Like Share Subscribe: చిరంజీవి రూపంలో అద్భుతం జరిగింది: మేర్లపాక గాంధీ

దర్శకుడు మేర్లపాక గాంధీ ఇంటర్వ్యూ. తన కొత్త చిత్రం ‘లైక్, షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ గురించి గాంధీ పంచుకున్న విశేషాలివీ..

Published : 03 Nov 2022 01:09 IST

హైదరాబాద్‌: ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi). ఆయన తాజా చిత్రం ‘లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ (Like Share & Subscribe). సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గాంధీ మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలివీ..

* ఈ కథాలోచన ఎప్పుడు వచ్చింది?

గాంధీ: లాక్‌డౌన్‌లో ఈ సినిమా ఆలోచన వచ్చింది. ఆ సమయంలో ట్రావెలింగ్‌కు సంబంధించిన వీడియోలను బాగా చూసేవాణ్ని. ట్రావెల్‌ వ్లాగ్స్‌ను చూస్తున్నప్పుడు మనమూ ఆయా ప్రదేశాలకు వెళ్లినట్టు ఉంటుంది. కొన్ని ఆసక్తికర ప్రాంతాలు, వాటి చరిత్ర గురించి కొందరు వ్యక్తులు వివరించిన తీరు నన్ను ఆకర్షించింది. అలా యూట్యూబర్‌ కథను తెరపైకి తీసుకొస్తే బాగుంటుందనిపించింది. ట్రావెల్‌ వ్లాగర్‌ ఎదుర్కొనే సమస్యలను ఈ చిత్రంలో చూపించబోతున్నాం.

* ఈ స్టోరీ విన్నాక నిర్మాత స్పందనేంటి?

గాంధీ: వెంకట్‌ బోయనపల్లి నిర్మాణ సంస్థలో ఎప్పుడో ఓ సినిమా చేయాలనుకున్నా. అది ‘లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’తో కుదిరింది. ఈ కథ, టైటిల్ ఆయన్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. నా మీద నమ్మకంతో దేనికీ రాజీపడకుండా సినిమా నిర్మించారు.

* ఈ కాన్సెప్ట్‌ కొన్ని వర్గాల ప్రేక్షకులకే కనెక్ట్‌ అయ్యేలా ఉంది కదా?

గాంధీ: అలాంటి సందేహమే వద్దండీ. ఈ సినిమా అన్ని వర్గాలను తప్పకుండా అలరిస్తుంది. ఈ కథ అందరినీ నవ్విస్తుందనే నమ్మకం నాకుంది. హీరోహీరోయిన్లు ట్రావెల్ వ్లాగర్లుగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరం. సమాజంలో నెలకొన్న ఓ సమస్యను అంతర్లీనంగా ప్రస్తావిస్తూ కథను ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దా. ప్రతి పదిహేను నిమిషాలకు స్క్రీన్‌ప్లే సరికొత్తగా ఉంటుంది.

* థియేటర్‌కు వెళ్లి చిన్న చిత్రాలను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందనే భయం ఉందా?

గాంధీ: ఆ భయం ఉంది. ఆ కారణంతోనే మా సినిమాని వినూత్నంగా ప్రమోట్‌ చేస్తున్నాం. ఎక్కువ మంది ప్రేక్షకులను ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకి తీసుకురావాలనేది మా లక్ష్యం. సినిమా బాగుందనే టాక్‌ వస్తే.. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వెళ్తారు.

* సంతోష్‌, అబ్దుల్లా గురించి ఏం చెబుతారు?

గాంధీ: సంతోష్‌ శోభన్‌ నేనూ కలిసి గతంలో ‘ఏక్‌ మినీ కథ’ సినిమా చేశాం. అప్పుడే ఆయన నటన నాకు బాగా నచ్చింది. ఈ సినిమా కథను ఆయనతో పంచుకోగా.. ‘నాకు నచ్చింది.. చేద్దాం’ అని అన్నారు. సంతోష్‌, ఫరియా ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వీరితోపాటు సుదర్శన్‌, బ్రహ్మాజీ పాత్రలు కీలకం. పి. పి. ఎఫ్‌ అనే ఓ గ్యాంగ్‌కు బాస్‌గా బ్రహ్మాజీ కనిపిస్తారు. డీవోపీగా సుదర్శన్‌ నవ్వులు పంచుతారు.

* ఈ సినిమా ప్రచారానికి చిరంజీవి తోడైనట్టున్నారు?

గాంధీ: అది ఊహించని పరిణామం. తాను నటిస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా టీజర్‌లో ‘లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్‌’ అనే డైలాగ్‌ను చిరంజీవి చెప్పారు. అందరూ ఆ క్లిప్‌ను పోస్ట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలోమా టీమ్‌ను ట్యాగ్‌ చేశారు. అప్పుడు ఎంతో ఆనందించాం. చిరంజీవిగారి రూపంలో మాకు అద్భుతం జరిగింది.

* కొత్త ప్రాజెక్టుల విశేషాలు?

గాంధీ: ప్రస్తుతం పలు స్క్రిప్టులు సిద్ధం చేసే పనిలో ఉన్నా. పెద్ద చిత్రాలనే తెరకెక్కించాలనుకుంటున్నా. ‘జవాన్‌’ సినిమా నిర్మాత కృష్ణ, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్‌, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లలో సినిమాలు చేయాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని