Chiranjeevi: మళ్లీ నా విశ్వరూపం చూపిస్తా: చిరంజీవి

‘నటుడిగా మళ్లీ నా విశ్వరూపాన్ని చూపిస్తా’ అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’ ప్రమోషన్స్‌లో భాగంగా చిరు, చరణ్‌....

Published : 28 Apr 2022 01:29 IST

హైదరాబాద్‌: ‘నటుడిగా మళ్లీ నా విశ్వరూపాన్ని చూపిస్తా’ అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’ ప్రమోషన్స్‌లో భాగంగా చిరు, చరణ్‌, కొరటాల శివతో దర్శకుడు హరీశ్‌శంకర్‌ స్పెషల్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. ‘ఆచార్య’ విశేషాలతోపాటు అవకాశం వస్తే తప్పకుండా పవన్‌ కల్యాణ్‌ ‘భవధీయుడు భగత్‌ సింగ్‌’లో నటిస్తానని చిరు చెప్పారు. అంతేకాకుండా, ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ నుంచి ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని చిరు లీక్‌ చేసేశారు.

పునాది రాళ్లు.. ఆరోజే అర్థమైంది

‘‘పునాది రాళ్లు’ సినిమా కోసం 1978 ఫిబ్రవరి 11న.. నేను మొదటిసారి కెమెరా ముందుకు వచ్చా. అందులో నాతోపాటు మరికొంతమంది ఆ సీన్‌లో ఉన్నారు. మేమంతా పొలం పనులు చేసి రాగానే, మహానటి సావిత్రమ్మ మాకు భోజనం వడ్డించే సీన్‌ అది. నా ప్లేస్‌ వచ్చే వరకూ నేను కెమెరా ముందు అలాగే నిల్చుని ఉండాలి. అది నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. వెంటనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో మాట్లాడి.. ఆ సీన్‌కి ముందు ఏ సీన్‌ వస్తుందో కనుక్కొని దానికి అనుగుణంగా నన్ను నేను కాస్త మార్చుకుని యాక్ట్‌ చేశాను. ఆ షాట్‌ పూరైన వెంటనే కెమెరామెన్‌ నన్ను పిలిచి.. ‘నీ పేరేంటి? నువ్వు బాగా చేస్తున్నావ్‌? ఈ షాట్‌లో నేను నిన్నే చూస్తూ ఉండిపోయా’ అని ప్రశంసించారు. ఆ మాటలకు నేనెంతో ఆనందించా. ‘నా పేరు చిరంజీవి’ అని చెప్పా. మన పాత్ర పరిధి మేరకు మనం వందశాతం నటించగలిగితే తప్పకుండా అందరూ ప్రశంసిస్తారని ఆరోజే అర్థమైంది’’

గ్లిజరిన్‌ వాడలేదు..!

‘‘సిద్ధ పాత్రలో చరణ్‌ ఉంటే బాగుంటుందని నాకు ముందు నుంచే ఆలోచన ఉంది. శివ కూడా అలాగే అనుకోవడం వల్ల మేమిద్దరం ఒకే స్క్రీన్‌పై నటించే అవకాశం వచ్చింది. ‘ఆచార్య’ చరిత్రలో నిలిచిపోయే సినిమా కావాలంటే ప్రతిక్షణం మేం మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రేక్షకుల్ని మెప్పించేలా ప్రతి సన్నివేశంలో నటించాలని నిర్ణయించుకున్నాం. అందుకు అనుగుణంగా మేం నటించాం. కానీ, ఓ సన్నివేశంలో చరణ్‌ నటన చూసి నేను నిజంగానే భావోద్వేగానికి గురయ్యా. చరణ్‌ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నా. ఆక్షణం మా ఇద్దరికీ కన్నీళ్లు వచ్చేశాయి. ఆ సీన్‌లో మేమిద్దరం గ్లిజరిన్‌ లేకుండానే కన్నీరు పెట్టుకున్నాం. సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ సీన్‌ చూసినప్పుడు ఎంతటి కఠినాత్ముడైనా కన్నీళ్లు పెట్టుకోక తప్పదు’’

‘అవన్నీ ఊహాగానాలు..!’
‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో బిజీగా ఉండటం వల్ల చరణ్‌ ‘ఆచార్య’ షూట్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభించాడు. దాంతో నేను ఓ సారి శివ దగ్గరకు వెళ్లి.. ‘శివా.. చరణ్‌ వల్ల సినిమా ఆలస్యమయ్యేలా ఉంది. కాబట్టి వేరే హీరోని సెలక్ట్‌ చేద్దామా?’ అని అడిగా. మాటైతే చెప్పగలిగాను గానీ నాకు ఎంతమాత్రం అది ఇష్టం లేదు. మనస్ఫూర్తిగా సిద్ధ పాత్రకు చరణ్‌ అయితేనే బాగుంటుందని గట్టిగా నమ్మా. కొరటాల శివ కూడా మార్చేందుకు ఇష్టపడలేదు. అయితే, అదే సమయంలో ‘ఆచార్య’లోకి వేరే హీరోని తీసుకున్నామని వరుస కథనాలు వచ్చాయి. అవన్నీ ఊహాగానాలు మాత్రమే’’

తొమ్మిదేళ్లు ఆమె బాధపడింది..!

‘‘చరణ్‌ నేనూ కలిసి నటిస్తే చూడాలని సురేఖ ఎన్నో కలలు కంది. నేను రాజకీయాల్లోకి వెళ్లడం.. చరణ్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఒకే సమయంలో జరిగింది. దాంతో మేమిద్దరం కలిసి నటించే అవకాశం లేకుండా పోయింది. అలా, సురేఖ తొమ్మిదేళ్లు బాధపడుతూనే ఉంది. మరలా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక.. ఆమె కోరిక మరోసారి జీవం పోసుకుంది. మేమిద్దరం పూర్తిస్థాయి పాత్రల్లో కలిసి నటిస్తే చూడాలనుకుంటున్నట్లు ఎన్నోసార్లు చెప్పింది. అలాంటి సమయంలోనే శివ ఓసారి ఈ కథతో వచ్చాడు. చరణ్‌, నేనూ ‘ఆచార్య’ సినిమాకి ఓకే అయ్యాక సురేఖతో ఈ విషయం చెప్పా. ‘‘నీ కోరిక చాలా బలమైంది. శివ చెప్పిన కథలో మేమిద్దరం నటిస్తున్నాం. ఇద్దరివీ వీరోచితమైన పాత్రలే. షూటింగ్‌ ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నా’’ అని సురేఖతో చెప్పగానే ఆమె కళ్లలో అంతులేని ఆనందం చూశా’’

చరణ్‌ని చూసి శెభాష్‌ అన్నా..!

‘‘‘చిరుత’ షూట్‌ బ్యాంకాంక్‌లో జరుగుతున్నప్పుడు ఓసారి నేనూ, సురేఖ సెట్‌కి వెళ్లాం. చరణ్‌ నల్లగా  ఎండకు కమిలిపోయి ఉన్నాడు. వాడిని అలా చూసి సురేఖ బాగా బాధపడింది. నాకు మాత్రం ‘వావ్‌ కష్టపడుతున్నాడు’ అని భావన కలిగింది. వెంటనే చరణ్‌ దగ్గరకు వెళ్లి ‘శెభాష్‌’ అన్నా. ఎన్ని సినిమాలు చేశాడు? ఎంత బాగా నటించాడు? అనేది మేటర్‌ కాదు. చేస్తున్న పాత్రలోకి పరకాయం ప్రవేశం చేసి కష్టపడుతున్నాడా? లేదా? అనేది ముఖ్యం. నేను అలాగే కష్టపడ్డా. నా బిడ్డ చరణ్‌ కూడా అదేవిధంగా కష్టపడి ఇంటికి వస్తాడు’’ 

మళ్లీ నా విశ్వరూపం చూపిస్తా..!

‘‘సినిమాల నుంచి కాస్త బ్రేక్‌ తీసుకుని తొమ్మిదేళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం, మరలా సినిమాల్లోకి వచ్చాక కూడా సీరియస్‌ సబ్జెక్ట్‌లు చేయడం వల్ల నేను నవ్వడం మర్చిపోయా. ‘నాలో హాస్యగ్రంథులు చచ్చిపోయాయా?’ అని అప్పుడప్పుడూ నాకే అనుమానం వస్తుంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ‘దొంగ మొగుడు’, ‘రౌడీ అల్లుడు’ లాంటి కథలు వస్తే తప్పకుండా మళ్లీ నా విశ్వరూపం చూపిస్తా. ఇలాంటి కథలు హరీశ్‌ శంకర్‌ డైరెక్ట్‌ చేస్తే తప్పకుండా నేను నటిస్తా’’ 

ఆ కాంబోకి ఇది నాంది..!

‘‘చిరు-చరణ్‌-పవన్‌కల్యాణ్‌ ఈ కాంబో కోసం ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. ఆ కాంబోకి చరణ్‌-చిరు కాంబో ఇప్పుడు నాంది అవుతుందని నేను భావిస్తున్నా. హరీశ్‌శంకర్‌ తెరకెక్కిస్తోన్న ‘భవధీయుడు భగత్‌ సింగ్’లో అవకాశం ఉంటే తప్పకుండా నేనూ-చరణ్‌ నటిస్తాం’’

అందరూ అదరగొడుతున్నారు..!

‘‘ఇప్పుడున్న జనరేషన్‌లో హీరోలందరూ డ్యాన్స్‌ అదరగొడుతున్నారు. ముఖ్యంగా బన్నీ, తారక్‌, నితిన్‌, రామ్‌ చాలా బాగా డ్యాన్స్‌ చేస్తున్నారు. (మధ్యలో చరణ్‌ అందుకుని నా దృష్టిలో తారక్‌, బన్నీ బెస్ట్‌ డ్యాన్సర్స్‌‌). ఇంకో విషయం ఏమిటంటే ఒకవేళ నా సినిమాల్లో ఏదైనా చిత్రాన్ని ఇప్పుడు తెరకెక్కించాలంటే ‘చంటబ్బాయ్‌’ చిత్రాన్ని బన్నీ తీస్తే బాగుంటుందని అనుకుంటున్నా’’

మెగా లీక్‌..!

‘‘విలన్‌పై పోరాటం చేయడానికి ఓ లక్షమంది విద్యార్థులతో పవన్‌కల్యాణ్‌ రోడ్డెక్కుతాడు. అది చూసిన విలన్‌.. ‘ఏంటయ్యా వీడి ధైర్యం. ఆ లక్ష మంది వీడి వెనుక ఉన్నారనా?’ అని ప్రశ్నించగానే.. విలన్‌ పక్కనే ఉన్న ఓ వ్యక్తి.. ‘లేదు సర్‌. ఆ లక్ష మంది ముందు ఈయన ఉన్నాడని వాళ్లకు ధైర్యం’ అని చెబుతాడు’’ ఈ డైలాగ్‌ ఇటీవల హరీశ్‌ నాతో చెప్పాడు. నాకెంతో నచ్చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని