Rajasekhar: ఆ సినిమా కోసం రాజశేఖర్‌ను రికమెండ్‌ చేసిన చిరంజీవి

Rajasekhar: తాను నటించాలనుకున్న ఓ చిత్రానికి హీరోగా రాజశేఖర్‌ను సూచించారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఇంతకీ ఆ చిత్రం ఏంటో తెలుసా?

Updated : 03 Jan 2023 13:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి చిత్ర పరిశ్రమలో ఒకరు చేయాల్సిన సినిమాను అనివార్య కారణాల వల్ల మరొక హీరో చేసిన సందర్భాలు అనేకం. అలాగే, తమ వద్దకు వచ్చిన కథలను కొందరు నటులు మరొకరు చేస్తే బాగుంటుందని దర్శక-నిర్మాతలకు సూచిస్తారు. అలా అప్పట్లో ఓ చిత్రం కోసం చిరంజీవి (Chiranjeevi) తన సహ నటుడు, స్నేహితుడు అయిన రాజశేఖర్‌ (rajasekhar)ను రెకమెండ్‌ చేశారు. అదే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘న్యాయం కోసం’ (nyayam kosam). మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఒరు సీబీఐ డైరీ కురిప్పు’ అనే మలయాళ చిత్రం ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇందులో సీబీఐ ఆఫీసర్‌ పాత్ర చేయాల్సిన చిరంజీవి స్వయంగా ఆ పాత్రకు రాజశేఖర్‌ను రికమెండ్‌ చేశారు.

‘ఒరు సీబీఐ డైరీ కురిప్పు’ చిత్రం అప్పట్లో మద్రాసులో విడుదలై సంచలనం సృష్టించింది. ఆ చిత్రం గురించి నటుడు రాజశేఖర్‌ విని తన నిర్మాతలలో ఎవరితోనైనా ఆ చిత్రం హక్కులు కొనిపించి ఆ సినిమాలో నటించాలనుకున్నారు. అయితే, అప్పటికే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఆ హక్కుల్ని కొనేశారని రాజశేఖర్‌కు తెలిసింది. దాంతో చిరంజీవితోనే ఆ సినిమా తీస్తారని ఊహించి రాజశేఖర్‌ నిరాశ చెందారు. తర్వాత ఆ సినిమా చూసి, చిరంజీవి లక్కీ పర్సన్‌, అని మనసులోనే అనుకుని, ఆ విషయాన్ని మర్చిపోయారు.

కొన్నిరోజులకు ఒక చిత్రం శతదినోత్సవ వేడుక సభలో రాజశేఖర్‌, అల్లు అరవింద్‌ (allu aravind) కలుసుకున్నారు. మాటల మధ్యలో ‘ఒరు సీబీఐ డైరీ కురిప్పు’ చిత్రం హక్కులు తానుకొన్న సంగతి చెప్పి, అందులో ‘నటిస్తావా’ అని రాజశేఖర్‌ని అడిగారు అల్లు అరవింద్‌. ఆ ఒక్క మాటతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ తన అంగీకారాన్ని తెలిపారు. ఆ చిత్రం షూటింగ్‌ పూర్తయిన తర్వాత అరవింద్‌తో ‘మీరు రైట్స్‌ కొన్నారని తెలియగానే చిరంజీవిగారితోనే సినిమా తీస్తారని అనుకున్నా. ఇంతమంచి క్యారెక్టర్‌ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్‌’’ అంటూ రాజశేఖర్‌ కృతజ్ఞత చెప్పారు. వెంటనే అరవింద్‌ నవ్వి ‘మొదట చిరంజీవితోనే తీద్దామనుకున్నాం. కానీ, ఆయనకి కాల్షీట్ల సమస్య. ఏం చేద్దామా? అని ఆలోచిస్తుంటే చిరంజీవే స్వయంగా మీ పేరు సజెస్ట్‌ చేశారు’ అన్నారు. ఆ తర్వాత చిరంజీవిని కలిసిన రాజశేఖర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని ‘న్యాయంకోసం’ అభినందన సభలో రాజశేఖర్‌ స్వయంగా పంచుకోవడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని