రోజు దర్శకుడు శ్రీరామ్‌ రాఘవ ఈ స్ర్కిప్ట్‌ చెప్పేందుకు నా దగ్గరకు వచ్చారు. ఇందులో అంధుడైన పియానిస్ట్‌గా నటించాలన్నారు. అందుకే చూపుకోల్పోయిన పియానిస్ట్‌ దగ్గర ట్రైనింగ్‌ తీసుకున్నా. నెలల పాటు గంటల కొద్ది పియానో వాయించడం అప్పట్లో నా దినచర్యలో భాగమైంది. అంతేకాదు.. ఐ మాస్క్‌ ధరించి నారోజూ వారీ పనులు చేసేవాడిని.. ఇదంతా బాడీ లాంగ్వేజ్‌ అర్థం చేసుకునేందుకు సాయపడింది.


లండన్ నుంచి రూ.6లక్షలు విలువైన లెన్స్‌ తెప్పించారు..

అంధాధున్‌లో ఆయుష్మాన్‌ ఖురానాకు మేకప్‌, ప్రొస్థెటిక్ డిజైనర్‌గా పనిచేసిన ప్రీతీ షీల్‌ సింగ్‌ మరో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘ మిగిలిన చిత్రాల్లో వినియోగించేంత భారీ ప్రొస్థెటిక్‌ ఏమీ ఇందులో వాడలేదు. కాకపోతే ఆయుష్మాన్‌ బ్లైండ్‌ లుక్‌ కోసం స్పెషల్‌ లెన్స్‌ని తెప్పించాము. ఆ పాత్రలో సహజంగా కనిపించేందుకు ప్రత్యేకించి తయారు చేయించాం. అయితే ఇవి మార్కెట్‌లో దొరికే సాధారణ లెన్స్‌ కావు. వీటని  ‘సెక్లెరల్ లెన్స్’ అంటారు. రెండు కళ్లకు వాడే ఈ లెన్స్‌ ధర రూ.6లక్షలు ఉంటుంది. ఇది మీ కళ్లు.. కనిపించే భాగాన్ని కవర్ చేస్తుంది. తద్వారా చూపు అంతా మసకబారిపోతుంది. ఈ సమస్యలు ఉంటాయని తెలిసినా సరే..  ఆయుష్మాన్‌ ఒప్పుకుని మాకు బాగా సహకరించేవాడు.  ఇక సెక్లెరల్ లెన్స్ ధరించాక ఆయుష్మాన్‌ 80శాతం చూపు కోల్పోవాల్సి వచ్చింది. దీనికి తోడు బ్లాక్‌ గ్లాసెస్‌ ధరించడంతో 90శాతం ఆయన చూపు దెబ్బతింది. అలానే సినిమా షూట్‌ మొత్తం పూర్తి  చేశాం. 


మరిన్ని ఆసక్తికర విషయాలు 

* 2018 అక్టోబర్5న విడుదలైన ఈచిత్రం  రూ. 32 కోట్ల బడ్జెట్‌తో రూపొంది.. ప్రపంచ వ్యాప్తంగా రూ.456 కోట్ల వసూళ్లు సాధించింది. కంటెంట్‌ ఉంటే చాలు చిన్నచిత్రాలూ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తాయనే నమ్మకాన్ని ఇచ్చింది

అంధాధున్‌ చిత్రంతో చక్కటి అభినయం ప్రదర్శించినందుకు గానూ ఆయుష్మాన్‌కు  జాతీయ ఉత్తమనటుడు పురస్కారంతో పాటు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్ (క్రిటిక్‌) సైతం వరించింది.  


తెలుగులో మాస్ట్రో

* విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం వేరే భాషల్లోనూ రీమేక్‌ చేశారు కూడా.  ఈఏడాది సెప్టెంబర్‌ 17న.. తెలుగులో నితిన్‌ హీరోగా ‘మాస్ర్టో’గా డిస్నీ హాట్‌స్టార్‌ ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది.


మలయాళంలో ‘భ్రమమ్‌’

ఈనెల అక్టోబర్‌ 7న ‘భ్రమమ్‌’ పేరుతో మలయాళంలో థియేటర్లలోనూ, అమెజాన్‌ ఓటీటీలోనూ ఒకే రోజు సందడి చేయనుంది. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌  ఇందులో హీరోగా నటించగా.. సినిమాట్రోగ్రాఫర్‌, దర్శకుడు రవి.కె.చంద్రన్‌ దీనికి దర్శకత్వం వహించారు.


తమిళంలో అంధాగన్‌

* తమిళంలో అంధాగన్‌గా షూటింగ్‌ పూర్తైనప్పటికీ.. పరిస్థితుల కారణంగా సినిమా వాయిదా పడుతోంది. ఇక హిందీలో టబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా, తమిళంలో సిమ్రన్‌, మలయాళంలో మమతామోహన్‌దాస్‌ పోషించారు. అంధాధున్‌లో రాధిక ఆప్టే నటించిన పాత్రను తెలుగులో నభా నటేష్‌, తమిళంలో ప్రియా ఆనంద్‌, మలయాళంలో రాశీ ఖన్నా నటించారు.


 




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని