Bigg boss 5: టాప్‌-5లో ఎవరో వీళ్లు చెప్పేశారు! వేదికపై శ్రీహాన్‌, దీప్తి సునయన సందడి

బిగ్‌బాస్‌ (Bigg boss telugu 5) ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌ల కుటుంబ సభ్యులు వచ్చి ఈ వారం సందడి చేసిన సంగతి తెలిసిందే.

Updated : 28 Nov 2021 07:24 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ (Bigg boss telugu 5) ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌ల కుటుంబ సభ్యులు వచ్చి ఈ వారం సందడి చేసిన సంగతి తెలిసిందే. శనివారం నాగార్జున  హౌస్‌మేట్స్‌కు  సంబంధించిన మరికొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులను వేదికపైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ‘బంధానికి ఒక త్యాగం’ అనే టాస్క్‌ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇంకొందరు ఇంటి సభ్యులు/స్నేహితులను కలవాలంటే  తమకు ఇష్టమైన వస్తువును త్యాగం చేయాలని నాగార్జున సూచించారు. దీంతో రవి తనతో పాటు తెచ్చుకున్న బొమ్మను ఇచ్చేశాడు. దీంతో రవి అమ్మ బిగ్‌బాస్‌ వేదికపైకి వచ్చి మాట్లాడారు. ‘రవి నువ్వు బిగ్‌బాస్‌ కా రాజా. ప్రతి వారం నువ్వు ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నావు. నీకు వచ్చిన నిక్‌ నేమ్స్‌ను బద్దలు కొడుతున్నావు. ఆల్‌ ది బెస్ట్‌’ అని అన్నారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ సీజన్‌-1 విజేత శివ బాలాజీ కూడా వచ్చి కాసేపు మాట్లాడారు. ‘రవి చాలా మంచి వ్యక్తి. ఎన్ని వచ్చినా తీసుకున్నావు. ఎవరికీ సపోర్ట్‌గా మాట్లాడకు. నీ పాయింట్‌ మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపో. మిగిలినది జనాలు, మద్దతుదారులు చూసుకుంటారు’ అని అన్నారు. ఇక టాప్‌-5లో ఎవరుంటారు అని అడగ్గా రవి తల్లి అతడిని మొదటి స్థానంలో నిలిపారు. రెండులో సన్నీ, మూడులో శ్రీరామ్‌, నాలుగులో షణ్ముఖ్‌, ఐదులో మానస్‌ ఫొటోలను ఉంచారు.

ప్రియాంక తన మేకప్‌కిట్‌ను త్యాగం చేయగా, ‘జబర్దస్త్‌’ అప్పారావు, సాయి వచ్చారు. హౌస్‌మేట్స్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రియాంక, సన్నీ, శ్రీరామ్‌, రవి, మానస్‌లకు మొదటి ఐదు స్థానాలు ఇచ్చారు. తెలుగులో తనకు అవకాశం ఇచ్చిన వ్యక్తి అప్పారావు అని ఆయన వల్లే మంచి గుర్తింపు తెచ్చుకున్నానని ప్రియాంక భావోద్వేగానికి గురైంది.

సన్నీ తన స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్‌ను త్యాగం చేయగా, వెంకట్‌, నిఖిల్‌ వచ్చి మాట్లాడానికి వచ్చారు. చాలా బాగా ఆడుతున్నావని ప్రశంసించారు. సన్నీ, షణ్ముఖ్‌, మానస్‌, శ్రీరామ్‌, కాజల్‌ టాప్‌-5లో ఉంటారని చెప్పారు. సన్నీ ఇంకా బాగా గేమ్‌ ఆడాలని, నాగార్జున చెప్పేది కూడా వినాలని సూచించారు. షణ్ముఖ్‌, శ్రీరామ్‌లపై పంచ్‌లు వేశారు. ఈ సందర్భంగా ఎలిమినేషన్‌ నుంచి సన్నీ సేఫ్‌ అయ్యాడు.

సిరి తన బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌ ఇచ్చిన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేసింది. దీంతో వేదికపైకి శ్రీహాన్‌ వచ్చాడు. అతడిని చూసి సిరి భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైంది. ‘షో చూస్తున్నా. ఏంటి వదిలేస్తున్నావా’ అని శ్రీహాన్‌ అడగ్గా, సిరి గుంజీళ్లు తీసింది. ‘నువ్వు ఫీల్‌ అవడానికి ఏమీ లేదు. ఎక్కువగా ఆలోచించకు. గేమ్‌ బాగా ఆడు’ అని శ్రీహాన్‌ అన్నాడు. ‘సిరి.. శ్రీహాన్‌ను ఎప్పుడు కలిశావు’ అని నాగార్జున అడగ్గా ‘తను షార్ట్‌ ఫిల్మ్‌ రిలీజ్‌ చేసినప్పుడు గెస్ట్‌గా వెళ్లా’ అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ షోకు తాను గెస్ట్‌ వచ్చానని శ్రీహాన్‌ చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. ఇక టాప్‌-5లో సన్నీ, షణ్ముఖ్‌, రవి, శ్రీరామ్‌, సిరి ఫొటోలను శ్రీహాన్‌ ఉంచాడు. ఈ సందర్భంగా సిరి కోసం శ్రీహాన్‌ పాట పాడాడు. అనంతరం సిరి సేఫ్‌ అంటూ శ్రీహాన్‌ ప్రకటించాడు.

మానస్‌ తనకు ఎంతో ఇష్టమైన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేయగా, అతడి తండ్రి వెంకట్రావు, స్నేహితుడు అమర్‌దీప్‌లు వేదికపైకి వచ్చి మాట్లాడారు. ఇంకా బాగా ఆడాలని మానస్‌కు సూచించారు. సన్నీ, కాజల్‌, మానస్‌ ఫ్రెండ్‌షిప్‌ గురించి మాట్లాడుతూ.. ఈ బిగ్‌బాస్‌లో అన్ని ఎపిసోడ్‌లలో వీరి సన్నివేశాలను కట్‌ చేస్తే ఫ్రెండ్‌షిప్‌పై మంచి సినిమా అవుతుందని అన్నారు. ఇక టాప్‌-5లో మానస్‌, సన్నీ, కాజల్‌, శ్రీరామ్‌, షణ్ముఖ్‌లను ఉంచారు. కాజల్‌ తనకు ఇష్టమైన బొమ్మను త్యాగం చేయగా, ఆమె సోదరి జరీన్‌, లిప్సికలు విచ్చేశారు. హౌస్‌మేట్స్‌తో మాట్లాడారు. టాప్‌-5లో కాజల్‌, సన్నీ, షణ్ముఖ్‌, శ్రీరామ్‌, మానస్‌ ఫొటోలను ఉంచారు.

ఇక శ్రీరామ్‌ హమీద ఇచ్చిన బ్రోష్‌ను త్యాగం చేశాడు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర తల్లి జయలక్ష్మి, స్నేహితురాలు సౌమ్య వచ్చారు. శ్రీరామ్‌ పేరు పిలిచి 80 రోజులు అయిందని అతడి తల్లి భావోద్వేగానికి గురయ్యారు. టాప్‌-5లో శ్రీరామ్‌, రవి, ప్రియాంక, సన్నీ, షణ్ముఖ్‌లను ఉంచారు. ఈ సందర్భంగా శ్రీరామ్‌ సేఫ్‌ అవుతున్నట్లు ప్రకటించారు. 

చివరిగా షణ్ముఖ్‌ వంతు రాగా దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్‌ త్యాగం చేశాడు. ఈ సందర్భంగా షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌, గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన వచ్చారు. ఎమోషనల్‌గా వీక్‌ అయిపోతున్నావని, బాగా ఆడాలని షణ్ముఖ్‌కు దీప్తి చెప్పింది.టాప్‌-5లో షణ్ముఖ్‌, శ్రీరామ్‌, సన్నీ, రవి, మానస్‌లు ఉంటారని చెప్పింది. ఈ సందర్భంగా దీప్తి, షణ్ముఖ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దీప్తిని తొలిసారి ఒక మాల్‌లో కలిసినట్లు షణ్ను చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని