కష్ట కాలంలో మేమున్నాం అంటూ...
కరోనా ఉద్ధృతి రోజు రోజుకూ తీవ్రతరం అవుతుంది. ఆసుపత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్ లభించక కరోనా బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికి వీలైనంతలో వాళ్లు ముందుకొచ్చి సాయం...
కరోనా ఉద్ధృతి రోజురోజుకూ తీవ్రతరం అవుతుంది. ఆసుపత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్ లభించక కరోనా బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికి వీలైనంతలో వాళ్లు ముందుకొచ్చి సాయం అందిస్తున్నారు. ప్రజలకు ఆపద ఎప్పుడు ఎదురైనా ముందుండే బాలీవుడ్ సినీ తారలు తమవంతు సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కొవిడ్ బాధితులకు వెంటిలేటర్లు, పడకలను అందించడానికి ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వారికి నిధులను సమకూర్చారు ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్. భారత్ స్కౌట్స్, గైడ్ హాల్స్ను ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ ఆసుపత్రిగా మారుస్తుంది. ఈ ఆసుపత్రికి కావాల్సిన సామాగ్రిని అందించడానికి అజయ్ దేవగణ్ తన ఎన్వై ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చారు. రూ.కోటి రూపాయలు అందించినట్టు తెలుస్తోంది.
ప్రముఖ నటుడు సునీల్ శెట్టి తన ఉదారతను చాటుకున్నారు. కేవీఎన్ ఫౌండేషన్తో కలిసి ఉచిత ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను అందిస్తున్నారు.
ఆపద సమయాల్లో సాయం చేయడంలో ముందుంటారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్కుమార్. ఆయన 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, లండన్కు చెందిన దైవిక్ ఫౌండేషన్ ప్రకటించిన 120 కాన్సంట్రేటర్లు కలిపి అవసరమైన వారికి అందిస్తున్నారు.
కరోనా తొలి దశలో ఎంతోమందిని ఆదుకుని పెద్ద మనసు చాటుకున్నారు సోనూసూద్. ఆ తర్వాత కూడా ఎందరినో ఆదుకున్నారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్లోనూ ఆయన నిరంతరం సాయం అందిస్తున్నారు. ఆయన బృందంతో కలిసి పగలు, రాత్రి అనే తేడా లేకుండా సహాయం చేస్తున్నారు. ‘‘అర్ధరాత్రి మీ కోసం ఎన్నో ఫోన్ కాల్స్ చేస్తున్నాం. అవసరమైన వారికి ప్రాణవాయువు, పడకలు దొరికి కొందరి ప్రాణాలైనా కాపాడటానికి ప్రయత్నిస్తున్నాం. రూ.వంద కోట్ల సినిమాలో భాగం కావడం కంటే ప్రజాసేవా చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది. కరోనా బాధితులు పడకల కోసం ఆసుపత్రుల ముందు ఎదురుచూస్తుంటే మేం నిద్రపోలేం’’- సోనూసూద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.