Bommarillu: ‘బొమ్మరిల్లు 2 ఎప్పుడు?’.. ఆసక్తికర కామెంట్‌ చేసిన దర్శకుడు

సిద్ధార్థ్‌, జెనీలియా జంటగా దర్శకుడు భాస్కర్‌ తెరకెక్కించిన చిత్రం.. ‘బొమ్మరిల్లు’. ఈ సినిమా పార్ట్‌ 2 గురించి ప్రశ్న ఎదురవగా దర్శకుడు ఏం సమాధానమిచ్చారంటే?

Published : 05 Jun 2023 21:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బొమ్మరిల్లు’ (Bommarillu).. 2006లో విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో విశేష క్రేజ్‌ ఉంది. ఈ సినిమా రీ- రిలీజ్‌ కోసం, దాని పార్ట్‌ 2 కోసం ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ అభిమానుల తరఫున ఆ ప్రశ్నలను వ్యాఖ్యాత అడగ్గా ‘టక్కర్‌’ (Takkar) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దర్శకుడు భాస్కర్‌ (bommarillu bhaskar) సమాధానమిచ్చారు. మళ్లీ ఆ సినిమాని థియేటర్లలో చూడాలని తనకూ ఆసక్తిగా ఉందని, రీ- రిలీజ్‌ గురించి నిర్మాత దిల్‌ రాజుని అడగాలని అన్నారు. పార్ట్‌ 2 గురించి మాట్లాడుతూ.. సిద్ధార్థ్‌ అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నాడని, పదేళ్ల తర్వాతైనా అతడితో బొమ్మరిల్లు 2 తీయొచ్చని నవ్వులు కురిపించారు. సిద్ధార్థ్‌తో సినిమా తెరకెక్కించాలంటే దర్శకులకు చాలా తేలికైన పనని తెలిపారు.

క్లాసిక్‌ ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచే ‘బొమ్మరిల్లు’.. దర్శకుడి ఇంటిపేరుగా మారిన సంగతి తెలిసిందే. అందులోని పలు సంభాషణలు, పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్‌ జెనీలియా పాత్రలతోపాటు కథానాయకుడి తండ్రి పాత్ర (ప్రకాశ్‌రాజ్‌)ను తెలుగు ఆడియన్స్‌ ఎప్పటికీ మరిచిపోలేరు. ‘టక్కర్‌’ విషయానికొస్తే.. సిద్ధార్థ్‌ (Siddharth) హీరోగా దర్శకుడు కార్తీక్‌ జీ తెరకెక్కించిన యాక్షన్‌ ఫిల్మ్‌ ఇది. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక (Divyansha Kaushik). జూన్‌ 9 ఈ సినిమా విడుదలకానున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. బొమ్మరిల్లు భాస్కర్‌తోపాటు దర్శకులు తరుణ్‌ భాస్కర్‌, వెంకటేశ్‌ మహా, ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై, చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాక్షించారు. పూర్తిస్థాయి యాక్షన్‌ నేపథ్యంలో సినిమా చేయాలనే తన కల టక్కర్‌తో నెరవేరిందని సిద్ధార్థ్‌ ఆ వేదికపై మాట్లాడారు. టక్కర్‌లో తాను కొత్తగా కనిపిస్తానని, ఆ వైవిధ్యాన్ని చూసేందుకు థియేటర్లకి రావాలని ప్రేక్షకుల్ని కోరారు. ప్రముఖ నిర్మాత దివంగత రామానాయుడుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనిదని, ఆయనకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు