Keeravani: పెద్దన్న ‘పద్మ’న్న

రాలిపోయే పూవుకి... వాలిపోయే పొద్దుకి కూడా రాగాలద్ది హృదయాల్ని మీటిన స్వర మాంత్రికుడు... ఎం.ఎం.కీరవాణి. తెలుసా మనసా... అంటూ జన్మంతా పాడుకునేంతగా పాటకీ, శ్రోతకీ మధ్య అనుబంధాన్ని పెనవేసిన ఘనుడు.

Updated : 26 Jan 2023 10:18 IST

రాలిపోయే పూవుకి... వాలిపోయే పొద్దుకి కూడా రాగాలద్ది హృదయాల్ని మీటిన స్వర మాంత్రికుడు... ఎం.ఎం.కీరవాణి. తెలుసా మనసా... అంటూ జన్మంతా పాడుకునేంతగా పాటకీ, శ్రోతకీ మధ్య అనుబంధాన్ని పెనవేసిన ఘనుడు. ఝుం ఝుం మాయ... అంటూ అల్లరి చేసిన బాణీ ఆయనదే... ‘గుండు సూది గుండుసూది... గుచ్చుకుంది’  అంటూ గిలిగింతలు పెట్టిన వాణి ఆయనదే. ‘అంతా రామమయం...’ అంటూ సాగే భక్తి పాటలోనూ ఆయన కనిపిస్తాడు. ‘ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో అచ్చాగా...’ అంటూ సాగే రక్తి పాటలోనూ ఆయన రసవత్తరంగా వినిపిస్తాడు. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాననీ...  అంటూ అప్పుడప్పుడూ ఆయన స్వరం ధైర్యం కూడా చెబుతుంటుంది.

తెలుగులో... కీరవాణి (Keeravani). తమిళంలో మరకతమణి. హిందీలో క్రీమ్‌. పేరేదైనా సరే...  ఆయన బాణీ మాత్రం ప్రత్యేకం. భాషతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా భారతీయ శ్రోతల్ని తన సంగీతంతో ఉర్రూతలూగిస్తున్నారు కీరవాణి. అందుకే ఆయన నేడు భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ పెద్దన్నలా కనిపిస్తున్నారు. ఇప్పుడు పెద్దన్న.. ‘పద్మ’న్న అయ్యారు.

‘అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం రా’ అంటూ బయల్దేరిన కీరవాణి... ‘నాటు నాటు’ పాటతో విశ్వాన్నంతా ఊపేసి అత్యున్నత ఆస్కార్‌ స్థాయిలో కనిపిస్తున్నారు. అదీ ప్రయాణం అంటే!

భళిరా భళి... అంటూ తన సంగీతంతో సినిమాని అంతెత్తున నిలబెట్టగల నేర్పరి... కీరవాణి. ఒక్క మాటలో చెప్పాలంటే తెరవెనక ఉండే బాహుబలి ఆయన. జక్కన్న రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో అంతెత్తున నిలబెట్టడం వెనక... ఓ మూలస్తంభంలాంటి పాత్ర పోషించిన స్వరధీరుడు కీరవాణి. ఆర్కెస్ట్రా ట్రూప్‌ నుంచి అగ్ర సంగీత దర్శకుడి వరకు ఆయన ప్రయాణం సదా స్ఫూర్తిదాయకం.

మధుమాసం... కుహూగానం

తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కీరవాణి సుపరిచితులు. 1990లో ఉషాకిరణ్‌ మూవీస్‌ పతాకంపై రామోజీరావు నిర్మించిన ‘మనసు మమత’ సంగీత దర్శకుడిగా ఆయనకి తొలి చిత్రం. ‘మధుమాసం... కుహూగానం’ పాటతో ఆయన స్వర ప్రయాణం మొదలైంది. ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘క్షణ క్షణం’ చిత్రాల నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. రైతు కుటుంబంలో పుట్టి పెరిగారు కీరవాణి. సంగీత ప్రపంచంలోనూ ఆయన  ఓ రైతులానే రేయింబవళ్లు శ్రమించి ఎదిగారు. దాదాపు 250 సినిమాలకి పనిచేశారు. తండ్రి శివశక్తి దత్త సంగీత, సాహిత్యాభిరుచి... తల్లి భానుమతి వీణా వాయిద్య ప్రతిభ, వారి ప్రోత్సాహమే తాను సంగీతంవైపు అడుగులేసేందుకు కారణమైందని చెబుతారు కీరవాణి. కె.బాలచందర్‌ సినిమా ‘అళగన్‌’తో తమిళంలోకి అడుగుపెట్టిన ఆయన అక్కడ తొలి చిత్రంతోనే సత్తా చాటారు.

‘రా’ సెంటిమెంట్‌

చిత్రసీమలో సెంటిమెంట్లు ఎక్కువ. అలా తనకి కూడా ‘రా’ సెంటిమెంట్‌ పనిచేసిందేమో అంటుంటారు కీరవాణి. ‘‘నిర్మాత రామోజీరావు తొలి అవకాశం ఇవ్వడంతోపాటు, నా  పనితీరు మెచ్చి మా సంస్థలో రూపొందే చిత్రాలన్నింటికీ మీరే పనిచేయాలని ప్రోత్సహించారు. ఆయన చెప్పినట్టే ఆ సంస్థలో వరుసగా సినిమాలు చేశా. ఆ తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ చిత్రం ‘క్షణ క్షణం’ అవకాశంతో నా కెరీర్‌ మరింతగా పుంజుకుంది. మూడోసారి దర్శకులు రాఘవేంద్రరావు వల్ల నా కెరీర్‌ మరో మలుపు తీసుకుంది. ఆయనతో 28 సినిమాలు చేశా. మా ఇద్దరిదీ విజయవంతమైన కలయిక అయ్యింది. ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ నుంచి రాజమౌళితో ప్రయాణం కొనసాగుతోంద’’ని చెబుతారు కీరవాణి. 1990వ దశకంలో కీరవాణి హవా సాగింది. అగ్ర దర్శకులు కె.విశ్వనాథ్‌, బాపుతోపాటు, కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, రవిరాజా పినిశెట్టి తదితర దర్శకుల సినిమాలకీ స్వరాలు సమకూర్చారు. ‘అల్లరి మొగుడు’తో మొదలైన కె.రాఘవేంద్రరావు - కీరవాణి కలయిక ‘ఘరానా మొగుడు’, ‘సుందరకాండ’, ‘అల్లరి ప్రియుడు’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’,  ‘పెళ్లిసందడి’, ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘గంగోత్రి’, ‘శిరిడిసాయి’... ఇలా విజయవంతంగా సాగింది. ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ మొదలుకొని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వరకూ తన తమ్ముడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించే ప్రతి సినిమాకీ కీరవాణే సంగీత దర్శకుడు. వీళ్లిద్దరి ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది. మహేష్‌భట్‌ దర్శకత్వం వహించిన ‘క్రిమినల్‌’ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టారు. ‘జక్మ్‌’, ‘జిస్మ్‌’, ‘సాయా’, ‘ధోకా’, ‘లాహోర్‌’, ‘స్పెషల్‌ ఛబ్బీస్‌’, ‘బేబి’, ‘మిస్సింగ్‌’ తదితర చిత్రాలకి స్వరాలు సమకూర్చారు.


ఆల్‌రౌండర్‌

కీరవాణిలో సంగీత దర్శకుడే కాదు... ఆయనలో గాయకుడు, చేయి తిరిగిన గీత రచయిత కూడా ఉన్నారు. ‘విక్రమార్కుడు’లో రాత్రయినా పడుకోలేదు...’, ‘వేదం’లో ‘ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్‌’, ‘మగధీర’లో నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే.. బాగుంది, ‘ఈగ’లో నేనే నానినే..., ‘శిరిడిసాయి’లో మానవ సేవే మాధవ సేవని..’  ఇలా ఎన్నో పాటల్ని కీరవాణి స్వయంగా రచించారు. గాయకుడిగా కూడా ఆయనది ప్రత్యేకమైన ముద్రే. ‘నేనున్నాను’ సినిమాలో చీకటితో వెలుగే చెప్పెను..., ‘వేదం’లో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది... , ‘అన్నమయ్య’లో గోవిందాశ్రిత, ‘శ్రీరామదాసు’లో కలలో నీ నామ స్మరణ..., పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాలో చీరలోని గొప్పతనం తెలుసుకో.. తదితర గీతాల్ని కీరవాణి ఆలపించి ఆల్‌రౌండర్‌ అని నిరూపించారు. ‘ఛత్రపతి’లో అగ్నిస్ఖలన సందగ్ధరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి... అంటూ పూర్తిగా సంస్కృతంలో సాగే పాటని కీరవాణి పాడిన విధానం అలరించింది.


ఎన్నెన్నో పురస్కారాలు

తమిళంలో తొలి సినిమాకే ఆ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్న కీరవాణి... ‘అన్నమయ్య’ సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎనిమిదిసార్లు, నేపథ్య గాయకుడిగా మూడుసార్లు నంది పురస్కారాల్ని అందుకున్నారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కీరవాణి పేరు మార్మోగిపోతుంది. ఆ చిత్రంలో నాటు నాటు.. పాటకిగానూ గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారాన్ని, క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డ్‌ని అందుకున్నారు. ఆస్కార్‌ అవార్డుల కోసం నామినేషన్‌ని కూడా దక్కించుకుని చరిత్రని సృష్టించింది. తన విజయంలో సగం వాటా తన అర్థాంగి శ్రీవల్లికే దక్కుతుందని చెప్పే కీరవాణి...  తనయులు కాలభైరవ కూడా తండ్రి అడుగుజాడల్లో ప్రయాణం చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా విజయాలు అందుకుంటున్నారు.  ‘నాటు నాటు...’ పాటని పాడటంతోపాటు, ఆ పాటకి కావల్సినవన్నీ ఆయన సమకూర్చారు. మరో తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా కొనసాగుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని