Chiranjeevi: అల్లు కుటుంబంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా: చిరంజీవి

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ (Allu Studios) ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం వేడుకగా జరిగింది. 

Updated : 01 Oct 2022 12:51 IST

హైదరాబాద్‌: ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ (Allu Studios) ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది. అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా పాల్గొని ఈ స్టూడియోని ప్రారంభించారు.

‘‘మా మామయ్య అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నా. ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ కొద్దిమందికి మాత్రమే ఇలాంటి ఘనత లభిస్తుంది. అరవింద్‌, బన్నీ, శిరీశ్‌‌‌, బాబీ.. సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారంటే కారణం కొన్నిదశాబ్దాల క్రితం పాలకొల్లులో ఆయన మదిలో మెదిలిన ఓ చిన్న ఆలోచన. నటనపై ఉన్న మక్కువతో మద్రాసు వెళ్లి.. నటుడిగా మంచి స్థానాన్ని సొంతం చేసుకోవాలని ఆయనకు వచ్చిన ఆలోచన ఇప్పుడు పెద్ద వ్యవస్థగా మారింది. దానికి ప్రతిక్షణం అల్లు వారసులు ఆయన్ని తలచుకుంటూనే ఉండాలి. ఈ స్టూడియో ఒక స్టేటస్‌ సింబల్‌. అల్లు అనే బ్రాండ్‌తో అల్లు రామలింగయ్య పేరును తరతరాలు గుర్తించుకునేలా.. దీన్ని నిర్మించారు. ఈ కుటుంబంలో నేను కూడా భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా’’ అని చిరంజీవి వివరించారు.

అనంతరం అల్లు అర్జున్‌ (Allu Arjun) మాట్లాడుతూ.. ‘‘ఇవాళ మా తాతయ్య 100వ పుట్టినరోజు. మాకెంతో ప్రత్యేకం. అల్లు అరవింద్‌కు అగ్ర నిర్మాణ సంస్థ ఉంది.. స్థలాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. స్టూడియో పెట్టడం పెద్ద సమస్య కాదు అని కొందరు అనుకొని ఉండొచ్చు. కానీ, డబ్బు సంపాదించడం కోసం మేము ఈ స్టూడియోని నిర్మించలేదు. ఇది మా తాతయ్య కోరిక. ఆయన జ్ఞాపకార్థం దీన్ని నిర్మించాం. ఇక్కడ సినిమా షూటింగ్స్‌ బాగా జరగాలని, పరిశ్రమకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నా’’ అని  అల్లు అర్జున్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని