Garikapati-Chiranjeevi: ఆ వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు..

‘అలయ్‌ బలయ్‌’ వేదికగా చిరంజీవిని(Chiranjeevi) ఉద్దేశిస్తూ ప్రఖ్యాత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు (Garikapati Narasimha Rao) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా చిరంజీవి పెదవి విప్పారు.

Updated : 13 Oct 2022 15:37 IST

హైదరాబాద్‌: ‘అలయ్‌ బలయ్‌’ వేదికగా చిరంజీవిని(Chiranjeevi) ఉద్దేశిస్తూ ప్రఖ్యాత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు (Garikapati Narasimha Rao) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ‘చిరు ఫొటో సెషన్‌ ఆపకపోతే.. కార్యక్రమం నుంచి వెళ్లిపోతా’ అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన మెగా అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆయనకు వ్యతిరేకంగా వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో  విలేకర్ల సమావేశంలో గరికపాటి వివాదంపై చిరు స్పందించారు. ‘‘ఆయన పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు’’ అని తెలిపారు. చిరు స్పందనతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లైనంది.

80శాతం పారితోషికం తిరిగి ఇచ్చేశాం..!

‘గాడ్‌ఫాదర్‌’ సక్సెస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ‘ఆచార్య’ ఫ్లాప్‌, తదుపరి సినిమాలపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మేము నటించిన ఏదైనా సినిమా ఫ్లాప్‌ అయితే దాని పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం. ‘ఆచార్య’ ఫ్లాప్‌ అయినందుకు నేను ఏమీ బాధపడలేదు. ఆ సినిమా పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను, చరణ్‌.. 80 శాతం పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సక్సెస్‌ కంటే ‘గాడ్‌ఫాదర్‌’ సక్సెస్‌నే చరణ్‌ ఎక్కువగా ఆస్వాదిస్తున్నాడు’’

వింటేజ్‌ డేస్‌..!

‘‘ప్రస్తుతం నేను చేస్తోన్న సినిమాలన్నీ వచ్చే ఏడాది వేసవి నాటికి విడుదలవుతాయి. మార్చి నుంచి కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తా. బాబీ సినిమాలో నా రోల్ ఫుల్‌ మాస్‌ లుక్‌లో ఉంటుంది. సంభాషణలన్నీ తూర్పుగోదావరి జిల్లా యాసలో ఉంటాయి. ప్రేక్షకులు తప్పకుండా ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంటారు. ‘వాల్తేరు వీరయ్య’ అనే పేరు నేనే పెట్టా. ఆ టైటిల్ వెనక సంగతి సమయం వచ్చినప్పుడు చెబుతా.  మోషన్‌ పోస్టర్‌ని దీపావళి రోజున విడుదల చేస్తాం’’ అని తెలిపారు.

ఆదరణ అలానే ఉంది..

‘‘రాజకీయ పార్టీ (ప్రజారాజ్యం) లేకపోవటం వల్ల బాగానే ఉన్నా. ఒకవేళ ఆ పార్టీ కొనసాగి ఉండుంటే తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకదానికే పరిమితమయ్యేవాణ్ని. నటుడిగా గతంలో ఎలాంటి ఆదరణ ఉందో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడూ అదే ఆదరణ ఉంది.

అలా చేయకపోతే ఇబ్బందే..

మలయాళం సినిమాలు తక్కువ బడ్జెట్‌తో చిన్న పాయింట్‌తో తెరకెక్కుతాయి. మన దగ్గర ఆ బడ్జెట్‌, మార్కెట్‌కు సంబంధం ఉండదు. అక్కడి కథలకు మార్పులు చేసుకోకపోతే మార్కెట్ పరంగా నిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతాయి’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని