Adbhutham: అద్భుతం.. ఓ ఫాంటసీ ప్రేమకథ

‘‘అన్ని రకాల భావోద్వేగాల్ని ప్రేక్షకులకు అందించే సినిమా మా ‘అద్భుతం’’ అన్నారుద ర్శకుడు మల్లిక్‌ రామ్‌. ‘నరుడా డోనరుడా’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఆయన..

Updated : 16 Nov 2021 06:19 IST

‘‘అన్ని రకాల భావోద్వేగాల్ని ప్రేక్షకులకు అందించే సినిమా మా ‘అద్భుతం’’ అన్నారుద ర్శకుడు మల్లిక్‌ రామ్‌. ‘నరుడా డోనరుడా’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఆయన.. ఇటీవలే ‘తరగతి గది దాటి’ వెబ్‌సిరీస్‌తో మెప్పించారు. ఇప్పుడాయన తేజ సజ్జా, శివాని రాజశేఖర్‌లతో తెరకెక్కించిన చిత్రమే ‘అద్భుతం’. ఈ సినిమా ఈనెల 19న ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు మల్లిక్‌ రామ్‌.

‘‘దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అందించిన కథతో ‘అద్భుతం’ తెరకెక్కించా. నాలుగేళ్ల క్రితం తను నాకీ కథ చెప్పాడు. వినగానే నచ్చి.. చేద్దామనుకున్నాం. అప్పటికి నేను ‘పెళ్లిగోల’ అనే వెబ్‌సిరీస్‌ చేస్తున్నా. ఓవైపు ఆ సిరీస్‌ పనులు చూసుకుంటూనే.. మరోవైపు ఈ స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్దుకుంటూ వచ్చాం. 2019లో సినిమాని పట్టాలెక్కించాం. ఇదొక ఫాంటసీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. దీంట్లో చక్కటి ప్రేమకథతో పాటు సైన్స్‌ఫిక్షన్‌, థ్రిల్లింగ్‌ అంశాలు మిళితమై ఉంటాయి. ట్రైలర్‌లో చూపించినట్లు ఒకే ఫోన్‌ నంబర్‌ ఇద్దరికి ఎలా ఉందన్నది ఆసక్తికరం. మరి అదెలా సాధ్యమైంది? దాని వెనకున్న కథేంటి? అన్నది క్లైమాక్స్‌లో ఆకట్టుకునేలా చూపించాం. ప్రథమార్థమంతా వినోదాత్మకంగా ఉంటుంది. విరామానికి ముందు తేజ, శివానిల మధ్య వచ్చే ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలుస్తుంది’’.

* ‘‘ఈ సినిమాలో తేజ.. సూర్య అనే కుర్రాడిగా కనిపిస్తాడు. అతనికి ఓ చేదు గతం ఉంటుంది. దాని వల్ల చాలా ఒత్తిడికి గురవుతుంటాడు. అతని జీవితంలోకి వెన్నెల అనే అమ్మాయి ప్రవేశించాక.. అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. అవేంటన్నది తెరపైనే చూడాలి. సినిమాలో ఆ వెన్నెల పాత్రనే శివాని రాజశేఖర్‌ పోషించింది. చలాకీగా ఉండే అమ్మాయిలా కనిపిస్తుంది. వాస్తవానికి ఈ పాత్ర కోసం తొలుత అవికా గోర్‌ని సంప్రదించాం. ఆఖరికి శివానినే ఈ పాత్రకు బెస్ట్‌ ఛాయిస్‌ అనిపించింది. అందులోనూ తెలుగు తెలిసిన అమ్మాయి తను. ఇందులో సూర్య స్నేహితుడిగా సత్య కడుపుబ్బా నవ్విస్తాడు. సినిమా ఆఖరి 15 నిమిషాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. చాలా మంది దీన్ని ‘ప్లేబ్యాక్‌’తో పోలుస్తున్నారు. నిజానికిది పూర్తి భిన్నమైన కథతో రూపొందింది’’.

‘‘అన్ని రకాల భావోద్వేగాల్ని ప్రేక్షకులకు అందించే సినిమా మా ‘అద్భుతం’’ అన్నారుద ర్శకుడు మల్లిక్‌ రామ్‌. ‘నరుడా డోనరుడా’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఆయన.. ‘‘నేను ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాను. ‘గోల్కొండ హైస్కూల్‌’, ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశా. ఆ తర్వాత హీరో సుమంత్‌ నటించిన ‘నరుడా డోనరుడా’ చిత్రంతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చా. అయితే సరిగ్గా ఆ సినిమా విడుదలైన సమయంలోనే నోట్ల రద్దు జరిగింది. దీంతో ఆ ప్రభావం మా చిత్రంపై బాగా పడింది. ఆ తర్వాత నేను ‘పెళ్లిగోల’ అనే వెబ్‌సిరీస్‌ చేశా. అది మంచి విజయం సాధించడంతో.. వెంటనే దానికి కొనసాగింపుగా రెండు సీజన్లు చేశా. ఇక ఈ మధ్య ఆహాకి ‘తరగతి గది దాటి’’ అనే వెబ్‌సిరీస్‌ చేశా. ఇప్పుడా సిరీస్‌కు కొనసాగింపుగా ‘తరగతి గది దాటి2’ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాం’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని