
మీరు ప్రశ్నిస్తే.. నేను సమాధానం చెప్పాలా? దిల్జిత్
ముంబయి: బాలీవుడ్ నటులు కంగనా రనౌత్, దిల్జిత్ దొసాంజ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో కంగన ‘దిల్జిత్., తాను ఖలిస్తానీ ఉద్యమకారుడిని కానని చెప్పమనండి’అంటూ అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై దిల్జిత్ తనదైన శైలిలో సోమవారం ట్విటర్ ద్వారా స్పందించారు. పంజాబీలో ట్వీట్ చేస్తూ ‘ వాళ్లు టీవీ షోల్లో కూర్చుని దేశభక్తులం అనుకుంటున్నారు. దేశం అంతా తమ కోసమే ఉన్నట్టు భావిస్తున్నారు. ఇప్పటివరకు పంజాబీలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆ దేవుడు మళ్లీ అదే త్యాగమే కోరుకుంటే మేము సిద్ధం. ’ అంటూ కంగనా పేరు ప్రస్తావించకుండా ప్రశ్నించాడు
మరో ట్వీట్లో ‘ మీరు ప్రశ్నలడగాలి, నేను సమాధానం ఇవ్వాలి. ఏంటి ఈ డ్రామా అంతా? వాళ్లు దేశం గురించి, పంజాబ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ క్రమంలోనే చర్చను మరో కోణంలోకి నెట్టేస్తున్నారు. మీరు మమ్మల్ని ఎలా కావాలంటే అలా చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా బాగుంది’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. వీరిద్దరి మధ్య రైతుల ఉద్యమం మొదలైనప్పటించి ట్వీట్వార్ జరుగుతూనే ఉన్నసంగతి తెలిసిందే. ఈ ఉద్యమానికి దిల్జిత్ సానుభూతి తెలిపి, రైతులకు సహాయం కూడా చేశాడు. ఈ ఉద్యమాన్ని రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్నారని కంగనా ఆరోపిస్తోంది.
ఇవీ చదవండి!