Bigg boss telugu 5: టికెట్‌ టు ఫినాలే విజేత శ్రీరామ్‌.. టాప్‌-5లోకి..

బిగ్‌బాస్‌ సీజన్‌-5(Bigg boss telugu 5)లో టికెట్‌ టు ఫినాలే రసవత్తరంగా సాగింది.

Updated : 04 Dec 2021 06:50 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-5(Bigg boss telugu 5)లో టికెట్‌ టు ఫినాలే రసవత్తరంగా సాగింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో నలుగురు హౌస్‌మేట్స్‌కు ఆసక్తికర టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. టాస్క్‌లో భాగంగా కొన్ని సౌండ్స్‌ వినిపిస్తాయి. వాటిని గుర్తుంచుకుని ఒక వరుస క్రమంలో రాయాలి. బిగ్‌బాస్‌ అడిగిన వెంటనే చూపించాలి. ఈ టాస్క్‌ మధ్యలో కాజల్‌ హింట్స్‌ ఇవ్వడంపై సన్నీ, శ్రీరామ్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘టాస్క్‌ పేరు ఫోకస్‌. మీరు దానిపై దృష్టి సారించాలి. నేను అరుస్తూనే ఉంటా’ అని కాజల్‌ చెప్పుకొచ్చింది. ఇక గురక సౌండ్‌కు టైగర్‌ అని, హెలికాప్టర్‌ సౌండ్‌కు ట్రాక్టర్ అని సిరి రాయడం నవ్వులు పూయించింది. ఈ టాస్క్‌లో సన్నీ, మానస్‌లు  గెలుపొందారు. సీజన్‌ అయిపోయిన తర్వాత హౌస్‌మేట్స్‌ అందరూ కలిసి సిరికి ట్రాక్టర్‌ కొనిపెడతామని షణ్ముఖ్‌ పంచ్‌లు వేశాడు. మరోవైపు టాస్క్‌లో హింట్స్‌ ఇచ్చి విసిగించిన కాజల్‌తో సన్నీ వాగ్వాదానికి దిగాడు. మానస్‌ కలగజేసుకుని వారిద్దరికీ సర్ది చెప్పేప్రయత్నం చేశాడు. అయినా కూడా వారిద్దరూ చాలా సేపు వాదించుకున్నారు. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లోకి వెళ్లి కాజల్‌ బాధపడటంతో మానస్‌ ఆమెను ఓదార్చి గార్డెన్‌ ఏరియాలోకి తీసుకొచ్చాడు.

ఇక తర్వాతి టాస్క్‌లో భాగంగా లైట్స్‌ ఆఫ్‌-ఆన్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో తొలి రౌండ్‌లో సిరి, సన్నీలు పోటీగా, సిరి గాయపడటంతో ఆమె తరపున షణ్ముఖ్ ఆడాడు. ఆ తర్వాత శ్రీరామ్‌, మానస్‌లు పోటీగా, శ్రీరామ్‌ తరపున మళ్లీ షణ్ముఖ్‌ ఆడాడు. అతి తక్కువ సమయంలో అన్నీ లైట్స్‌ వేసిన శ్రీరామ్‌, మానస్‌లు గెలుపొందినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. టాస్క్‌ అయిపోయిన తర్వాత శ్రీరామ్‌ భోజనం చేస్తుండగా ‘పంచదార నీళ్లు కలిపిస్తా. అరటిపండు ఇస్తా’ అంటూ ప్రియాంక చెప్పడంతో ‘సొంత వైద్యం చేయొద్దు’ అంటూ బిగ్‌బాస్‌ హెచ్చరించాడు. అందరి ముందూ చెప్పిన బిగ్‌బాస్‌ తన పరువు తీశాడని పింకీ చిన్నబోయింది.

చివరిగా టికెటు ఫినాలే 5వ రౌండ్‌లో మానస్‌, శ్రీరామ్‌లు చివరి పోటీదారులుగా నిలిచారు. పోటీదారుల కోసం ఫిల్లర్‌ ఫ్రేమ్‌ ఏర్పాటు చేశారు. నాలుగు స్థాయిల్లో బోర్డులను ఉంచారు. రోప్‌నకు ఉన్న వెయిట్‌ బ్యాగ్‌ సాయంతో బోర్డును బద్దలు కొట్టాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగా నాలుగు బోర్డులను బద్దలు కొట్టి వెయిట్‌ బ్యాగ్‌ను ఫ్రేమ్‌ చివరకు చేరుస్తారో వారు విజయం సాధించినట్లు అని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన  టాస్క్‌లో అన్నీ బోర్డులు బద్దలు కొట్టి బిగ్‌బాస్‌ సీజన్‌-5 టికెట్‌ టు ఫినాలే శ్రీరామ చంద్ర గెలుచుకున్నాడు. అంతేకాదు, ఈ సీజన్‌ టాప్‌-5లో నిలిచిన తొలి కంటెస్టెంట్‌ అయ్యాడు. మరోవైపు చివరి టాస్క్‌లో ఓడిపోయిన మానస్‌ను సన్నీ ఓదార్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని