Dhanush: ధనుష్‌ రెమ్యునరేషన్‌.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?

సినీ తారల పారితోషికాల గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంటుంది. ఒకప్పుడు నాలుగైదు కోట్ల పారితోషికం అంటే ‘వామ్మో’ అనుకునేవారు. కానీ, ఇప్పుడు చాలా మంది అగ్ర తారలు

Published : 17 Aug 2022 01:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ తారల పారితోషికాల గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంటుంది. ఒకప్పుడు నాలుగైదు కోట్ల పారితోషికం అంటే ‘వామ్మో’ అనుకునేవారు. కానీ, ఇప్పుడు చాలా మంది అగ్ర తారలు రెండంకెలకు ఏమాత్రం తగ్గకుండా పారితోషికం తీసుకుంటున్నారు. ఈ విషయంలో తమిళ నటుడు ధనుష్‌ ఒక అడుగు ముందే ఉన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఈయన కూడా ఒకరు. ప్రస్తుతం ధనుష్‌ నటించిన చిత్రం ‘తిరుచిత్రాంబళం’. తెలుగులో ‘తిరు’ పేరుతో ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు ధనుష్ రూ.12 నుంచి 15కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్‌ టాక్‌. మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా రాశీఖన్నా, ప్రియా భవానీ శంకర్‌ నటించగా, నిత్యామేనన్‌ కీలక పాత్ర పోషించారు.

2002లో కెరీర్‌ మొదలు పెట్టిన ధనుష్ ఈ 20ఏళ్లలో అంచెలంచెలుగా ఎదిగి హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ధనుష్‌ నటించిన చిత్రాలేవీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేదు. ‘కర్ణన్‌’ ఒక్కటే మెప్పించింది. ‘పటాస్‌’, ‘ది గ్రేమ్యాన్’, ‘జగమేతంత్రం’ పెద్దగా మెప్పించలేదు. ప్రస్తుతం ధనుష్ ఆశలన్నీ ‘తిరు’పైనే. ఈ సినిమా ప్రచార చిత్రాలు చూస్తుంటే.. ఫీల్‌గుడ్‌ మూవీలా జవహర్‌ దీన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ‘‘తిరు’పై ఎంత అంచనాలున్నాయనే విషయాన్ని చెప్పడం కాస్త కష్టమే. అయితే, ఈ సినిమాపై సన్‌ పిక్చర్స్‌ ఆశలు పెట్టుకుంది. అన్నీ తానై నడిపిస్తోంది. అదే సమయంలో ధనుష్‌ ఛరిష్మా కూడా ఉపయోగపడుతుంది. ఈ సినిమా థియేటర్స్‌లో ఎలా సందడి చేస్తుందో చూడాలి. ఇప్పటికే శివకార్తికేయన్‌ ‘డాన్‌’, కార్తి ‘విరుమన్‌’ మంచి టాక్‌ తెచ్చుకున్నాయి. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీ చూపు ధనుష్‌పై ఉంది’’ అని సినీ విశ్లేషకుడు రమేశ్‌ బాలా అభిప్రాయపడ్డారు.

‘గ్రేమ్యాన్‌’ తర్వాత పారితోషికం పెంచాడా?

రుస్సో బ్రదర్స్‌ దర్శకత్వం వహించిన ‘ది గ్రేమ్యాన్‌’లో ధనుష్‌ చిన్న పాత్ర పోషించారు. ఇందుకోసం రూ.4కోట్లు తీసుకున్నారని టాక్‌. సీక్వెల్‌లోనూ ధనుష్‌ ఉంటారని రుస్సో బ్రదర్స్‌ చెప్పారు. ఈ క్రమంలో ధనుష్‌ పారితోషికం పెంచినట్లు తెలుస్తోంది. దీనిపై రమేశ్‌ బాలా మాట్లాడుతూ.. భారతీయ చిత్రాలకు సంబంధించి ధనుష్‌ పారితోషికంలో పెంపు లేదని, కేవలం హాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే ఎక్కువ తీసుకుంటారని అన్నారు. అదే సమయంలో సినిమా బడ్జెట్‌ను బట్టి కూడా పారితోషికం మారుతుందని అభిప్రాయపడ్డారు. తెలుగ/తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘సర్‌’కు రూ.5కోట్లు తీసుకుంటున్నారట.

2019 ఫోర్బ్స్‌ గణాంకాల ప్రకారం సినిమాలు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా ధనుష్‌ రూ.31కోట్లకుపైనే ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ రూ.160కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. పోయోస్‌ గార్డెన్‌లో ధనుష్‌కు రూ.25కోట్ల విలువ చేసే భవంతి ఉంది.  దీంతో పాటు, ధనుష్ గ్యారేజీలో రోల్స్‌ రాయస్‌ ఘోస్ట్‌(రూ.6.95 కోట్లు), రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్స్‌ హెచ్‌ఎస్‌ఈ (రూ.1.50కోట్లు) మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌ క్లాస్‌ ఎస్‌350 (రూ.1.42కోట్లు) జాగ్వార్‌ ఎక్స్‌జే ఎల్‌ (రూ.1.11 కోట్లు) ఉన్నాయి. అంతేకాదు, వంబర్‌బార్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ధనుష్ పలు చిత్రాలను సైతం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ధనుష్‌ సెల్వరాఘవన్‌ ‘నానే వరువెన్‌’, వెంకీ అట్లూరితో ‘సర్‌’, అరుణ్‌ మాథేశ్వరన్‌తో ‘కెప్టెన్‌మిల్లర్‌’తో పాటు గ్రేమ్యాన్‌ సీక్వెల్‌లోనూ నటిస్తున్నారు.



Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని