Chiranjeevi: రోజా వ్యాఖ్యలపై చిరంజీవి రియాక్షన్‌

మెగా ఫ్యామిలీ ఎవరికీ సాయం చేయదంటూ ఇటీవల నటి రోజా (Roja) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తాజాగా చిరంజీవి (Chiranjeevi) స్పందించారు.

Published : 12 Jan 2023 18:36 IST

హైదరాబాద్‌: మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ ఏపీ మంత్రి రోజా (Roja) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై తాను మాట్లాడాలనుకోవడం లేదని.. తాను చేస్తోన్న సేవలకు సీసీటీ, బ్లడ్‌బ్యాంక్‌, ఆక్సిజన్‌ బ్యాంక్.. వంటివి నిలువెత్తు నిదర్శనాలని ఆయన చెప్పారు. ఈ మేరకు తన తదుపరి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన రోజా చేసిన విమర్శలపై స్పందిస్తూ..

‘‘ఆ సమయానికి ఆమె అలా అనాల్సి వచ్చిందేమో. ఆమె చేసిన వ్యాఖ్యల గురించి నేను ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. నేను ఎలాంటి సేవలు చేశాను, చేస్తున్నాను అనే దానికి సీసీటీ, బ్లడ్‌బ్యాంక్, ఆక్సిజన్‌ బ్యాంక్‌ నిలువెత్తు సమాధానాలు. వాళ్ల వ్యాఖ్యలకు సమాధానం చెప్పడం అనేది నా స్థాయిని నేనే తగ్గించుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడైనా, లేదా ఇప్పుడైనా.. ఎదుటి వారు నాపై ఎలాంటి విమర్శలు చేసినా వాటిపై స్పందించాలనుకోలేదు. ఎందుకంటే వాళ్లు నాతోపాటు నటించారు. భావోద్వేగాలను పంచుకున్నారు. మా ఇంటికి వచ్చారు. మాతో కలిసి భోజనం చేశారు. సొంతవారిలా కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ల నైజం ప్రకారం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలపై స్పందించడం నా నైజం కాదు. వాళ్లు ఏం మాట్లాడినా అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రేమ, వాత్సల్యానికి విలువనిచ్చే మనిషిని నేను. వాళ్లకు కౌంటర్లు విసిరి, వాళ్లను తగ్గించేసి.. నా సెంటిమెంట్‌ను బ్రేక్ చేసుకోలేను. వాళ్లతో అనుబంధాన్ని ఎప్పుడూ పదిలంగానే చూసుకుంటా. ఇంకా ఏం మాట్లాడతారో మాట్లాడనివ్వండి. ప్రేమాభిమానాలకు విలువే లేదా? ఇంతేనా ఈ ప్రపంచం? ఎలాంటి లబ్ధి కోసం, ఎవరి కరుణ పొందాలని వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు? వీళ్లకు పరిణతి ఎప్పుడు వస్తుంది? రాజకీయాలంటే ఇలాగే ఉండాలా? వేరేలా ఉండకూడదా? అని అనిపిస్తుంటుంది’’ అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని