ponniyin selvan: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’కు ద్వారాలు తెరిచింది ‘బాహుబలి’

చోళుల గురించి ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రెండు భాగాలు తీయడానికి ‘బాహుబలి’ తమకు

Updated : 19 Aug 2022 20:57 IST

హైదరాబాద్‌: చోళుల గురించి ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రెండు భాగాలు తీయడానికి ‘బాహుబలి’ తమకు బాటలు పరిచిందని, అందుకు స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళికి కృతజ్ఞతలు అన్నారు ప్రముఖ దర్శకులు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఎపిక్‌ పిరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ తెరకెక్కనుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 30న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా, శుక్రవారం హైదరాబాద్‌లో ‘చోళ చోళ’ సాంగ్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఎందుకో తర్వాత చెబుతా. ఇక చోళ సామ్రాజ్యం గురించి చెప్పే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లాంటి భారీ చిత్రాన్ని అదీ రెండు భాగాలుగా  తీయడానికి మాకు బాటలు పరిచిన రాజమౌళి గారికి కృతజ్ఞతలు. అందుకు కారణం ‘బాహుబలి’.  మా సినిమాకు విక్రమ్‌, కార్తి, జయం రవి చాలా చక్కని నటీనటులు దొరికారు. అలాగే టెక్నికల్‌ టీమ్‌ కూడా అద్భుతంగా పనిచేసింది.  ఈ సినిమా అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు.

శంకర్‌, మణిరత్నం చిత్రాల్లో నటిస్తే రిటైర్‌ అయిపోవచ్చు!

‘‘నాకు మణి సర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పుడు ‘రావణ్‌’ ఇచ్చారు. ఇప్పుడు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఆయన సినిమాలో నేను ఉన్నాననంటే అది నా అదృష్టం. శంకర్‌, మణిరత్నం చిత్రాల్లో నటిస్తే హ్యాపీగా రిటైర్‌ అయిపోవచ్చు. ఆ తర్వాత ఏ చిత్రాలు చేయకపోయినా ఫర్వాలేదు. అందరికీ ధన్యవాదాలు’’ అని విక్రమ్‌ చెప్పుకొచ్చారు.  ‘‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మణిరత్నం గారి కల. గొప్ప నటులు చేయాల్సిన పాత్రను ఆయన నాకు ఇచ్చారు. నాకు చాలా ప్రత్యేకం. కల్కి రాధాకృష్ణ రాసిన పొన్నియిన్‌ సెల్వన్‌ నవల సినిమాగా తీయాలని ఎందరో ప్రయత్నించారు. కానీ, 60ఏళ్ల తర్వాత ఇది సాకారమైంది. ఇది సినిమా కాదు.. హిస్టరీ. ఈ నవలలో ప్రతి పాత్రకూ ప్రత్యేకత ఉంది. కథలో అద్భుమైన డ్రామా ఉంది. ఇదొక విజువల్‌ వండర్‌. ఇలాంటి వాటికి మణి సర్‌, రెహమాన్‌లాంటి గొప్పవారు కావాలి. ఇది ఆనాటి రాజకీయాల గురించి చెబుతుంది. ఇప్పుడూ అలాంటి రాజకీయాలే ఉన్నాయి. చాలా రీసెర్చ్‌ చేసి  ఈ కథను సిద్ధం చేశారు. 140 రోజుల్లో పొన్నియిన్‌ రెండు భాగాలు తీయడం నిజంగా అద్భుతం’’ అని కార్తి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుహాసిని, ప్రకాశ్‌రాజ్‌, తనికెళ్ల భరణి, దిల్‌రాజు, అనంత శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని