Alia Bhatt: పక్కింటి డాబాపైనుంచి నా ఫొటోలు తీశారు.. హద్దులు దాటారంటూ అలియా సీరియస్

ప్రముఖ నటి అలియా భట్‌ (Alia Bhatt)కు చేదు అనుభవం ఎదురైంది. అమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే విధంగా ఇద్దరు వ్యక్తులు ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్‌ అవుతోంది.

Updated : 22 Feb 2023 10:34 IST

ముంబయి: సెలబ్రెటీల లైఫ్‌స్టైల్‌ తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. తారల ఇంటి సంగతులు, వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ప్రయత్నిస్తుంటారు. అయితే.. ఆ ఆసక్తి ఒక్కోసారి హద్దులు మీరి నటీనటులకు ఇబ్బంది కలిగిస్తుంటుంది. తాజాగా అలాంటి ఘటనే ప్రముఖ నటి అలియా భట్‌ (Alia Bhatt)కు ఎదురైంది. అలియా ఏ సమయంలో ఏం చేస్తుందో తెలుసుకోవాలనుకున్న ఇద్దరు వ్యక్తులు ఏకంగా కెమెరాలతో ఆమె ఇంటిని ఫోకస్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అలియా తీవ్ర అభ్యంతరం  వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఘటన టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. అలియాకు పలువురు సెలబ్రెటీలు మద్దతు పలుకుతూ వ్యక్తిగత గోప్యత విషయంలో వారికి ఎదురైన అనుభవాలు పంచుకుంటున్నారు. మరికొందరు ఈ ఘటనను ఖండిస్తున్నారు.

అసలేం జరిగిందో అలియా తన ఇన్‌స్టాలో రాసింది. ‘‘మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా? నేను ప్రశాంతంగా నా ఇంటి వద్ద కుటుంబంతో గడుపుతున్నాను. ఎవరో నన్ను గమనిస్తున్నట్లు అనిపించింది. పక్కకు చూస్తే ఎవరో ఇద్దరు వ్యక్తులు మా పక్కింటి డాబాపై నుంచి నన్ను కెమెరాతో వీడియో తీస్తున్నారు. ఇది సరైనదేనా..? ఒకరి వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించరా? ఎలాంటి వారి మధ్య అయినా దాటకూడని గీత ఉంటుంది. మీరు ఈరోజు ఆ గీత దాటారు. మీరు మీ హద్దులు దాటి ప్రవర్తించారు’’ అంటూ  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఇన్‌స్టా పోస్టులో ముంబయి పోలీసులను ట్యాగ్‌ చేసింది.  ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. దీనిపై పలువురు సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దీనిపై జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) స్పందిస్తూ..‘‘ఇది చాలా అసహ్యమైన చర్య. నాకు ఇలాంటి పరిస్థితి చాలా సార్లు ఎదురైంది. నాకు తెలియకుండా నన్ను ఫొటోలు తీశారు. ప్రైవేట్‌ స్థలాల్లో ఉన్నా ఫొటోలు తీశారు’’ అని చెప్పింది. మరో ప్రముఖ హీరోయిన్‌ అనుష్క శర్మ (Anushka Sharma) మాట్లాడుతూ తన కూతురు వామిక ఫొటోల విషయం తెలిపింది.‘‘ఇది నిజంగా సిగ్గుచేటు. మేము మా కుమార్తె విషయంలో ఇలాంటి ఘటనలను ఎదుర్కొన్నాం. తన ఫొటోలను తీయొద్దని ఎంత అభ్యర్థించినా వారు ఆమె చిత్రాలను పోస్ట్‌ చేశారు’’ అని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని