Bhagyashree: ‘సల్మాన్‌తో మీ భార్యకు ఉన్న రిలేషన్‌ ఏంటి..?’ అని నా భర్తను ప్రశ్నించారు: భాగ్యశ్రీ

‘మైనే ప్యార్‌ కియా’ సినిమా తనకు సక్సెస్‌తోపాటు కొన్ని ఇబ్బందులు కూడా తీసుకువచ్చిందని నటి భాగ్యశ్రీ  (Bhagyashree) తెలిపారు. ఆ సినిమా వల్ల తనకు ఎదురైన ఓ చేదు సంఘటనను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.

Updated : 15 May 2023 16:31 IST

ముంబయి: ‘మైనే ప్యార్‌ కియా’ (Maine Pyar Kiya)తో సెన్సేషనల్‌ హిట్‌ అందుకున్నారు నటి భాగ్యశ్రీ (Bhagyashree). ఆ సినిమాతో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) - భాగ్యశ్రీ జంట పేరు దేశవ్యాప్తంగా సూపర్‌ క్రేజ్‌ అందుకుంది. రొమాంటిక్‌, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వల్ల భాగ్యశ్రీ వ్యక్తిగత జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సినిమా విడుదలైనప్పుడు సల్మాన్‌తో ఆమె రిలేషన్‌లో ఉందని బీటౌన్‌లో మాట్లాడుకున్నారు. పలు పత్రికల్లోనూ వీరిద్దరి గురించి వార్తలు వచ్చాయి. ఈవిషయంపై ఆమె తాజాగా స్పందించారు. ఓ విలేకరి తన భర్తను సైతం దీని గురించి ప్రశ్నించారని చెప్పారు.

‘‘అభిమన్యు (భాగ్యశ్రీ కుమారుడు) పుట్టిన తర్వాత రోజు నన్ను కలవడానికి ఒక మహిళా రిపోర్టర్‌ వచ్చారు. నన్ను కలిసి విషెస్‌ చెప్పి అక్కడే ఉన్న నా భర్త చూసి.. ‘‘సల్మాన్‌ఖాన్‌తో మీ భార్య రిలేషన్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం ఏంటి?’’ అని అడిగింది. ఆ క్షణం నేను షాకయ్యాను. నా జీవితంలో అలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదు. అప్పటి నుంచి ఇంట్లో ఫిల్మ్‌ మ్యాగజైన్స్‌ను బ్యాన్‌ చేశాను. అలాగే నేను ఫిల్మ్‌ మ్యాగజైన్స్‌ చదవడం మానేశా. సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అని ఆమె వివరించారు. అంతేకాకుండా.. సల్మాన్‌ ఎంతో మంచి వ్యక్తి అని, అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘మైనే ప్యార్‌ కియా’ రిలీజైన కొంతకాలానికే తన స్నేహితుడు హిమాలయ దాసానిని వివాహం చేసుకున్నారు.

ఇక, సినిమాల విషయానికి వస్తే, వివాహం తర్వాత కూడా భాగ్యశ్రీ అడపాదడపా సినిమాలు చేశారు. గతేడాది విడుదలైన ‘రాధేశ్యామ్‌’తో ఆమె తెలుగు తెరపై సందడి చేశారు. ఇందులో ఆమె ప్రభాస్‌కు తల్లిగా కనిపించారు. ఇటీవల విడుదలైన ‘ఛత్రపతి’ (హిందీ వెర్షన్‌)లోనూ హీరో తల్లి పాత్రలో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని