అభిమానులు దర్శకులై.. ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ కామన్‌ పాయింట్స్‌ ఇవే!

బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి హీరోగా బాబీ రూపొందించిన ‘వాల్తేరు వీరయ్య’ ఈ సంక్రాంతికి సందడి చేయనున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఆసక్తికర విశేషాలేంటంటే..

Published : 11 Jan 2023 18:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ అగ్ర హీరోలు చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) తమ చిత్రాలతో బాక్సాఫీసు వద్ద పోటీపడడం కొత్తేమీ కాదు. 1985 నుంచి వీరిద్దరి మధ్య ‘సంక్రాంతి వార్‌’ (Sankranthi Movies) మొదలైంది. ఈ ఇద్దరు తలపడబోతున్నారన్న ప్రతిసారి వారి అభిమానులు, ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంటుంది. ఈ నటుల అభిమానులే సినిమాలను తీయడంతో ఈసారి అంతకుమించిన అంచనాలు ఏర్పడ్డాయి. ఆ ఫ్యాన్స్‌ కథ, రెండు సినిమాల్లో ఉన్న కామన్‌ పాయింట్లు ఏంటంటే?

వీరాభిమానులు.. ఇప్పుడు దర్శకులు

పలు చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) ‘డాన్‌శీను’తో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఆ తర్వాత ‘బాడీగార్డ్‌’, ‘బలుపు’, ‘పండగ చేస్కో’, ‘విన్నర్’, ‘క్రాక్‌’ సినిమాలను తెరకెక్కించారు. 2010లో డైరెక్టర్‌గా ప్రయాణం ప్రారంభించిన ఆయనకు దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఫేవరెట్‌ యాక్టర్‌ బాలకృష్ణతో సినిమా తీసే అవకాశం లభించింది. అదే ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). 1999లో విడుదలైన బాలకృష్ణ సినిమా ‘సమరసింహారెడ్డి’ మార్నింగ్‌, మ్యాట్నీ షో మిస్‌ అయినందుకు ఎంతో బాధపడ్డ ఫ్యాన్‌.. అదే హీరోతో సినిమా తీసే అవకాశం వస్తే? ఏం చేస్తాడో గోపీచంద్‌ అదే చేశారని బాలయ్య లుక్స్‌, ప్రచార చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి. (థియేటర్‌ వద్ద గొడవ జరగడంతో గోపీచంద్‌ డే షోలు మిస్‌ అయి నైట్‌ షో చూశారట) చిత్రీకరణ సమయంలో ఓ కంటితో అభిమానిగా, మరో కంటితో దర్శకుడిగా బాలయ్యను చూశానని ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గోపీచంద్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన అభిమాని అయిన గోపీచంద్‌తో గొప్ప సినిమా చేయడం గర్వంగా ఉందని బాలకృష్ణ అదే వేడుకలో తెలిపారు.

మరో దర్శకుడు కె. బాబీ (KS Ravindra).. చిరంజీవికి పెద్ద అభిమాని. ‘ఇంద్ర’ సినిమా ప్రభావం తనపై ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్‌కు వచ్చేసిన బాబీ ఆ చిత్ర రచయిత చిన్నికృష్ణ దగ్గర కొంతకాలం పనిచేశారు. ఓసారి రక్తదానం చేసేందుకు గీతా ఆర్ట్స్‌ ఆఫీసుకు వెళ్లగా తానప్పటికి బలహీనంగా ఉండడంతో బాబీని తిరస్కరించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన చిరంజీవితో బాబీ ఫొటో దిగారు. అయితే, ఆ ఫొటోలో చిరు సీరియస్‌గా చూస్తూ కనిపించారని, మళ్లీ ఆయనతో కలిసి ఫొటో దిగాలనిపించేదని ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) మీట్‌లో బాబీ వివరించారు. ఆ మాటవినగానే కుర్చీలోంచి లేచి బాబీకు ముద్దిస్తూ చిరు ఫొటోలకు పోజిచ్చారు. ‘నా అభిమానికావడం వల్లే బాబీకి నేను అవకాశం ఇవ్వలేదు. కష్టపడి పనిచేసే అతని వ్యక్తిత్త్వం చూసి ఇచ్చా. ఆయనకు నేను అభిమానినయ్యా’ అని మరో వేడుకలో వెల్లడించారు. దర్శకుడు మలినేని గోపీచంద్‌ తెరకెక్కించిన ‘డాన్‌ శీను’, ‘బాడీగార్డ్‌’సహా పలు చిత్రాలకు స్క్రీన్‌ప్లే రాసిన బాబీ ‘పవర్‌’తో 2014లో డైరెక్టర్‌ అయ్యారు. అనంతరం, ‘సర్దార్ గబ్బర్‌సింగ్‌’, ‘జై లవకుశ’, ‘వెంకీమామ’ తెరకెక్కించారు. తన ఫేవరెట్‌ స్టార్‌తో తీసిన ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ట్రైలర్‌తోనే అభిమానులకు ‘పూనకాలు’ తెప్పించిన ఈ చిరు ఫ్యాన్‌ కమ్‌ డైరెక్టర్‌ సినిమాను ఎలా తీశారో తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

ఒకే హీరోయిన్‌..

ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసనే (Shruti Haasan) కథానాయికగా నటించారు. ‘వాల్తేరు వీరయ్య’ సరసన శ్రీదేవిగా, ‘వీరసింహారెడ్డి’లో ఈషా అనే పాత్రలో కనిపిస్తారు. రెండూ చలాకీ పాత్రలేనని పాటలు, ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది. ఒకే హీరోయిన్‌ నటించిన రెండు పెద్ద చిత్రాలు సంక్రాంతి సీజన్‌కు విడుదలవడం అరుదు. అటు చిరు, ఇటు బాలయ్యతో శ్రుతిహాసన్‌కు ఇదే తొలి చిత్రం. మరోవైపు, ‘బలుపు’, ‘క్రాక్‌’ తర్వాత గోపీచంద్‌- శ్రుతి కాంబోలో తెరకెక్కిన మూడో చిత్రంగా ‘వీరసింహారెడ్డి’ నిలవనుంది. బాబీ దర్శకత్వంలో శ్రుతి నటించడం ఇదే తొలిసారి.

ఒకటే నిర్మాణ సంస్థ..

ఈ రెండు సినిమాలకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. నిర్మాణ సంస్థ (Mythri Movie Makers). రెండింటినీ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవి శంకర్‌లు నిర్మించారు. ‘వాల్తేరు వీరయ్య’కు సుమారు రూ. 140 కోట్లు, ‘వీరసింహారెడ్డి’కి దాదాపు రూ.110 కోట్ల బడ్జెట్‌ పెట్టారు. ఒకే నిర్మాణ సంస్థలో రూపొందిన రెండు చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండడం, పైగా సంక్రాంతి బరిలో నిలవబోతుండడం టాలీవుడ్‌లో ఇదే ప్రథమం. ఈ బ్యానర్‌లో చిరు, బాలయ్య నటించడం ఇదే తొలిసారి.

పాటలు.. మెరుపులు

రెండు చిత్రాల్లోనూ హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేసే పాట (జై బాలయ్య.. జై బాలయ్య, వాల్తేరు వీరయ్యలో వీరయ్య), ఐటెమ్‌ సాంగ్‌ (మా బావ మనోభావాలు, బాస్‌ పార్టీ) కామన్‌. ‘మా బావ మనోభావాలు’ (వీరసింహారెడ్డి)లో ఆస్ట్రేలియన్‌ నటి చంద్రికా రవి (Chandrika Ravi).. బాలకృష్ణతో కలిసి స్టెప్పులేశారు. అదే పాటలో హనీరోజ్‌ (Honey Rose) కూడా కనిపిస్తారు. చిరంజీవి, బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) కలిసి డ్యాన్స్‌ చేసిన స్పెషల్‌ సాంగే ‘బాస్‌ పార్టీ’ (వాల్తేరు వీరయ్య). వీటితోపాటు మెలొడీ, హుషారైన గీతాలు రెండింటిలోనూ ఉన్నాయి. ‘వీరసింహారెడ్డి’కి  ముందు బాలకృష్ణతో కలిసి సంగీత దర్శకుడు తమన్‌ ‘డిక్టేటర్‌’, ‘అఖండ’ చిత్రాలకు పనిచేశారు. ‘వాల్తేరు వీరయ్య’కు ముందు చిరంజీవి- మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో ‘శంకర్‌దాదా: ఎంబీబీఎస్‌’, ‘శంకర్‌దాదా: జిందాబాద్‌’, ‘అందరివాడు’, ‘ఖైదీ నంబర్‌. 150’ చిత్రాలొచ్చాయి.

ఎవరెవరున్నారు? సినిమా నిడివి ఎంతంటే?

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’లో కన్నడ నటుడు దునియా విజయ్‌ విలన్‌. ఆయన భార్య పాత్రను వరలక్ష్మీ శరత్‌కుమార్ పోషించారు. రవిశంకర్‌, నవీన్‌ చంద్ర, మురళీ శర్మ, అజయ్‌ ఘోష్‌, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. U/A సర్టిఫికెట్‌ పొందిన ఈ సినిమా నిడివి 2: 49 గంటలు. యాక్షన్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ నిడివి 2 గంటల 40 నిమిషాల 30 సెకన్లు. ఈ సినిమాకీ U/A సర్టిఫికెట్‌ జారీ చేసింది సెన్సార్ బోర్డు. హీరో రవితేజ (Ravi Teja) కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో కేథరిన్‌, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, బాబీ సింహా, నాజర్‌, వెన్నెల కిశోర్‌, సప్తగిరి, షకలక శంకర్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించారు.

టెక్నిషియన్స్‌..

వీరసింహారెడ్డి: కథ, స్క్రీన్‌ప్లే: గోపీచంద్‌ మలినేని, మాటలు: సాయి మాధవ్‌ బుర్రా, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబి, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌: ఎ. ఎస్‌. ప్రకాశ్‌, ఫైట్లు: రామ్‌- లక్ష్మణ్‌, వి. వెంకట్‌, కొరియోగ్రఫీ: శేఖర్‌ మాస్టర్‌, శంకర్‌.

వాల్తేరు వీరయ్య: కథ, మాటలు: బాబీ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, కె. చక్రవర్తిరెడ్డి, సాహిత్యం: దేవిశ్రీ ప్రసాద్‌, చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, రోల్‌ రైడా, సినిమాటోగ్రఫీ: ఆర్థర్‌ ఎ విల్సన్‌, ఎడిటర్‌: నిరంజన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఎ. ఎస్‌. ప్రకాశ్‌, ఫైట్లు: రామ్‌- లక్ష్మణ్‌, కొరియోగ్రఫీ: శేఖర్‌ మాస్టర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని