భువిలో సంగీతం ఉన్నంత కాలం బాలు అమరులే..

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. కె. రాఘవేంద్రరావు, ఎ.ఆర్‌. రెహమాన్‌, అక్షయ్‌ కుమార్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, రవితేజ, నాని, తమన్‌, మంచు లక్ష్మి, దుల్కర్‌ సల్మాన్‌

Updated : 25 Sep 2020 19:44 IST

ఎస్పీబీ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. కె. రాఘవేంద్రరావు, ఎ.ఆర్‌. రెహమాన్‌, అక్షయ్‌ కుమార్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, రవితేజ, నాని, తమన్‌, మంచు లక్ష్మి, దుల్కర్‌ సల్మాన్‌ తదితరులు సంతాపం తెలిసిన వారిలో ఉన్నారు.

* కె. రాఘవేంద్రరావు: నా ప్రియమైన బాలు.. సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది.. సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి.. రాగాలన్నీ మూగబోయాయి.. నువ్వు లేని లోటు తీర్చలేనిది..!!

 

* చిరంజీవి: ప్రపంచ సంగీతానికి ఇది చీకటి రోజు. మ్యూజిక్‌ లెజెండ్‌ ఎస్పీ బాలు గారి మరణంతో ఓ శకం ముగిసింది. వ్యక్తిగతంగా చెప్పాలంటే.. నా కెరీర్‌ విజయంలో బాలు గారి స్వరం పాత్ర ఎంతో ఉంది. ఆయన నా కోసం ఎన్నో మధురమైన గీతాలు ఆలపించారు. ఘంటసాల గారి తర్వాత ఈ సంగీత ప్రపంచాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారా?.. అనే తరుణంలో ఓ తారలా బాలు గారు మ్యూజిక్‌ గెలాక్సీలోకి అడుగుపెట్టారు. భాష, ప్రాంతం, హద్దులు.. అనేవి లేకుండా పలు దశాబ్దాలుగా ఆయన మధుర గాత్రం భారత దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని అలరిస్తోంది. భవిష్యత్‌లో మరో బాలసుబ్రహ్మణ్యం రాడు.. కేవలం ఆయన పునఃజన్మ మాత్రమే ఆ లోటును భర్తీ చేయగలదు. ఆయన మరణ వార్త విని, నా గుండె పగిలింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి బాలు గారు.

* బాలకృష్ణ: 16 భాషల్లో 40 వేలకిపైగా పాటలు పాడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి నిష్క్రమణ యావత్‌ సినీ, సంగీత ప్రపంచానికే తీరని లోటు. వ్యక్తిగతంగా నాకు బాలు గారితో ఎంతో అనుబంధం ఉంది. ఆయన పాడిన నాన్నగారి పాటలు, నా పాటలు వినని రోజంటూ ఉండదు. ముఖ్యంగా ‘భైరవ ద్వీపం’లో ఆయన ఆలపించిన ‘శ్రీ తుంబుర నారద నాదామృతం’ పాటను ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటాను. అలా ప్రతి క్షణం ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాను. అలాంటి గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం ఎంతో విచారకరం. బాలు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా.

* చిత్ర: ఓ శకం ముగిసింది. సంగీతం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రపంచం కూడా ఎప్పుడూ ఇలానే ఉండదు. నేను ఉత్తమ గాయనిగా మారేందుకు ఆయన చేసిన సాయానికి ధన్యవాదాలు చెప్పడానికి మాటలు సరిపోవు. మీరు లేకుండా సంగీత విభావరిలో పాల్గొనడాన్ని ఊహించలేకపోతున్నా. సావిత్రమ్మ, చరణ్‌, పల్లవితోపాటు ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.

* వెంకటేశ్‌: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇవాళ ఓ లెజెండ్‌ను కోల్పోయాం. నా కెరీర్‌లో హిట్లుగా నిలిచిన ‘ప్రేమ’, ‘పవిత్రబంధం’ వంటి సినిమాల్లో ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. మీ ఖ్యాతి ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. బాలు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా..

* బోనీ కపూర్‌: ఇవాళ ఓ లెజెండ్‌ను కోల్పోయాం. దాదాపు 16 భాషల్లో వేల గీతాలు ఆలపించారు. ఆయన స్వరం.. తరం, ప్రాంతం అనే తేడా లేకుండా సంగీత ప్రియుల్ని ఒక్కటి చేసింది. మీరు చిత్ర పరిశ్రమకు చేసిన సేవ.. మా జ్ఞాపకాల్లో మిమ్మల్ని ఎప్పటికీ జీవంతోనే ఉంచుతుంది. బాలు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.

* సుహాసిని: బాలు గారు.. నా గుండె పగిలింది. మీరు లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించలేకున్నా.
* గుణశేఖర్‌: గంధర్వ లోకానికేగిన గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిసున్నా.

* ఎస్‌.ఎస్‌. రాజమౌళి: బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు. చాలా మంది తమిళ, కన్నడ సోదరులు ఆయన తెలుగు వాడంటే ఒప్పుకునేవారు కాదు. బాలు మావాడు అని గొడవ చేసేవారు. అన్ని భాషల్లో పాడారు. అందరి చేత మావాడు అనిపించుకున్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

* రజనీకాంత్‌: ‘బాలు సర్‌.. గత కొన్నేళ్లుగా మీరు నా స్వరం అయ్యారు. మీ జ్ఞాపకాలు, మీ స్వరం నాతో ఎప్పటికీ ఉంటాయి. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నా..
* శంకర్‌: కొందరు గాయకులు పాడితే.. అది ఆడియన్స్‌ దగ్గరకు వెళ్లకముందే హిట్‌ అవుతుంది. అతి తక్కువ మందికి ఈ క్వాలిటీ ఉంటుంది. ఈ విషయంలో ఎస్పీబీ సర్‌ అగ్ర స్థానంలో ఉన్నారు. ఇవాళ మనం ఆయన్ను కోల్పోయాం.. ఆయన స్వరాన్ని కాదు. ఆయన గాత్రం ఎల్లప్పుడూ ఈ గాలిలోనే ఉంటుంది.

* నాగార్జున: బాలు గారితో ముచ్చట్లు, ఆయన జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తొచ్చే సరికీ కన్నీరు ఆగడం లేదు. నా సినిమా ‘అన్నమయ్య’ విడుదలైన తర్వాత ఆయన ఫోన్‌ చేశారు. అప్పుడన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. నా జీవితంలో ఆయన ఓ భాగం అయ్యారు. దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో..!
* సల్మాన్‌ ఖాన్‌: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సర్‌ గురించి తెలిసిన తర్వాత నా గుండె పగిలింది. మీరు సంగీత ప్రపంచానికి చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
* రామ్‌ చరణ్‌: ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఎస్పీబీ గారు ఇకలేరనే వార్త విని షాక్‌ అయ్యా. చిత్ర పరిశ్రమలో ఆయన లోటును ఊహించలేకపోతున్నా. దీన్ని తట్టుకునే శక్తి దేవుడు కుటుంబ సభ్యులకు ఇవ్వాలి.

* మహేశ్‌బాబు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇకలేరనే చేదు వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన అమృత స్వరానికి మరొకటి సాటి రాదు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్‌. మీ స్వరం జీవంతోనే ఉంటుంది. ఇటువంటి కష్ట సమయాన్ని తట్టుకునే శక్తి ఆ దేవుడు కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా.

* ఎ.ఆర్‌. రెహమాన్‌: ఎస్పీ సర్‌ మీరు ఇకలేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నా గుండె ముక్కలైంది.

 

* ఎన్టీఆర్‌: తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకుపైగా 16 భాషల్లో 40 వేలకుపైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ, పద్మభూషణ్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే.

* అక్షయ్ కుమార్‌: బాలసుబ్రహ్మణ్యం జీ మరణవార్త నన్నెంతో బాధించింది. ఈ లాక్‌డౌన్‌లో కొన్ని నెలల క్రితం ఓ కాన్సర్ట్‌ కోసం బాలసుబ్రమణ్యం గారితో ఆన్‌లైన్‌లో మాట్లాడా. ఆయన చాలా ఆరోగ్యంగా ఎప్పటిలాగే కనిపించారు. నిజంగా జీవితాన్ని మనం ఊహించలేం.. ఈ బాధను తట్టుకునే శక్తిని దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నా.

* రవితేజ: ప్రతి భారతీయుడి గుండెలో కొలువైన వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన స్వరం సంగీత ప్రపంచానికి చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనిషిలోని అన్నీ భావోద్వేగాలకు తగ్గట్టు పాటలు పాడిన ఆయన ఓ లెజెండ్‌. మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నాం.

* మంచు లక్ష్మి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంకుల్‌.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. నా హృదయంలోని ఓ భాగాన్ని మీతో తీసుకెళ్లారు. మనమంతా ఈ బాధను తట్టుకోవడం అంత సులభం కాదు. ఓ గాయకుడిగా, వ్యక్తిగా మీకు సాటిలేరు. ఈ రోజు మనకు దుఖాఃన్ని మిగిల్చింది.

* రమ్యకృష్ణ: మనకు ఎంతో ప్రత్యేకమైన బాలు సర్‌ని ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. బాలు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నా.

* నాని: నా హృదయం లక్షలాది పాటలుగా మారి ముక్కలైంది. నేను బాలు గారితో కలిసి షూట్‌లో ఉన్నప్పుడు బాబు జున్నును తీసుకుని సెట్‌కు రమ్మని నా భార్య అంజుకు చెప్పా. లెజెండ్‌ బాలుతో దిగిన ఫొటో జున్ను జ్ఞాపకాల్లో ఉండాలి అనుకున్నా.

* తమన్‌: నా కన్నీటిని ఆపుకోలేకపోతున్నా.. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం. నా హృదయం బాధతో నిండిపోయింది.

* సౌందర్య రజనీకాంత్‌: మీ మరణం నన్నెంతో బాధించింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్‌.

* చిన్మయి: మాకెన్నో జ్ఞాపకాల్ని మిగిల్చినందుకు ధన్యవాదాలు. ఓ సింగర్‌ నటించగలడు, కంపోజ్‌ చేయగలడు.. మరెన్నో అంశాల్లోనూ రాణించగలడని నిరూపించినందుకు కృతజ్ఞతలు. మీరెప్పుడూ మా హృదయాల్లో ఉంటారు సర్‌.

* హరీష్‌ శంకర్‌: ఆగిపోయింది మీ గుండె మాత్రమే, మీ గొంతు కాదు.. మీరెప్పుడూ మాతోనే ఉన్నారు. ఉంటారు..

* దుల్కర్‌ సల్మాన్: మీరు నిజమైన లెజెండ్‌. బాలు సర్‌ ఆత్మకు శాంతి చేకూరాలి.

* రాధాకృష్ణ: నిజంగా ఇది చాలా చేదు వార్త. మనకెంతో ఇష్టమైన ఎస్పీబీ సర్‌ను మిస్‌ అవుతున్నాం.

* సుధీర్‌ బాబు: మీరు లేకుండా భారత చిత్ర పరిశ్రమ మళ్లీ గతంలోలా ఉండలేదు. మీ ఆత్మకు శాంతి కలగాలి లెజెండ్‌.

* శ్రీముఖి: మీరు మాకు దూరమైనా.. మీ స్వరం ఎప్పటికీ మాతోనే ఉంటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని