Chiranjeevi:భారతీయ సినిమా మతమైతే దానికి పీఠాధిపతి రాజమౌళి: చిరంజీవి

రాబోయే రోజుల్లో ప్రాంతీయ సినిమా అనే కాన్సెప్ట్‌ ఉండదని, ఏ సినిమా అయినా ఇండియన్‌ సినిమా అవుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.

Updated : 24 Apr 2022 08:55 IST

హైదరాబాద్‌: రాబోయే రోజుల్లో ప్రాంతీయ సినిమా అనే కాన్సెప్ట్‌ ఉండదని, ఏ సినిమా అయినా ఇండియన్‌ సినిమా అవుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. రామ్‌చరణ్‌తో కలిసి ఆయన నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 29 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ‘‘రుద్రవీణ’కు జాతీయ అవార్డు వస్తే, దిల్లీ వెళ్లాం. అవార్డులు తీసుకునే ముందు తేనేటి విందు ఇచ్చారు. అక్కడ గోడపై ఇండియన్‌ సినిమా వైభవం పేరుతో పోస్టర్లు ఉంచారు. అక్కడ సినిమాలు, నటుల గురించి వివరణ ఇచ్చారు. పృథ్వీరాజ్‌కపూర్‌, దిలీప్‌కుమార్‌, దేవానంద్‌, అమితాబ్‌ ఇలా ప్రతి ఒక్కరినీ చూపించారు. దక్షిణాది సినిమాల విషయానికొస్తే ఎంజీఆర్‌-జయలలిత డ్యాన్స్‌ చేస్తున్న స్టిల్‌ వేసి సౌత్‌ సినిమా అని రాశారు. ప్రేమ్‌ నజీర్‌గారి ఫొటో వేశారు. అంతే, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌, విష్ణు వర్థన్‌, తెలుగులో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, శివాజీ గణేశన్‌ ఇలా మహా నటులకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా లేదు. ఇండియన్‌ సినిమా అంటే హిందీ సినిమా అనే చూపించారు. అప్పుడు చాలా బాధగా అనిపించింది. దానికి సమాధానం ఇటీవల కాలం వరకూ దొరకలేదు. ఆ తర్వాత నేను గర్వపడేలా, రొమ్ము విరుచుకుని నిలబడేలా తెలుగు సినిమా హద్దులు, ఎల్లలు చెరిపేసి, ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లు దోహదపడ్డాయి. అలాంటి సినిమాల నిర్మాణ కర్త రాజమౌళి ఇక్కడ ఉండటం గర్వకారణం. జీవితాంతం తెలుగు సినిమా రాజమౌళిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. భారతీయ సినిమా ఒక మతం అయితే, ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి. ‘ఆచార్య’ సినిమాలోకి నేను రావడానికి కారణం రాజమౌళినే కారణం. ఈ విషయం రాజమౌళికి కూడా తెలియదు’’

‘‘చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒప్పుకొన్న తర్వాత కొరటాల శివతో ఒక సినిమా చేయాలనుకున్నారు. కానీ, ‘ఆర్ఆర్ఆర్‌’ వల్ల ఆ మూవీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పైగా సినిమా పూర్తయ్యే వరకూ రాజమౌళి ఆయన నటులను బయటకు పంపరు. దీంతో ఒక రోజు శివను మా ఇంటికి పిలిచా. ‘చరణ్‌తో కాకుండా నాతో ఏదైనా సినిమా చేయొచ్చు కదా’ అని అడిగా. ఆయన వెంటనే ఒప్పుకొన్నారు. దీంతో అటు చరణ్‌కు, ఇటు నాకు లైన్‌ క్లియర్‌ అయింది. కథ సిద్ధం చేసిన తర్వాత ఒక పాత్ర చరణ్‌ చేయాల్సి రావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇదే విషయాన్ని రాజమౌళికి చెప్పడానికి ప్రయత్నిస్తే కుదరలేదు. ఆ తర్వాత సురేఖ సెంటిమెంట్‌ను ఉపయోగించి ‘ఆచార్య’లో చరణ్‌ నటించేలా రాజమౌళిని ఒప్పించాం. అలా పరోక్షంగా ఈ సినిమాలో రాజమౌళి భాగస్వామి అయ్యారు. అందుకే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కు ధన్యవాదాలు’’

‘‘రాజమౌళి వేసిన బాట వల్ల ప్రతి సినిమా పాన్‌ ఇండియా మూవీ అవుతోంది. కంటెంట్‌ బలం ఉంటే, స్టార్స్‌ ఏ ప్రాంతం వాళ్లైన పాన్‌ ఇండియా నటులు, దర్శకులే అవుతారు. ఒకప్పుడు మణిరత్నం, ఆ తర్వాత శంకర్‌ తమిళ సినిమా గర్వపడే చిత్రాలు చేశారు. ఇప్పుడు వచ్చే వన్నీ ఇండియన్‌ సినిమాలే. ‘ఆచార్య’లో మేము తండ్రీ కొడుకులం కాదు, గురుశిష్యులం కాదు, అతీతమైన అనుబంధం పెనవేసుకున్న సోల్స్‌. అది చరణ్‌ వల్లే సాధ్యమైంది. ‘డాడీ సినిమాలో నేను కనపడిచే చాలు’ అని చరణ్‌ అనుకున్నాడు. కానీ, చరణ్‌ ఉన్న తర్వాత నేను కనపడతానా? లేదా? అనే అనుమానం వచ్చింది. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలకు ఆ తర్వాతి సినిమా ఫ్లాప్‌ వస్తుందని అందరూ అనుకుంటారు. అది వాస్తవం కాదు. అలాంటి వాటిని నేను నమ్మను. అలా అనుకునే వాళ్లకు చెబుతున్నా, ఆ ఊహను ‘ఆచార్య’ తుడిచిపెట్టేస్తుంది. ఇది మళ్లీ ఒక హిట్‌ అవుతుంది. మీరు కచ్చితంగా చూస్తారు. ఏప్రిల్‌ 29న ఆస్వాదిస్తారు’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

కథానాయకుడు రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ‘ఈ 20ఏళ్లలో మా నాన్నను చూసి ఏం నేర్చుకున్నానో తెలియదు కానీ, ‘ఆచార్య’ షూటింగ్‌ కోసం మారేడుమిల్లిలో 20 రోజులు ఆయనను చూసి ఎంతో నేర్చుకున్నా. ‘బొమ్మరిల్లు’ ఫాదర్‌లా రాజమౌళి తన నటుల చేయిని సినిమా అయ్యే దాకా వదలరు. కానీ, నాన్నమీద గౌరవంతో, అమ్మ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని చెప్పడంతో ‘ఆచార్య’ కోసం నాకు డేట్స్‌ ఇచ్చారు. ‘మిర్చి’ తర్వాత కొరటాల శివతో చేద్దామని అనుకున్నాం. కానీ కుదరలేదు. ఇన్నాళ్లకు కుదిరింది. ఆయన రైటింగ్‌లో ఒక ఛరిష్మా ఉంటుంది. ‘ధ్రువ’, ‘రంగస్థలం’ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, నాకు బాగా దగ్గరైన సినిమాలు. అలాగే ‘ఆచార్య’లో సిద్ధ నాకు దగ్గరైన పాత్ర. ఆ సినిమాలు సాధించిన విజయం కన్నా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది. నిర్మాత నిరంజన్‌రెడ్డి, అవినాష్‌లు ఈ సినిమాకు మూల స్తంభాలుగా నిలిచి ఎంతో కష్టపడ్డారు. నా లైఫ్‌లో డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయి. చాలా బిజినెస్‌లు ఉన్నాయి. కానీ, ఈ పేరు రావాలంటే సినిమా ఇండస్ట్రీయే. కళాశాలలోని ‘ఆచార్య’లకు దూరంగా ఉన్నా. కానీ, ఇంట్లో ఉన్న ‘ఆచార్య’కు దగ్గరగా ఉన్నా. పెద్దలకు గౌరవం ఎలా ఇవ్వాలో చిన్నప్పటి నుంచి నేర్పారు. సినిమా విజయం సాధించినప్పుడు ఎలా ఉండాలి? ఫ్లాఫ్‌ అయితే ఎలా ఉండాలి? అనే విషయాలు ఆయన నుంచే నేర్చుకున్నా. ‘ఆచార్య’ షూట్‌లో ఇద్దరం కలిసి 20రోజులు ఉన్నాం. రెండు బెడ్లు ఉన్న ఒక కాటేజ్‌లో ఇద్దరం మధ్య ఎన్నో జ్ఞాపకాలు. కలిసి వ్యాయామం చేశాం. కలిసి భోజనం చేశాం. నా జీవితంలో మర్చిపోలేని రోజులవి. ఏప్రిల్‌ 29న వెండితెరపై కలుద్దాం’’ అని చరణ్‌ భావోద్వేగానికి గురయ్యారు.

మాస్‌ ఎలిమెంట్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ కొరటాల శివ: రాజమౌళి

‘‘ఎన్ని విజయాలు వచ్చినా  నేలపై ఎలా నిలబడాలో, వినమ్రంగా ఉండాలో చిరంజీవిగారిని చూసి నేర్చుకోవాలి. ‘ఆచార్య’ విజువల్స్‌ చాలా వండర్‌ఫుల్‌గా ఉన్నాయి. ‘మగధీర’ సమయంలో చిరంజీవిగారు కథ విన్నారు. ప్రతి విషయంలోనూ ఆయనే నిర్ణయాలు తీసుకుంటారని అనుకున్నా. కానీ, అది కాదు. చరణ్ తన సినిమాల విషయంలో చిరు ఎలాంటి సలహాలు ఇవ్వరు. అన్నీ చరణే నిర్ణయాలే ఉంటాయి. తప్పులు జరిగితే సరిదిద్దుకున్నారు. చిరంజీవి అందుకున్న ఎత్తులు అందుకుంటారో లేదో తెలియదు కానీ, ఆయనతో సమానంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నా. కొరటాల శివలో ఉన్న మాస్‌ఎలిమెంట్స్‌ మరే డైరెక్టర్‌లోనూ ఉండవు. ‘ఆచార్య’ డబుల్‌ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అని అగ్ర దర్శకుడు రాజమౌళి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

నాకో మంచి ‘ఆచార్య’ దొరికారు: కొరటాల శివ

కొరటాల శివ మాట్లాడుతూ.. ‘‘ఆయన షూటింగ్‌లు చూస్తే చాలనుకునే రోజు నుంచి ఆయనకు యాక్షన్‌, కట్‌ చెప్పే అవకాశం వచ్చింది. అందుకు చిరంజీవిగారికి ధన్యవాదాలు.  ఈ సినిమాతో నాకో మంచి ‘ఆచార్య’ దొరికారు. ఈ సినిమా జర్నీలో ఒక గొప్ప మనిషిని కలిశాను.  అంతేకాదు, ‘ఆచార్య’ కోసం నాకన్నా టెక్నీషియన్లు, నా టీమ్‌ ఎంతో కష్టపడి పనిచేశారు. ఈ కథ చెబుతుంటే నిర్మాతగా వినటానికి రామ్‌చరణ్‌ వచ్చారు.  కానీ, సిద్ధ పాత్ర గురించి చెప్పగానే, వెంటనే ఒప్పుకొన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జరుగుతున్న సమయంలోనే నేను అడగగానే చరణ్‌ను డేట్స్‌ అడ్జెస్ట్‌ చేసి ఇచ్చిన రాజమౌళిగారికి ధన్యవాదాలు’’ అని అన్నారు.

పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘‘ఆచార్య’లో నీలాంబరి పాత్ర ఇచ్చినందుకు కొరటాల శివగారికి ధన్యవాదాలు. ఆ పాత్ర చాలా క్యూట్‌గా ఉంటుంది. చిరంజీవిగారిలో ఉండే స్వాగ్‌ మనలో కొంచెం ఉన్నా చాలు. చరణ్‌ సెట్‌లో చాలా కూల్‌గా ఉంటాడు. అయితే, యాక్షన్‌ చెప్పగానే ఆ పాత్రలో ఇమిడిపోతాడు’ అని చెప్పుకొచ్చింది.

‘‘కొరటాల శివ విలువలు చూపిస్తూ సినిమాలు చేస్తారు. ఆయనలో విలువలు ఉండబట్టే ఇలాంటి సినిమాలు తీయగలగుతున్నారు. ఈ సినిమాతో చరణ్‌ రూపంలో నాకొక తమ్ముడు దొరికాడు. చిరంజీవిగారికి కథ చెబుతున్నప్పుడు సడెన్‌గా చరణ్‌ పాత్ర కూడా వచ్చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చరణ్‌ చూసిన తర్వాత ఈ సినిమాలో ఒక మెట్టు పైనే ఉంటారు. చిరంజీవిగారు మా పెద్దన్నయ్య. చిన్నప్పటి నుంచి ఆయన్ను కలవాలని ఉండేది. కానీ, ఏకంగా సినిమానే తీశారు. డబ్బులు తీసుకోకుండా నటీనటులు ఈ సినిమా చేశారు’’ అని నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి, అవినాష్‌లు చెప్పుకొచ్చారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని