Bollywood Stars: దీపిక అప్పుడు ఛాన్స్‌ మిస్సైంది.. ఇన్నాళ్లకు జాన్వీ కల నెరవేరింది

తెలుగు సినిమాల్లో తొలిసారిగా నటిస్తోన్న బాలీవుడ్‌ నటుల వివరాలివి. ఎవరెవరు.. ఏయే చిత్రాల్లో కనిపించనున్నారంటే?

Published : 20 Apr 2023 10:18 IST

టాలీవుడ్‌లోకి ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సిన దీపికా పదుకొణె (Deepika Padukone) ఎట్టకేలకు ఓ భారీ ‘ప్రాజెక్టు’తో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పబోతోంది. ప్రముఖ హీరో ఎన్టీఆర్‌తో కలిసి తెలుగు సినిమాలో నటించాలనే జాన్వీ కపూర్‌ కల నెరవేరింది. వీరిద్దరే కాదు.. తమ ప్రతిభను తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు పలువురు బాలీవుడ్‌ స్టార్లు రాబోతున్నారు. వారెవరు? ఆ సినిమాలేంటో చూద్దామా..

ప్రత్యేక గీతంలో నటించింది.. కానీ

ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెరకెక్కిస్తున్న సినిమా.. ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌). సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా (Project K)లో కథానాయికగా దీపికా పదుకొణె ఎంపికైన సంగతి తెలిసిందే. దానికంటే ముందే ఆమె ఓ తెలుగు చిత్రంలో భాగస్వామి అయిందిగానీ ఫలితం లేకపోయింది. దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ కొన్నాళ్ల క్రితం ‘లవ్‌ 4 ఎవర్‌’ సినిమా తీశారు. అందులోని ప్రత్యేక గీతంలో దీపిక నటించింది. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. అప్పుడు మిస్సైన అవకాశాన్ని ఇప్పుడు ప్లస్‌ చేసుకుంటుందామె. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘ప్రాజెక్ట్‌ కె’.. ప్రకటన వెలువడిన క్షణం నుంచే యావత్‌ సినీ అభిమానుల్లో అమితాసక్తి పెంచింది. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), దిశా పటానీ (Disha Patani) కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరు గతంలోనే తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

అభిమాన హీరో సరసన..

టాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌ (NTR) అంటే తనకెంతో ఇష్టమని.. ఎన్నో సందర్భాల్లో చెప్పిన జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఇన్నాళ్లకు ఆయన సరసన నటించే అవకాశం అందుకుంది. #NTR30 (వర్కింగ్‌ టైటిల్‌)తో ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తోన్న చిత్రమది. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌తో రూపొందుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హాలీవుడ్‌కు చెందిన పలువురు సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌ 5న సినిమాని విడుదల చేయనున్నట్టు దర్శక, నిర్మాతలు ప్రకటించారు.

రెండు సినిమాలతో సైఫ్‌

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఇతిహాస చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ సినిమాలోని లంకేశ్‌ పాత్రలో నటించి, తెలుగు వారికి చేరువకానున్నారు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan). ఇప్పటికే విడుదలకావాల్సిన ఆ చిత్రం వాయిదా పడింది. జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ముందు జూన్‌ 13న.. ప్రతిష్ఠాత్మక ‘ట్రిబెకా ఫెస్టివల్‌’లో ప్రదర్శితం కానుంది. మరోవైపు, #NTR30లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు సైఫ్‌. రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుగుతోన్న ఆ సినిమా సెట్స్‌లో ఆయన మంగళవారం అడుగుపెట్టారు. ఎలాంటి పాత్రలో ఆయన కనిపించనున్నారనే దానిపై స్పష్టతలేదు.

పవన్‌ చిత్రంలో ఇద్దరు

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా చరిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్‌ దర్శకుడు. ఈ సినిమాతో ఇద్దరు బాలీవుడ్‌ నటులు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. వారెవరో కాదు బాబీ దేవోల్‌ (Bobby Deol), నర్గిస్‌ ఫక్రి (Nargis Fakhri). మొఘల్‌ సామ్రాజ్య కాలం 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఆ కథలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ నటించింది. ఔరంగజేబు పాత్రలో బాబీ దేవోల్‌, రోషనారా పాత్రలో నర్గిస్‌ కనిపించనున్నారు. ఈమె ప్రత్యేక గీతంలోనూ కనిపిస్తుందని సమాచారం. ఈ పాన్‌ ఇండియా చిత్రం త్వరలో విడుదల కానుంది.

2017 మిస్‌ యూనివర్స్‌ ఇలా..

‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన 2017 మిస్‌ యూనివర్స్‌.. మానుషి చిల్లర్‌ (Manushi Chhillar). ప్రస్తుతం పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె తెలుగు నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. #VT13 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోన్న ఆ సినిమాతో శక్తి ప్రతాప్‌సింగ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా.. దేశభక్తి ప్రధానంగా సాగే కథ అది.

ఇప్పటికే చాలామంది హిందీ తారలు తెలుగు చిత్రాల్లో నటించి, మెప్పించారు. కంగనా రనౌత్‌, సునీల్‌శెట్టి, కత్రినా కైఫ్‌, దియా మీర్జా, మనోజ్‌ బాజ్‌పాయ్‌, జాకీష్రాఫ్‌, అజయ్‌దేవ్‌గణ్‌, అలియాభట్‌, సల్మాన్‌ఖాన్‌, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. మలైకా అరోడా, ఊర్వశీ రౌతేలా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు ప్రత్యేక గీతాలతో ఆకట్టుకున్నారు. ‘పాన్‌ ఇండియా’ ప్రభావంతో ప్రస్తుతం.. టాలీవుడ్‌లో బాలీవుడ్‌ నటుల తాకిడి పెరిగింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని