celebrity cricket league: సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ విజేత ‘తెలుగు వారియర్స్‌’

celebrity cricket league winner: సీసీఎల్‌-2023 టైటిల్‌ను తెలుగు వారియర్స్‌ సొంతం చేసుకుంది. భోజ్‌పురి దబాంగ్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.

Published : 26 Mar 2023 06:14 IST

విశాఖ: సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ -2023 (celebrity cricket league winner) విజేతగా తెలుగు వారియర్స్‌ (telugu warriors) నిలిచింది. విశాఖ వేదికగా భోజ్‌పురి దబాంగ్స్‌(bhojpuri dabangs)తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్‌ అఖిల్‌ అక్కినేని (akhil akkineni) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం సీసీఎల్‌ చరిత్రలో అత్యధికంగా నాలుగు టైటిల్స్‌ గెలిచిన జట్టుగా తెలుగు వారియర్స్‌ చరిత్ర సృష్టించింది.

ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన తెలుగు వారియర్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భోజ్‌పురి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో అఖిల్‌ (67) రాణించడంతో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా  బ్యాటింగ్‌కు దిగిన భోజ్‌పురి 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. 58 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వారియర్స్‌  కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయం సాధించడమే కాకుండా సీసీఎల్‌ టోర్నీలో నాలుగో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మ్యాచ్‌ నిర్వాహకులు విష్ణు ఇందూరి మాట్లాడుతూ.. ‘సీసీఎల్‌ ప్రారంభించి పుష్కర కాలం పూర్తయింది. మూడేళ్ల తర్వాత మళ్లీ అందరం కలిశాం. అసలు నిర్వహించాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉండగా కన్నడస్టార్‌ కిచ్చా సుదీప్‌ మాకు అండగా నిలిచి మళ్లీ టోర్నీ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నీ నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు.

బెస్ట్‌ బౌలర్‌/ బ్యాట్స్‌మెన్‌ వీళ్లే..!

* బెస్ట్‌ బౌలర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: తమన్‌

* బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఆదిత్య ఓజా (భోజ్‌పురి)

* మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అఖిల్‌ అక్కినేని

* ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది సీజన్‌: తమన్‌

* బెస్ట్‌ బౌలర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌: ప్రిన్స్‌

* బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌: ఆదిత్య ఓజా(భోజ్‌పురి)

* మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌: అఖిల్‌ అక్కినేని

సీసీఎల్‌ హైలైట్స్‌..

  • దాదాపు మూడేళ్ల తర్వాత సీసీఎల్‌-2023 (celebrity cricket league) జరిగింది.
  • ఈ ఏడాది మొత్తం 8 జట్లు టోర్నీలో పాల్గొన్నాయి. తెలుగు వారియర్స్‌, ముంబయి హీరోస్‌, చెన్నై రైనోస్‌, కర్ణాటక బుల్డోజర్స్‌, కేరళ స్ట్రైకర్స్‌, బెంగాల్‌ టైగర్స్‌, భోజ్‌పురి దబాంగ్స్‌, పంజాబ్‌ దే షేర్స్‌.
  • ఐఏఎల్‌ (IPL) స్ఫూర్తితో 2011లో సీసీఎల్‌ తొలి మ్యాచ్‌ జరిగింది. అప్పుడు నాలుగు టీమ్‌లు మాత్రమే పాల్గొన్నాయి. 2019 వరకూ అటు క్రీడా, ఇటు సినీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్న సీసీఎల్‌ కొవిడ్‌ కారణంగా మూడేళ్లు వాయిదా పడింది.
  • ఇప్పటివరకూ జరిగిన సీసీఎల్‌ టోర్నీల్లో తెలుగు వారియర్స్ అత్యధికంగా మూడు టైటిల్స్‌ (2015, 2016, 2017)ను సొంతం చేసుకుంది. తాజా జరిగిన టోర్నీ(2023) ఈ టైటిల్ నాలుగోది.
  • భోజ్‌పురి దబాంగ్స్‌ తొలిసారి సీసీఎల్‌ ఫైనల్‌కు చేరింది. ఈ సీజన్‌లో భోజ్‌పురి ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు.
  • ఈ టోర్నమెంట్‌(2023)లో మొత్తం 320 సిక్స్‌లు నమోదయ్యాయి.
  • సీసీఎల్‌ చరిత్రలోకర్ణాటక బుల్డోజర్స్‌, చెన్నై రైనోస్‌ రెండేసిసార్లు విజయం సాధించగా, ముంబయి హీరోస్‌ ఒకసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని