Parasuram: ‘సర్కారు వారి పాట’.. నా కల నెరవేర్చింది

‘గీత గోవిందం’తో సంచలన విజయం సాధించిన దర్శకుడు పరశురామ్‌. ఆ విజయమే ఆయనకి మహేష్‌తో సినిమా చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తనదైన రచనతో కట్టిపడేసే పరశురామ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

Updated : 07 May 2022 11:40 IST

‘గీత గోవిందం’తో సంచలన విజయం సాధించిన దర్శకుడు పరశురామ్‌. ఆ విజయమే ఆయనకి మహేష్‌తో సినిమా చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తనదైన రచనతో కట్టిపడేసే పరశురామ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

ఈ కథ ఎలా పుట్టింది?

‘గీత గోవిందం’ ఇంకో నెలలో విడుదలవుతుందనగా ఈ కథ అనుకున్నా. ఆ సినిమా విడుదల తర్వాత మహేష్‌బాబుని దృష్టిలో ఉంచుకునే సిద్ధం చేశా. ఆయనతో సినిమా చేయాలనేది నా కల. అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది.

మహేష్‌కి ఈ కథ చెప్పినప్పుడు ఆయన స్పందనేంటి?

ఆయనకి కథ ఎంతగా నచ్చిందో, ఆయన పాత్రని డిజైన్‌ చేసిన విధానమూ అంతే నచ్చింది. ఈ సినిమా చేయడానికి ఓ బలమైన కారణం అది. పాత్ర మొదలుకొని సంభాషణలు చెప్పడం వరకు అన్నీ కొత్తగా ఉంటాయి. ఇది వాణిజ్య వినోదంతో కూడిన కథే. హీరో లుక్స్‌, ఆ పాత్రని ఆవిష్కరించిన తీరు మరో స్థాయిలో ఉంటుంది. పెద్ద దర్శకులు ఉండగా,   పరశురామ్‌కి అవకాశం ఎందుకిచ్చారా? అనే సందేహం అభిమానుల్లో రావొచ్చు. ఇది చూశాక అది ఎందుకనేది  తెలుస్తుంది. అభిమానులే కాదు, సామాన్య ప్రేక్షకులూ మెచ్చేలా ఉంటుందీ చిత్రం. హీరోయిన్‌ పాత్రకి కీర్తిని ఎందుకు ఎంపిక చేశామో సినిమా చూశాక అర్థమవుతుంది. ఆమెకు మంచి పేరొస్తుంది. సముద్రఖని, తమన్‌ సంగీతం... ఇలా అందరి పనితనం ప్రత్యేకంగా కనిపిస్తుంది.

అప్పుని ఆడపిల్లతో పోల్చారు, ఈ కథకి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?

అప్పుని ఆడపిల్లతో పోల్చడంలోనే అసలు కథ ఉంది. రెండు విభిన్నమైన ఆలోచనల మధ్య సాగుతుంది. ఇక స్ఫూర్తి అంటారా? ఇందులో ఏ వ్యక్తి, వ్యవస్థ గురించీ ఉండదు. ఒక మంచి ఉద్దేశంతో చెబుతున్న కథ ఇది. సరదాగా ముందుకు నడుపుతూనే చెప్పాల్సింది బలంగా చెప్పే ప్రయత్నం చేశా. సందేశం ఇవ్వడం అంటూ ఉండదు కానీ, ఆఖర్లో ఓ బలమైన ఉద్దేశాన్ని చాటి చెబుతుంది. అది అందరికీ కనెక్ట్‌ అవుతుందనే నమ్మకం ఉంది.

ఈ చిత్రాన్ని చాలామంది ‘పోకిరి’తో పోల్చి చూసుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

‘పోకిరి’ బయటికి కనిపించని ఓ పోలీస్‌ అధికారి కథ. ఇది కామన్‌ మేన్‌ కథ. ఇందులో మరికొంచెం ఎక్కువగా ఓపెన్‌ అయినట్టు కనిపిస్తారు మహేష్‌. ఆయన మేనరిజమ్‌, లుక్‌, హావభావాలు చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతారు. ఆయన డ్యాన్స్‌లు ఉర్రూతలూగిస్తాయి. బ్యాంక్‌ నేపథ్యంలో కథ సాగినా మహేష్‌ మాత్రం బ్యాంక్‌ ఉద్యోగి కాదు. ఆయన ఒంటిపై కనిపించే పచ్చబొట్టు వెనకా ఓ కథ ఉంటుంది.

సంభాషణల విషయంలో మీకు ప్రేరణనిచ్చే విషయాలేమిటి?

మా గురువు పూరి జగన్నాథ్‌. అలాగే త్రివిక్రమ్‌ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు ఎప్పట్నుంచో చూస్తున్నా. మహేష్‌తో చేస్తున్నానని మా గురువు పూరి జగన్నాథ్‌కి చెప్పా. పేరు ప్రకటించాక, ట్రైలర్‌ చూశాక ఫోన్‌ చేశారు. ఆయనకి ట్రైలర్‌లో డైలాగులు బాగా నచ్చాయి. కథ చెప్పేటప్పుడే  ‘నేను విన్నాను... నేను వున్నాను’ అనే డైలాగ్‌ మహేష్‌కి చెప్పా. ఆయన సెట్లో  ఆస్వాదిస్తూ ఆ సంభాషణ చెప్పారు. ఆ సన్నివేశం చాలా బాగుంటుంది.

‘గీత గోవిందం’ మీ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపించింది?

గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. పరశురామ్‌ అనే దర్శకుడు రూ.150 కోట్ల సినిమా తీయగలడనే నమ్మకాన్నిచ్చింది. రూ.8 కోట్లతో తీసి రూ.150 కోట్లు స్థాయి విజయాన్ని సాధిస్తే అది దర్శకుడికి ఎంత ఆత్మవిశ్వాసాన్నిస్తుందో ఊహించొచ్చు.  నా ఆలోచనా విధానాన్నీ మార్చింది.

తదుపరి మీరు చేయనున్న సినిమా ఎవరితో?
నాగచైతన్య కథానాయకుడిగా 14 రీల్స్‌ సంస్థలో సినిమా ఉంటుంది. అది దీనికన్నా ముందే చేయాలనుకున్నా. అప్పట్లో రాసుకున్న కథతోనే ఇప్పుడు చేస్తా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని