Balakrishna: నా మాటలను వక్రీకరించారు.. నర్సులపై వ్యాఖ్యల వివాదంలో బాలకృష్ణ క్లారిటీ

బాలకృష్ణ (Balakrishna) నర్సులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఆయన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

Updated : 06 Feb 2023 16:12 IST

హైదరాబాద్‌: నర్సుల వివాదంపై సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) క్లారిటీ ఇచ్చారు. నర్సులంటే తనకెంతో గౌరవం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అధికారిక సోషల్‌మీడియాలో నర్సుల వివాదంపై స్పందిస్తూ సుదీర్ఘ నోట్‌ పోస్ట్‌ చేశారు. ‘‘అందరికీ నమస్కారం, నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి వారి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను’’ అని అన్నారు.

ఇటీవల ఓ ప్రముఖ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తనకు జరిగిన బైక్‌ యాక్సిడెంట్‌ విషయాన్ని ప్రస్తావించే సందర్భంలో తనకు వైద్యం చేసిన నర్సు గురించి ఆయన మాట్లాడారు. ఆ మాటలపై నర్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, నర్సులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని