Bollywood: ఎప్పుడొస్తున్నారు?

అందరి అంచనాలనూ తలకిందులు చేసినట్లే కొవిడ్‌ బాలీవుడ్‌ అగ్రహీరోల ప్రణాళికలనూ మార్చేసింది. వారి అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ కొంతమంది సుమారు రెండేళ్లు తెర మీద కనిపించలేదు. ఇప్పుడు పరిస్థితి కుదుటపడడంతో సెట్స్‌పైకి వెళ్లిపోయారు.

Updated : 23 May 2022 07:05 IST

అందరి అంచనాలనూ తలకిందులు చేసినట్లే కొవిడ్‌ బాలీవుడ్‌ అగ్రహీరోల ప్రణాళికలనూ మార్చేసింది. వారి అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ కొంతమంది సుమారు రెండేళ్లు తెర మీద కనిపించలేదు. ఇప్పుడు పరిస్థితి కుదుటపడడంతో సెట్స్‌పైకి వెళ్లిపోయారు. ఈ రెండేళ్లలో ప్రేక్షకులు కోల్పోయిన ఆనందాన్ని రెట్టింపు చేసి ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ బడా హీరోలు వచ్చి... థియేటర్లకు కళ తెస్తారని డిస్ట్రిబ్యూటర్లు ఎదురుచూస్తున్నారు. కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌ చిత్ర  పరిశ్రమను ఆదుకుంటారని నమ్మకంతో ఉన్నారు. మరి అగ్ర కథానాయకులు ఆమిర్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ చివరి సారిగా ఏ సినిమాలో కనిపించారు? ఇప్పుడు ఏ సినిమాల్లో నటిస్తున్నారో ఒక సారి చూద్దాం.


ఆఖరిది ‘జీరో’

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌. ప్రేమ సన్నివేశాల్లో తన కళ్లతోనే రొమాన్స్‌ చేస్తాడని అభిమానులు గొప్పగా చెప్పుకొంటారు. వారిని అలరించడానికే అన్నట్లు కొన్నేళ్లుగా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ వచ్చాడు. అలాంటి షారుఖ్‌ తెరపై కనపడి నాలుగేళ్లు అయిందంటే నమ్మశక్యంగా ఉండదు. 2018లో బవువా సింగ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జీరో’లో షారుఖ్‌ తెరమీద కనిపించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకూ తన నుంచి సినిమా రాలేదు. ఈ ఏడాది ఆయన నటనను చూసే అవకాశం ఉన్నా అవి అతిథి పాత్రలే. ‘రాకెట్రీ ది నంబి ఎఫెక్‌’్ట, ‘లాల్‌ సింగ్‌ చద్ధా, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాల్లో షారుఖ్‌ కనిపిస్తాడు. కథానాయకుడిగా నటిస్తున్న ‘పఠాన్‌’, ‘డంకీ’, ‘టైగర్‌ 3’ చూడాలంటే 2023 వరకూ     నిరీక్షించాల్సిందే.


‘పృథ్వీరాజ్‌’ ఆగమనం

డాదికి మూడు నుంచి ఐదు సినిమాలు విడుదల చేసే కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌. కొవిడ్‌ సమయంలో కాస్త వేగం తగ్గించినా ప్రేక్షకులకు నటన పరంగా దూరం కాలేదు. 2020లో కాంచన రీమేక్‌ ‘లక్ష్మీ’గా కనిపించాడు. ఈ చిత్రంలో తన నటనకు ఉత్తరాది ప్రేక్షకులు జై కొట్టారు. 2021లో ‘బెల్‌బాటమ్‌’, ‘సూర్యవంశీ’, ‘అంతరంగీ’ చిత్రాలతో మెప్పించాడు. వీటిల్లో ‘సూర్యవంశీ’ వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం తన అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పృథ్వీరాజ్‌’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ట్రైలర్‌తో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇందులో మాజీ ప్రపంచ సుందరి మానుషి ఛిల్లర్‌ కథానాయికగా నటించడం విశేషం. దీని తర్వాత ‘రక్షా బంధన్‌’, ‘రామ్‌ సేతు’, ‘ఆకాశం నీ హద్దురా’ హిందీ రీమేక్‌, ‘ఓ మై గాడ్‌2’, ‘సెల్ఫీ’ ‘మిషన్‌ సిండ్రెల్లా’ తదితర చిత్రాలతో 2023 మొత్తం థియేటర్ల దగ్గర సందడి చేయనున్నాడు.


తగ్గేదేలే అంటూ...

ఖాన్‌ త్రయంలో పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించిన కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌. 2019లో ‘భారత్‌’ తోపాటు మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘దబాంగ్‌ 3’తో తెరపై కనిపించాడు. 2021లోనూ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా ‘రాధే’, న్యాయాన్ని రక్షించే పోలీసుగా ‘అంతిమ్‌’లో కనిపించి బాలీవుడ్‌కు జోష్‌ తెచ్చాడు. ప్రస్తుతం ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇందులో భాయ్‌ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా తనకు అన్నగా విక్టరీ వెంకటేష్‌ కనిపించనున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’లో సల్మాన్‌ ఒక అతిథి పాత్రలో మెరవనున్నాడు.


సైనికుడిగా...

మితాబ్‌ బచ్చన్‌తో కలిసి దొంగగా నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ ఆమిర్‌ ఖాన్‌ చివరి చిత్రం. 2018లో విడుదలైన ఈ చిత్రం తర్వాత ఇక తెరపై కనపడలేదు. ‘కోయీ జానే నా’ సినిమాలో ఒక పాటలో ఆడి పాడి తన అభిమానులను అలరించాడు. ఈ రెండేళ్ల విరామంలో ‘ఫారెస్ట్‌ గంప్‌’ రీమేక్‌ ‘లాల్‌ సింగ్‌ చద్ధా’ సినిమాను పూర్తి చేశాడు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించాడు. ఇందులో నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సంగీత   పరంగా ఆకట్టుకుంటున్నాయి. ఇది విడుదలైన తర్వాత ఈ బాలీవుడ్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని