Chiranjeevi: నిర్మాతల డబ్బును బుట్టదాఖలు చేయవద్దు.. దర్శకులకు చిరంజీవి సూచన

Chiranjeevi: తెలుగు సినీ దర్శకులు అగ్ర కథానాయకుడు చిరంజీవి కీలక సూచన చేశారు. నిర్మాతల డబ్బును బుట్టదాఖలు చేయకుండా జాగ్రత్తగా సినిమా తీయాలని సూచించారు.

Published : 15 Jan 2023 01:21 IST

హైదరాబాద్‌: నిర్మాతల డబ్బును బుట్టదాఖలు చేయవద్దని, సినిమాకు కావాల్సినవన్నీ పేపర్‌వర్క్‌లోనే పూర్తి చేసేయాలని అగ్ర కథానాయకుడు చిరంజీవి దర్శకులకు సూచించారు. సినీ పరిశ్రమ బాగుండాలని దర్శకులు గుర్తించాలన్నారు. నిర్మాతలు బాగుంటేనే నటీనటులు బతుకుతారని హితవు పలికారు. చిరంజీవి (Chiranjeevi), రవితేజ (Ravi teja) కీలక పాత్రల్లో బాబీ దర్శకత్వం వహించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌ సక్సెస్‌మీట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ‘‘వాల్తేరు వీరయ్య’ విజయంతో నా మాటలు కొరవడ్డాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మనం మాట్లాడటం ఆపేసి ప్రేక్షకులు మాటలు విద్దాం. ప్రేక్షకుల ఉత్సాహమే మన ఇంధనం. సినిమా యూనిట్ అంతా థియేటర్లకు వెళ్లాలి. నేను కష్టపడలేదు, నా బాధ్యతగా అనుకుని పనిచేశా. కష్టం నాది, రవితేజది కాదు... సినిమా బాగా రావాలని పనిచేసిన వారిది. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పనిచేసిన కార్మికులది. మన మీదతో జాలితో కాదు... సినిమాపై ప్రేమతో కష్టపడ్డ కార్మికుల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలి. విజయాలు వస్తుంటాయి పోతుంటాయి, కార్మికుల కష్టం తెలియాలి. బాబీ చెప్పిన కథ  అందరికీ నచ్చింది. ఆ తర్వాత పర్సనల్‌గా మాట్లాడాలని బాబీని నా గదికి తీసుకెళ్లా. ‘ఈ కథ జస్ట్‌ బిలో యావరేజ్‌. ఇది ఒక ముడి వజ్రం. ఇది పెట్టుకుని మనం ఏమీ చేయలేం. దీనిని అందమైన ఆభరణంగా మార్చాలి. చాలా కష్టపడాలి. నువ్వు స్క్రిప్ట్‌ పూర్తి చేసిన ప్రతిసారీ నాకు చెప్పు. నచ్చితే ముందుకు వెళ్దాం. లేకపోతే మళ్లీ మార్పులు చేసుకుని రావాలి’ అన్నప్పుడల్లా ఛాలెంజ్‌గా తీసుకున్నాడు. ఇలా చెబితే, ఎవరికైనా అహం అడ్డువస్తుంది. ఇంతకన్నా బాగా ఉంటుందా? అని సంతృప్తిపడిపోతారు. అలా జరిగితే, దాంతో స్థాపితం అయిపోయినట్లే. కానీ, బాబీ అలా చేయకుండా ప్రతి సీన్‌ను సంపూర్ణం అయ్యేలా మార్పులు చేసుకుంటూ వెళ్లాడు. నిజంగా ఇదొక కేస్‌ స్టడీగా యువ దర్శకులు చూడాలి’’

‘‘కోర్టులో ప్రకాశ్‌రాజ్‌ తలనరకడానికి కావాల్సిన బలమైన కారణం కనపడటం లేదు’ బాబీకి అని చెప్పా. మళ్లీ టీమ్‌ అంతా కూర్చొని మార్పులు చేశారు. అదే విషయం నాకు చెబితే, ‘అది కూడా సరిపోదు. తలనరికేంత కోపం రావాలంటే ఇంకేదో వర్క్‌ చేయాలి’ అన్నాను. రాత్రి 2గంటల వరకూ కూర్చొన్ని ఇంకొన్ని మార్పులు చేశారు. అప్పుడు ఓకే చెప్పా. 44 సంవత్సరాల అనుభవానికి బాబీ విలువ ఇవ్వడం అతని గొప్పతనం. ‘ఇది నా కథ. ఆర్టిస్ట్‌లుగా వాళ్లు చెప్పేదేంటి? నేను ఎలా చెబితే అలా నటించాలి’ అన్న గర్వం అతనిలో లేదు. అందరూ కలిసి కథకు సరెండర్‌ అయ్యారు. అందుకనే అనుభవం ఉన్న వ్యక్తులు అనుమానం వ్యక్తం చేస్తే, విలువ ఇచ్చి, మార్పులు చేశాడు. సినిమాలో అదనంగా సీన్స్‌ ఉంటే, ఆ పేపర్‌లను చింపేసి పారేయమని చెప్పేవాడిని. అనవసరంగా సీన్లు తీసి, నిర్మాతల డబ్బు, సమయాన్ని బుట్టదాఖలు చేయొద్దని చెప్పా. ఇలా చెబితే వినేవాళ్లు ఇప్పుడు తగ్గిపోయారు. ‘అరగంట సినిమా ఎడిటింగ్‌ రూమ్‌లో పక్కన పడేశాం’ అనే మాటలు వింటూనే ఉన్నాం. మా సినిమా ఏడున్నర నిమిషాలు.. మహా అయితే, పది నిమిషాలు పక్కన పెట్టాం. యాక్షన్‌ సన్నివేశాల్లో కాస్త ఎక్కువ తీశాం తప్ప, నిర్మాతలకు నయా పైసా వృథా కాలేదు’’

‘‘నేను అనే మాటలకు చిన్నా, పెద్ద దర్శకులు హర్ట్‌ అవుతారేమో, ‘సినిమా అంటే సూపర్‌ డూపర్‌ హిట్ ఇవ్వడం కాదు.. నిర్మాతలకు చెప్పిన బడ్జెట్‌లో పూర్తి చేసి ఇవ్వాలి. అదే మొదటి సక్సెస్‌. కొత్త టెక్నాలజీ వాడి పనితనం చూపించే కంటే, కథను నమ్మి సాధారణ కెమెరాతోనూ గొప్ప సినిమా తీయాలి. ఏదైనా అవసరం మేరకు తీసుకోవాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే, బాధ్యత తీసుకునేవాళ్లు, అది గుర్తించాల్సిన వాళ్లు దర్శకులు మాత్రమే. ప్రతి వాళ్లు ఆలోచించాలి. నేను ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడటం లేదు. దీన్ని మీడియా వేరే వాళ్లకు, వాటికి ఆపాదించవచ్చు. సత్తా ఉన్నా దర్శకులు ఒక సినిమాకు ఎక్కువ సన్నివేశాలు తీస్తే, దాన్ని పార్ట్‌-2 మలుచుకోగలుగుతున్నారు. అలా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘బాహుబలి’ చిత్రాలకు కుదిరింది. ఇవన్నీ మాట్లాడి కొంచెం క్లాస్‌ ఎక్కువ తీసుకున్నాననుకుంటా. ఏదేమైనా నిర్మాతలు బాగుండాలి. వాళ్లు బాగుంటేనే మళ్లీ సినిమాలు చేస్తారు. నా తమ్ముడు రవితేజ లేకపోయుంటే, ఈ సినిమా సెకండాఫ్‌లో ఇంత అందం వచ్చేది కాదు. ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పక్కర్లేదు. మంచి సినిమా ఇచ్చినందుకు వాళ్లే థ్యాంక్స్‌ చెబుతున్నారు.’’ అని చిరంజీవి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని